కూకట్ల "ఆరుద్ర పురుగు" ఒక జ్ఞాపకాల దొంతర ! "నాగరికతకు నడక నేర్పిన ఇప్పపూల వొయ్యారాలు పుట్టతేనే పరువాలు జిగిరి జిందగీలు జిగురు గతాలు ఇత్తునాల పండుగ ఇగురాలు" అంటూ ఆదివాసీల బతుకు ముచ్చట్లను "ఆరం" పేరుతో కూకట్ల తిరుపతి రాసిన కవితలో పూసగుచ్చినట్టు చెప్పారు. అడవితల్లి ఒడిలోనే మానవ జీవితం పురుడోసుకున్నది. ఇప్పటి మైదాన ప్రాంత మనుషులకు మూలాలు అక్కడనే ఉన్నాయి. మానవులు ఏది తినాలో? ఏది తినకూడదో? తెలిపిన విజ్ఞానులు మూలవాసులు. ఏ మొక్క ఏ రోగానికి పనికొస్తుందో? ఏ చెట్టు పండు ఎలాంటి సత్తువను అందిస్తుందో? అనుభవపూర్వకంగా చెప్పినవారు ఆటవికులు. అనేక విషయాలలోని ప్రాథమిక పరిజ్ఞానాన్ని మనం వారి నుంచే పొందినాము. ప్రస్తుతం నాగరికులమని, అన్నీ మనకే తెలుసని చెప్పుకు తిరుగు తున్నాము. మన స్వార్థం కోసం వాళ్ళ నివాసాలనే నీట ముంచుతున్నాము. ఖనిజాల పేరుతో ఖాళీ చేయిస్తున్నాము. తెలంగాణ రాకడ యాళ్ళ ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు నివసించే ఏడు మండలాలను పోలవరం పొట్టన వెట్టుకున్న వైనానికి కవి కంటతడిపెడతాడు. పక్క వారికి పంచిపెట్టడం నాగరికతనా? అందరిదీ నాకే కావాలనుకోవడం నాగరికతానా? ఎవరిది అసలైన నాగరికత ? అనే ప్రశ్న ఉదయిస్తుందిక్కడ. చిన్నపుడు మాకు ఐదవ తరగతిలో నాగరికత అనే ఒక పాఠం ఉండేది. అప్పుడు నాగరికత అంటే ఏమిటో సరిగా అర్థం కాపోతుండేది. పరీక్షలో నాగరికత అంటే ఏమిటి ?" అని ప్రశ్న వచ్చేది. సమాధానాన్ని బట్టీపట్టి "సహజత్వానికి కోమలత్వం అద్దడమే నాగరికత " అని రాసేది. దాని వివరం ఏమిటో అప్పుడు తెలిసేది కాదు. తలపై జుట్టు పెరగడం అత్యంత సహజం, దాన్ని కత్తిరించుకోవడమే కోమలత్వం అని సార్లు చెప్పేవారు. మంచిగా తయారు కావడంతో పాటు మనిషిగా నడుచుకోవడమే నాగరికత అవుతుంది. పెరిగిన జుట్టును అలా వదిలివేయడం కూడా ఈ రోజుల్లో నాగరికత కిందనే లెక్కిస్తున్నరు సుమా! కాలానుగుణంగా పెను మార్పులు వస్తున్నవి. కానీ విపరీత పోకడలే ప్రమాదకరం. ఆదిమ మానవుడు ఎట్లా ఉండే వాడు? అంటే, అచ్చం చింపాంజీ లాగా ఉండే వాడని తెలిపే చిత్రాలు ఆ పాఠం లో ఉంటుండేవి. ఆ లెక్కన నాగరికతకు నడకలు నేర్పిన వాళ్ళు నాయి బ్రాహ్మ్మణులు అవుతరు కావచ్చు? ఆదిమ కాలంలో మానవుడు ఏమి తినే వాడు? వంటలు ఎలా చేసుకొనే వాడు? అనే సందేహాలు వచ్చేవి. ఆ కాలంలో వాడిన మట్టి రాగి, ఇత్తడి పాత్రలు ఆధునిక తవ్వకాల్లో బయటపడ్డాయని చరిత్ర అధ్యయనాల వలన తెలిసింది. మట్టి పాత్రల్లోనే వంటలు వండడం ఆనవాయితీగా వచ్చింది. అందుకే మట్టితో కుండలు చేసే కుమ్మరులే నాగరికతకు మూలపురుషులని అనవచ్చు . ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ పుస్తకంలో తిరుపతి రాసిన " మట్టిపూలు ఒక మనాది " అనే కవితను చదివినప్పుడు నాకు ఇదంతా గుర్తుకు వచ్చింది. "గుడిసెముంగట పరుసుకున్న నల్లరేగడి ఇత్తులు పచ్చులు సయి సూడని ఎండుగ కల్లమయ్ ఉల్లారుతయి మంగలం పెంకలో మక్కలేంచినట్టు పట్టపగటీలి సెగల తెగెండుతయి సూరు నీడల పిలగాండ్ల బువ్వ కూరాటల్ల కసికలు లట్టగువ్వలు బోల్లయితయి .................... ఇల్లు గూనపెంకల దుప్పటి కప్పుకొనంగ కూరాడు నీరాడులను పొందిచ్చి ఎగిలివారంగ ఇండ్లల్లకచ్చుడు లగ్గంల ఐరేండ్లు కొలువుదీరి గరిగెబుడ్లు ఇచ్చిపుచ్చుకొనంగా " మట్టి పాత్రలను కళ్ళ ముందు నిలిపారు. ఇపుడు ప్రపంచీకరణ ప్రభావంతో స్టీలు, ప్లాస్టిక్ పాత్రలు రాజ్యమేలుతున్నాయి. వీధిన పడ్డ కుమ్మరి బతుకుల దైన్యాన్ని కూకట్ల కవితగా మలిచారు. పద్యాలకైతే అర్థం తాత్పర్యం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ పుస్తకం చదువుతున్నపుడు ఆ అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే ఈ పుస్తకంలోని అన్ని కవితలు తెలంగాణ భాషలో రాయబడినవే కావడం విశేషం. ప్రజాకవి కాళోజీ అన్నట్లు మనకు "బడిపలుకుల భాష కాదు. పలుకు బడుల భాష కావాలి". తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మన కవులు ఎక్కువగా ప్రజల భాషలోనే రాయడం శుభ పరిణామం. పుస్తక సమీక్ష అనగానే పుస్తకం కవర్ పేజీ నుండి మొదలు అందులోని అంశాలన్నిటిని స్పృశించాలి. చివరి పేజీనీ సైతం వదలవద్దని పెద్దలు చెబుతుంటరు . ఇది చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది. కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. కాబట్టి దీనిని " జ్ఞాపకాల దొంతర " అనవలసి వచ్చింది. నా ఉద్యోగ రీత్యా కొంత కాలం జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చింది. అవి కరీంనగర్ కు పశ్చిమ దిశగా ఉండే ప్రాంతాలు. అంతకు మునుపు ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు. అక్కడి నుండి అటు నిజామాబాద్ కు దారిపడ్డది. ఏదన్న కొత్తది కొంటే మా పెద్దపల్లి వాళ్ళు అపురూపంగా చూసుకుంటరు. బండి మీద చిన్న గీతపడ్డ ఓర్సుకోరు. కాని ఆ ప్రాంతం వాళ్ళు కారును ఎడ్ల కచ్చురం లాగా వాడుతుంటరు. వాటిలో గడ్డిమోపులను పెట్టుకుపోయే దృష్యాలు అప్పుడు నా కండ్లల్ల పడేది . నేను అక్కడ ఉండడానికి ఇల్లు "వెతకాలి " అన్న . వాళ్ళు " లెంకాలి " అన్నరు. నేను 7ను "ఏడు " అని అంటే, అక్కడి మితృడు "యోడు " అని పలికేది. అక్కడ కనబడ్డ ఓ కీటకాన్ని నేను "దువ్వెన" అని అంటే వాళ్ళేమో " గూబ " అని పిలిచేవారు . కొంతకాలం ఈ పదాలు కొత్తకొత్తగా అనిపించేవి . అట్ల తెలంగాణ లో తిరుగుతున్నప్పుడు అనేక వైవిధ్యాలతో కూడుకున్న పదజాలం అలవడింది. ఈ అంశాలన్ని " మట్టి పదాల బోయిడు " శీర్షికన కూకట్ల తిరుపతి రాసిన కవిత చదువుతున్నపుడు జ్ఞప్తికి వచ్చాయి. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డా: నలిమెల భాస్కర్ గారు ఈ సందర్భంగా గుర్తుకు వచ్చిండ్రు. ఆయన తయారు చేసిన తెలంగాణ పదకోశం యాదికి వచ్చింది. దానితో పాటే భాష యాసల అనుభవాలు యాదికి వచ్చినవి. ఆయనను గూర్చి కూకట్ల తిరుపతి ఈ కవితలో....... "మానేరు తీరాన మొలచిన భాషల చెట్టు తన పద్నాలుగు రెక్కలుసాపి దేశ దేశాల పక్షులను అక్కున చేర్చుకుంది దాని నీడన సేదతీరిన జీవులు ఆ అడుగు జాడలను యెల్లడల పరుస్తూ నిరుద్దులకు నిలువనీడ పడుతున్నవి దాని కొమ్మల్ల పూసిన గడ్డిపూలు తెలంగాణ త్యాగాలను పులుంకొని దశదిశల మట్టి వాసన వెదజల్లుతున్నవి ఆ కల్పతరువు రసాలు తాగి కమ్మని పదకోశపు ఇగుర్లు తిని కోయిలలు జనంగోడును వల్లిస్తున్నవి " అనుకుంటూ పద్నాలుగు భాషలలో ఆరితేరిన భాస్కరుని సమగ్ర మూర్తిమత్వాన్ని అక్కరాలలో కవి చక్కగా చెక్కారు. మా ఊరు కోమండ్లపల్లి. ఉదయాన్నే బడికి బయలు దేరి