చిన్నపుడు మా చదువుల కోసం, ఉన్న ఊరిని వదిలి టౌన్ పక్కకి వెళ్ళే సాహసం చేసారు అమ్మానాన్న. నాకు ఏడేళ్ళ వయసపుడు కొక్కిరపాడులోని విశాలమైన ఇల్లు, తోట వదిలి, ఏలూరు చేరాము. అక్కడ పత్తేబాద సెంటర్లో మూడు ఇరుకు గదుల చిన్న ఇంట్లో నలుగురు అక్కా చెల్లెళ్ళం, అమ్మానాన్న, మా మేనత్తగారబ్బాయి, మా సహాయకురాలు తాయారు కలిసి ఎనిమిది మంది ఉండేవాళ్ళం. కాపురం మార్చాక స్కూళ్ళ వెతుకులాట మొదలయింది. మా పెద్దక్కని కెపిడిటిలోనూ మా చిన్నక్కని డాన్ బాస్కో లోనూ చేర్చారు. ఇక మిగిలింది నేనూ మా మూడో అక్క విజ్జి. నన్ను ఒక ఏడాది ముందుగా బళ్ళో వేసి ఉండటాన మేమిద్దరం ఒకే తరగతిలో ఉండేవాళ్ళం. మా ఇద్దరినీ మంచి స్కూల్లో చేర్చాలని గట్టిగా అనుకున్నారు. అప్పటికి ఏలూరులో ‘సెయింట్ థెరిస్సా కాన్వెంట్’ చదువుల నిలయం. అప్లికేషన్ పెట్టడం లాంటి తతంగాలు ముగిసాక ఒకరోజు మా ఇద్దరికీ పరీక్ష పెట్టడానికి పిలిచారు. పరీక్ష కోసం మా చేతికి నోటుబుక్కులు, పెన్సిళ్ళు ఇచ్చింది పొదుపరి అయిన అమ్మ. అప్పటివరకూ మేము పలకా బలపం బాచీ కనుక అవి పట్టుకోగానే కసింత డాంబికంగా అనిపించింది. సంబరంగా మా ఇద్దరినీ పరీక్షకి తీసుకుని వెళ్ళారు నాన్న. మేరీమాత అందమైన విగ్రహం, ఎత్తైన ప్రహరీ లోపల కంచుకోటలా కనిపిస్తున్న కట్టడాలు – అటువంటి స్కూలుని చూడటం ఆ వయసుని అబ్బురపరిచే విషయం. నాన్నని బైటే ఆపేసి, మమ్మల్ని లోపలికి తీసుకు వెళ్లి ఒక గదిలో ప్రవేశ పెట్టారు. అక్కడ ఇంకెవరూ లేరు, గదంతా ఖాళీగా ఉంది. ఒక కుర్చీ మాత్రం ఉంది. తీసుకు వెళ్ళిన ఆయా విజ్జిని నన్నూ గదికి చెరో మూలా నేల మీద కూచో బెట్టింది. ఈ ఆవరణం చిన్న మనసులో ఎంతలా మిగిలి పోయిందంటే చాలా సూక్షమైన విషయం ఒకటి గట్టి ముద్ర వేసింది – కరెంటు పోయిందో ఏమో అక్కడ లైట్లు లేవు, అన్నివైపులా మూసి ఉన్నగదిలో ఒక కిటికీ రెక్క ఓరగా తెరిచినపుడు ఎంత వెలుగు, గదిలో ఉంటుందో అంతే మసక వెలుగు. ఈ విషయం గుర్తు వచ్చినపుడల్లా ఆ మసక వెలుతురే ముందు పలకరిస్తుంది. కాసేపటికి ఒక టీచరమ్మ వచ్చింది. వెంటనే నేనూ విజ్జి, చిట్టిముత్యాల్లా లేచి నిలబడ్డాం. అప్పటికే డాన్ బాస్కోలో చేరిన చిన్నక్క బోధించినట్లు ‘గూడ్ మోణింగ్ టీచ’ అని కూడా ఆమెని పలకరించాం. రాగానే ఆమె మాకు పరీక్ష పెట్టారు. తప్పులు లేకుండా వరుస క్రమంలో ఎబిసిడి లు రాయాలి. కొక్కిరపాడు స్కూల్లో అప్పటికి ఇంగ్లీష్ చెప్పేవారు కాదు. కానీ సెలవల్లో ఇంటి దగ్గర నేర్చుకున్నాం. మాకు పరీక్ష ఇచ్చేసి, టీచరమ్మ హడావిడిగా బైటకి వెళ్ళిపోయింది. కాగితం గడుల లోపల పెన్సిల్ తో విన్యాసాలు మొదలు పెట్టి పరపరా రాసేసి విజ్జివైపు మిటుకూ మిటుకూ చూస్తూ కూచున్నాను. కాసేపటికి టీచరమ్మ వచ్చింది. ‘రాసేసారా?’ అంది. ‘ఓ’ అన్నాం. మా నోట్సులు ఇవ్వబోతే తీసుకోలేదామె. ‘మీ ఇద్దరిలో ఎవరు తప్పులు లేకుండా బాగా రాసారు?’ అనడిగింది. ఆ ప్రశ్నకి గుడ్లప్పగించి చూసాను. తొందరగా ఇంటికి వెళ్లిపోవచ్చనో, ఎగురుతూ తుళ్ళుతూ ఉండటం అలవాటు కావడం వల్లనో – ‘నేనే బాగా రాసా నేనే రాసా’ నోట్సు గాల్లో ఆడించి గెంతుతూ చెప్పింది విజ్జి. అయిపోయింది పరీక్ష. బైటకి వచ్చి నాన్నగారిని కలిసిన టీచరమ్మ, మా విజ్జికి సీటు ఇస్తున్నామని చెప్పింది. నాన్న ఆశ్చర్యపోయి ‘మా జాజి తెలివైనది, తనకి సీటు రాకపోవడం ఏంటని’ ఆశ్చర్యంతో అడిగారట. ‘ప్రశ్న అడిగితే గుడ్లప్పగించి చూసింది తప్ప ఆ పిల్ల మాట్లాడలేదు, పిల్లలన్నాక దబాయించి చెప్పడం నేర్చుకోవాలి, అందుకే ఫెయిల్ చేసాం’ అందట. ఇంటికి వచ్చాక మా ఇద్దరి నోట్సులూ పరిశీలించారు నాన్న. నా నోట్సులో ఒక్క తప్పు కూడా లేదు. విజ్జి నోట్సులో రెండు తప్పులు ఉన్నాయి. ‘నువ్వు బాగా రాసానని ఎందుకు చెప్పలేదని’ నాన్న అమ్మ అడిగారు. అప్పటికి చిన్నదాన్ని కనుక ఎలాంటి మాటల్లో వ్యక్తం చేసానో గుర్తు రావడం లేదు కానీ టీచరమ్మ ముందు గుడ్లప్పగించి చూసిన ఆ క్షణంలో నా మనసులో మెదిలిన ఒక నొచ్చుకోలు, ఒక ప్రశ్న, ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ఎలాంటి ఉపద్రవం నుంచయినా మా అక్కల్నీ నన్నూ ఒంటి చేత్తో దాటించే మా విజ్జితో నాకు పోటీ పెట్టారన్నది ఒకటి, ‘దూరదూరంగా కూచుని విడివిడిగా రాసాక ఎవరి దాంట్లో తప్పు ఉందీ ఎవరి దాంట్లో తప్పు లేదూ అన్నది మా ఇద్దరికీ ఎలా తెలుస్తుంది?’ అన్న ప్రశ్న ఒకటి నా ఆలోచనల్లోకి వచ్చాయి. మౌనంతో వేసుకునే ప్రశ్నల కన్నా దబాయింపే పరమ సత్యంగా, నీతి వాక్యంగా, విజయ సూత్రంగా నమ్మించే, బోధించే ఈ టీచరమ్మ లాంటిది మెజార్టీ లోకం. ఒక్క తప్పు లేకుండా రాసిన నా నోట్సు కూడా పరమ సత్యమో, గొప్ప జ్ఞానమో కాదని తెలుస్తూ వచ్చాక ఈ విద్యార్థిని పరాజయం సంపూర్ణమయింది. నలుపు, చీకటి, పశుత్వం, అనైతికం, దరిద్రం, కురూపత్వం, తక్కువతనం, చెడ్డతనం, అపజయాల గుట్టుమట్ల కోసం వాటితో చెలాంతికాలాడే నా మనసు, అందులో పడి నలిగే సవాలక్ష ఆలోచనలూ ప్రశ్నలే నేను కోరుకున్న విజయం.దబాయింపులన్నీ పరమ సత్యాలు కానట్లే అన్ని మౌనాలూ అంగీకారాలు కావు. - జాజి మల్లి జాజి


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం