సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 ద్రోణుడు సుయోధనుడికి కవచధారణ విద్యను ఉపదేశించుట- 315 వ రోజు


అర్జునుడి పరాక్రమము చూసిన సుయోధనుడు ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నిన్ను లెక్క చేయక అర్జునుడు ముందుకు వెళ్ళి అందరిని చంపుతున్నాడు. మీరు చూస్తూ ఊరక ఉన్నారు. అర్జునుడి వంక కూడా చూడలేదు. తమరు నా కిచ్చిన వరం ఏమైనట్లు ? సైంధవుడు మిమ్ము నమ్మి ఎటూ పోకుండా రణరంగమున ఉన్నాడు. మీరు అతడిని రక్షించు ప్రయత్నము చేయ లేదు. అతడి చావు చూడాలని ఉందా. మీరు అసలు మనుషులేనా అని నాకు అనుమానంగా ఉంది . నా మనస్సు బాధపడుతుంది కనుక మిమ్మిలా అడుగుతున్నాను. సైంధవునికి రక్షణగా ఉన్న రధికులంతా పారి పోతున్నారు అతడిని రక్షించండి" అన్నాడు. ద్రోణుడు సుయోధనుడిని చూసి నవ్వి "సుయోధనా! నీ మాటలకు అశ్వత్థామ మాటలకు కోపిస్తానా! శ్రీకృష్ణుని తలపు కంటే అతడి గుర్రాలు వేగంగా పయనిస్తున్నాయి. అంతకంటే వేగంగా అర్జునుడి బాణాలు వెలువడుతున్నాయి. వాటిని ఆపగలిగిన శక్తి నాకు ఉందా! నేను ఈ స్థానం నుండి కదిలానంటే సైన్యం అల్లకల్లోలం ఔతుంది. ఆ పై సైంధవుని రక్షించుట కష్టం. కనుక నేను సేనా ముఖం నుండి కదలక ధర్మరాజును బంధించే ప్రయత్నం చేస్తాను. నేను వృద్ధుడిని కనుక అర్జునుడితో పరుగిడ లేను. నువ్వు అర్జునుడికి సమవయస్కుడవు కనుక అర్జునుడిని ఎదుర్కో " అన్నాడు. సుయోధనుడు " మిమ్ము కృతవర్మను ఎదుర్కొని దాటి వెళ్ళిన అర్జునుడిని ఎదుర్కొనుట నాకు సాధ్యమా! మీరు చెప్పారు కనుక వెళ్ళి పోరాడతాను " అన్నాడు. ఆ మాటకు సంతోషించి ద్రోణుడు " సుయోధనా ! నీకు కవచధారణ విద్యను నేర్పుతాను. దీనితో నువ్వు రక్షింపబడతావు. అర్జునుడు వేసిన శరములు నీ శరీరాన్ని తాకవు " అని ఒక బంగారు కవచం పై కవచధారణను ఆవహింప చేసి అది సుయోధనుడికి తొడుక్కోవడానికి ఇచ్చాడు. ద్రోణుడు " సుయోధనా! మొదట ఈ కవచ ధారణ విద్యను దేవతల సంరక్షణార్ధం బ్రహ్మదేవుడు ఇంద్రునికి ఇచ్చాడు. దేవేంద్రుడు దానిని అంగీరసునికి ఇచ్చాడు. అంగీరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివేశుడికి, అగ్నివేశుడు నాకు ఇచ్చాడు. నేను అది ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఇది ధరించి విజయుడివి కమ్ము " అని దీవించాడు. సుయోధనుడు కవచ ధారణ చేసి అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు.
కురుపాండవ యుద్ధము
కురు పాండవ సేనలు ఒకరికి ఒకరు తీసిపోకుండా ఘోరయుద్ధం చేస్తున్నారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొని కౌరవ సేనలను పీనుగుల కుప్పలుగా చేసాడు. ఎవ్వరికీ అతడి ముందు నిలవాడానికి ధైర్యం చాల లేదు. అది చూసి ద్రోణుడు పాంచాల కేకయ సేనలను ఎదుర్కొన్నాడు. అది చూసి ధర్మరాజు తన తమ్ములను తీసుకుని ధృష్టద్యుమ్నునికి సాయంగా వచ్చాడు. అది చూసి వికర్ణుడు వివిశంతిని, చిత్రసేనుడు భీముని, బాహ్లికుడు ఉపపాండవులను, దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవులని, సోమదత్తుడు శిఖండిని, అలంబసుడు ఘటోత్కచుని ఎదుర్కొన్నారు. శల్యుడు సైంధవుని పక్కనే ఉండి అతడిని రక్షిస్తూ అప్పుడప్పుడూ ధర్మరాజుపై బాణము వేస్తున్నాడు. దుశ్శాసనుడు సాత్యకిని మూర్ఛపోయేలా కొట్టాడు. కాని తేరుకున్న సాత్యకి దుశ్శాసనుడిని తరిమి తరిమి కొట్టారు. నకుల సహదేవుల పరాక్రమానికి తట్టుకోలేక శకుని ద్రోణుని వెనుక దాక్కున్నాడు.
కామెంట్‌లు