కాట్నపల్లి మీదుగా రాజీవ్ రహదారి వెంట నడుచుకుంటూ సుల్తానాబాద్ చేరుకొనేది. రోడ్డుకు ఇరువైపుల అల్లనేరడి చెట్ల నీడలో మా తిరుగు ప్రయాణం ఉత్సాహభరితంగా సాగేది. కొంత కాలానికి మాకు బస్సు పాసులు ఇచ్చిండ్రు. మా ఊరు నుండి కాట్నపల్లికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి సుల్తానాబాద్ బడికి వెళ్ళేది. ఓ రోజు తిరుగు ప్రయాణం లో సుల్తానాబాద్ బస్టాండులో విద్యార్థులమందరం బస్సు ఎక్కినం. కాట్నపల్లిలో దిగినం. మాలో ఒక చిన్నారి మిస్సయింది. స్టేజీ దగ్గర ఆగి లబోదిబోమంటున్నం. ఈ లోగా మరో బస్సులో కండక్టరు ఆ చిన్నారిని కాట్నపల్లి స్టేజీ కాడా దింపి మాకు అప్పజెప్పిండు. అప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు. ఆ చిన్నారే నా చెల్లెలు. ఈ పుస్తకం లోని "పేగు సంవందం " అనే శీర్షికన కవి రాసిన కవిత చదువుతున్నప్పుడు నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చింది. "రగుత సంవందం పులుముకున్నా ! పరాయి కడుపున పుట్టిన ల్యాగలు ఇంట్ల ల్యాగదూడలెట్లయితయి ? రాకిట్ల పున్నం రాంగనే మా మొకం ల నెత్తురుండదు బతుకమ్మ బోనాల పండుగలప్పుడు పానమంతా ఎండుగయ్ చిత్తుబొత్తయితది మంగలార్తి ముట్టిచ్చినకాడల్ల మన్సు బొత్తిగ గావరయితది ఆడిబాల అలికిరి ఇనిపించక ఇల్లు ఇరువాటు సిన్నబుచ్చుకుంటది కడుపుల పుట్టిన ఆడవిల్ల లేని చావు చావద్దంటరు " అంటూ ఆడపిల్లలపై తిరుపతికి గల ఇష్టాన్ని, మమకారాన్ని, ఆయన వాక్యాలుగా పేర్చారు. తెలంగాణాలో ఆడపిల్లలను ఆడబిడ్డగా గౌరవిస్తరు మరియు కొలుస్తరు. ఆత్మగల్ల ఆడపిల్లలు ఇంటికి వెలుగు. తెలంగాణ భాషలో తెలంగాణ సంస్కృతిని,సంప్రదాయాలను ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా, అక్షరీకరించారు. ఈ పుస్తకం తెలంగాణ అస్తిత్వ వేదనకు ఆనవాళ్ళుగా నిలుస్తుంది. "" ఆరుద్ర పురుగు " అనే ఈ పుస్తకం ను " రోహిణి " కార్తె లో చదవడం మొదలు పెట్టిన కాని లాక్ డౌన్ సడలింపులతో నాకున్న తిరుగుడు రోగం వల్ల ఒక చోట కుదురుగా ఉండలేకపోయినా , అందుకే మిగతా బుక్కుల్లాగా దీనిని గబ గబ చదవలేకపోయిన . మొత్తానికి "మృగశిర " కార్తె లో పూర్తి చేసిన . ఇందులో మొత్తం 37 కవితలు ఉన్నవి. ఇవి ఎవరికైనా సులువుగా అర్థం అయితయి. ఈ పుస్తక కవి Kukatla Thirupathi గారు రాసిన మరో పుస్తకం ఎర్రగాలు. అది ఇదివరకే చదివిన, ఈ రెండు పుస్తకాలు కవల పిల్లల్లా ఉన్నవి. సాహితీ సోపతి ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రదాన పుస్తక కేంద్రాల్లో లభిస్తుంది. దీని వెల వంద రూపాయలు మాత్రమే. పుస్తక సమీక్షలు: తానిపర్తి తిరుపతి రావు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
వేసవి జ్ఞాపకాలు:- కేమిడి రుక్మిణి-7వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల లింగాల గణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

జీవితం!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY

నా వేసవి జ్ఞాపకాలు:- బుషమైన పావని-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల లింగాల ఘణపురం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

మగువలు!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి