నడక నేర్పిన చేయి తండ్రిది,
పడిపోతే లేపిన ధైర్యం తండ్రిది.
మన విజయాల వెనుక వినిపించని చప్పట్లు,
మన కలల వెనుక నిలిచిన నీడ తండ్రిది.
తండ్రి ప్రేమకు కొలమానం లేదు
అది జీవితాంతం వెలిగుతూ దారిచూపే దీపస్తంభం.
మనిషి జీవితంలో మొదటి ఆప్యాయత ఆనందం అనుభూతి ఆశ్చర్యం తల్లి అయితే, మొదటి ఆధారం నీడ నిలబెట్టే అదును నడిపించే చేయి నాన్న. తల్లి ప్రేమను మనం ప్రతిరోజూ అనుభవిస్తాం. తండ్రి ప్రేమను చాలాసార్లు అతను నడిచి వెళ్లి పోయినతర్వాత గుర్తిస్తాం. తల్లి స్పర్శ తెలుస్తుంది కన్నీళ్లు కనిపిస్తాయి. తండ్రి మౌనం కనిపించదు. తల్లి ఒడిలో సేదతీరుతాం, తండ్రి భుజాల మీద నిలబడి ప్రపంచాన్ని చూస్తాం.
అందుకేనేమో సాహిత్యం చాలాకాలం తల్లిని పాటగా పాడింది, తండ్రిని మాత్రం నీడలా చిత్రించింది. కానీ ఆ నీడలోనే ఎన్నో జీవితాలు ఎదిగాయి. ఆ మౌనంలోనే ఎన్నో కలలు పుట్టాయి. తెలుగు సాహిత్యంలో తండ్రి పాత్రను పరిశీలిస్తే, అది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. కుటుంబ వ్యవస్థ పరిణామ గాథ. సామాజిక మార్పుల చరిత్ర. తరాల మధ్య సంభాషణ.
పురాణాలు, ఇతిహాసాలలో తండ్రి వ్యక్తిగా కన్నా ధర్మానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. దశరథుడు కొడుకును ప్రేమించిన తండ్రి మాత్రమే కాదు, రాజధర్మం కోసం కన్నీళ్లు మింగిన వ్యక్తి. భీష్ముడు తండ్రి కోరిక కోసం జీవితాన్ని త్యాగం చేసిన కుమారుడు. ఈ కథలలో తండ్రి వ్యక్తిత్వం కంటే పితృస్వామిక విలువలు ప్రధానంగా నిలుస్తాయి. ప్రబంధ యుగంలోనూ కుటుంబం కంటే వంశం ముఖ్యమైంది. వ్యక్తిగత భావోద్వేగాలకు అక్కడ పెద్ద స్థానం లేదు. తండ్రి అంటే అధికారం, క్రమశిక్షణ, వారసత్వం. అయితే ఆధునిక సాహిత్యం వచ్చిన తర్వాత తండ్రి మనిషిగా కనిపించడం ప్రారంభమైంది.
తెలుగు కథా సాహిత్యంలో తండ్రి అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. పేదరికంతో పోరాడే రైతు. పిల్లల చదువు కోసం జీవితాన్ని తాకట్టు పెట్టిన ఉద్యోగి. తన భావాలను బయటపెట్టలేని మౌన మనిషి. తెలుగు కథల్లో తండ్రి ఎక్కువగా మాట్లాడడు. అతని చేతులు పలకరిస్తాయి. చేతలు మాట్లాడతాయి. ఆయన కార్చిన చెమట మాట్లాడుతుంది. రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరే ఆయన అడుగులు మాట్లాడతాయి.
అమ్మ “తిన్నావా?” అని అడుగుతుంది. నాన్న “ఫీజు కట్టావా?” ‘పరీక్ష ఎట్లా రాసావు’ అని అడుగుతాడు. ఆ ప్రశ్నలో ప్రేమ కనిపించదు. కానీ భవిష్యత్తు ధ్వనిస్తుంది. చాలా మంది తెలుగు కథకులు ఈ మౌన ప్రేమను ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల కథల్లో తండ్రి పాత్ర ఒక విషాద నాయకుడిలా కనిపిస్తుంది. కుటుంబం కోసం తన వ్యక్తిగత కోరికలన్నింటినీ వదులుకున్న వ్యక్తి.
అతని జీవితంలో విజయాల కంటే బాధ్యతలే ఎక్కువ.
ఇక తెలుగు నవలల్లో తండ్రి కుటుంబ వ్యవస్థకు కేంద్రబిందువుగా కనిపిస్తాడు. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ వంటి రచనల్లో తండ్రి కుటుంబ సంప్రదాయాల రక్షకుడు. మారుతున్న కాలానికి ఎదురు నిలబడే వ్యక్తి. గోపీచంద్ రచనల్లో తండ్రి ప్రభావం వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంత ముఖ్యమో కనిపిస్తుంది. ఆధునిక నవలల్లో తండ్రి–కొడుకు మధ్య భావజాల సంఘర్షణ ఒక ప్రధాన అంశంగా మారింది.
పాత తరం విలువలు, కొత్త తరం ఆశయాలు పరస్పరం ఢీకొన్నప్పుడు తండ్రి పాత్ర కొత్త అర్థాలను సంతరించుకుంది. అతడు ఇక కుటుంబ అధిపతి మాత్రమే కాదు. మార్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మనిషి.
తెలుగు కవిత్వంలో తండ్రి గురించి ఎక్కువగా రాయడం గత మూడు దశాబ్దాల్లో పెరిగింది. ఒకప్పుడు కవిత్వంలో తల్లి ప్రధాన ప్రతీకగా ఉండేది. కానీ ఆధునిక కవులు తండ్రి జీవితంలోని నిశ్శబ్ద విషాదాన్ని గుర్తించారు. తండ్రి మీద వచ్చిన అనేక కవితల్లో ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. తండ్రి గురించి కవులు ఎక్కువగా అతను మరణించిన తర్వాత రాస్తారు.
ఎందుకంటే జీవించి ఉన్నప్పుడు అతని ప్రేమ మనకు క్రమశిక్షణగా కనిపిస్తుంది. లేని తర్వాత మాత్రమే అది ప్రేమ అని అర్థమవుతుంది.
“అమ్మ ఏడిస్తే కన్నీళ్లు కనిపించాయి,
నువ్వు ఏడ్చినప్పుడు
నీ జుట్టు ఒక్కరాత్రిలో తెల్లబడింది.”
ఇదే తండ్రి కవిత్వ సారాంశం.
అతని బాధకు శబ్దం ఉండదు. అతని ప్రేమకు ప్రదర్శన ఉండదు.అతని త్యాగానికి సాక్షులు ఉండరు. అందుకే తండ్రి మీద వచ్చిన ఉత్తమ కవితలు స్మృతి కవితలుగా నిలిచాయి.
ఆత్మకథలు, స్మృతులు, బాల్య జ్ఞాపకాలలో తండ్రి అత్యంత సజీవంగా కనిపిస్తాడు.
బాల్యంలో భయపెట్టిన వ్యక్తి, యవ్వనంలో అర్థం కాని వ్యక్తి, వృద్ధాప్యంలో గుర్తుకొచ్చే వ్యక్తి తండ్రి. జ్ఞాపకాల్లో ఆయన రూపం తరచూ చిన్న చిన్న దృశ్యాల రూపంలో తిరిగి వస్తుంది.
చేతి పట్టుకుని బడికి తీసుకెళ్లిన ఉదయం. సైకిల్ నేర్పిన సాయంత్రం.పరీక్ష ఫలితాల రోజు.
మొదటి జీతం అందించిన క్షణం. మనకు అవి సంఘటనలు మాత్రమే. ఆయనకు అవి జీవిత విజయాలు. తెలుగు స్మృతి సాహిత్యంలో ఈ భావోద్వేగం ఎన్నోసార్లు కనిపిస్తుంది.
ఎందుకు తండ్రి మీద తక్కువ సాహిత్యం వచ్చింది అంటే ఈ ప్రశ్నకు సమాధానం తండ్రి స్వభావంలోనే ఉంది. తల్లి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. తండ్రి తన ప్రేమను నిర్వర్తిస్తాడు. తల్లి జ్ఞాపకంగా మిగులుతుంది. తండ్రి అలవాటుగా మిగులుతాడు.మన జీవితంలో గాలి ఎంత అవసరమో గమనించం. అది లేకపోతే మాత్రమే తెలుసుకుంటాం. తండ్రి కూడా అలాంటివాడే.
అందుకే సాహిత్యం అతన్ని ఆలస్యంగా గుర్తించింది. కాలం మారింది. కుటుంబాలు మారాయి. సంబంధాలు మారాయి. కానీ తండ్రి పాత్ర మాత్రం తన మూల స్వభావాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ అతడు కుటుంబానికి వెన్నెముకే. తన కలలను పిల్లల భవిష్యత్తులో కలిపేసుకున్న మనిషి.తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేసి, చివరికి “నేను ఏమీ చేయలేదు” అని చెప్పే వ్యక్తి. అమ్మ మనకు జీవితం ఇస్తుంది. నాన్న ఆ జీవితాన్ని నిలబెట్టే నేలను ఇస్తాడు. అమ్మ ప్రేమకు భాష ఉంది. నాన్న ప్రేమకు మౌనం ఉంది. తెలుగు సాహిత్యం ఆ మౌనాన్ని వినడానికి ఆలస్యంగా ప్రారంభించినా, ఒకసారి విన్న తర్వాత ఆ స్వరం ఎన్నటికీ మరచిపోలేదు.ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక కథ ఉంటుంది.ఆ కథకు మూలంలో తరచూ ఒక తండ్రి ఉంటాడు. అతని పేరు నాన్న కావచ్చు.నాయన కావచ్చు.బాపు కావచ్చు.
కానీ అతని ప్రేమకు ఒకే పేరు జీవితం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి