నాగదత్తుడనే జమీందారు చాలా గర్విష్టి. జమీందారుననే అహంకారంతో మిడిసిపడేవాడు.ఒకరోజు ఆయన చిన్ననాటి మిత్రుడు రాఘవుడు వాళ్లింటికి వచ్చాడు. రాఘవుడు ఘనవైద్యుడు. అందులోనూ పక్షవాతం వంటి నరాలజబ్బుల ప్రత్యేకవైద్యంలో దిట్ట.
నాగదత్తుడి ఇంట్లో పదిరోజులున్న రాఘవుడు వైద్యానికి సంబంధించిన ఎన్నో మెలుకువలు నాగదత్తుడికి నేర్పించాడు. అనేక రకాల ఔషధమొక్కల్ని పరిచయం చేశాడు.వైద్యవిధానాల్ని రాసిచ్చాడు.
ఒకసారి నాగదత్తుడి చెల్లెలుభర్త శేఖరుడికి పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోయాయి. విషయం తెలిసిన నాగదత్తుడు వాళ్లూరెళ్లి బావగారికి వైద్యం చేసి పూర్తిగా నయం చేశాడు.శేఖరుడు చక్కగా లేచి తిరుగుతున్నాడు.
నాగదత్తుడి కొడుకు వినయదత్తుడు "నాన్నా!మీరు నరాలవైద్యంలో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు. పక్షవాతానికి సరైనవైద్యం చేసేవారు ఈదరిదాపుల్లో లేరు.మీకు నేర్పిన రాఘవయ్యగారు దూరదేశం వెళ్లారు. వైద్యంకోసం సుదూరప్రాంతాలకు వెళ్లలేక ప్రజలు బాధపడుతున్నారు.మీరు వైద్యసేవలందిస్తే వారి బాధలు తప్పుతాయికదా!"అన్నాడు.
అందుకు నాగదత్తుడు "నేను వైద్యం చేయడమా?ఇంట్లో వాళ్లకూ,దగ్గరిబంధువు
లకూ వైద్యమందించడమైతే ఏమోగానీ ఒకజమీందారునై ఊళ్లో వాళ్లకు వైద్యం చేయడమా?రాఘవుడు బతుకుదెరువుకోసం వైద్యం చేస్తున్నాడు. నాకేం తక్కువ? వీధినపోయేవాళ్ల చేతులకు,కాళ్లకు పసర్లు రాయాల్సిన ఖర్మ నాకుపట్టలేదు.సేవాభావమని మన స్థాయిని దిగదార్చుకోవటం నాకిష్టంలేదు"అన్నాడు.
వినయదత్తుడు తండ్రికి ఎంతచెప్పినా వినలేదు.చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది.
కొంతకాలానికి ముసలివాడయిన నాగదత్తుడిని ఓఆలోచన కలవరపెట్టింది. 'తనకు వయసు మీరుతోంది. తనకు పక్షవాతమొస్తే వైద్యం చేసేవాళ్లెవరు? తన తర్వాత ఆవిద్య తన కుటుంబసభ్యులకు తెలియకుండా పోతుందికదా!' అన్నదే ఆ ఆలోచన.
కొడుకు వినయదత్తుడికి విషయం చెప్పి, వైద్యవిద్యను నేర్పించాడు. వినయదత్తుడు పట్టుదలగా నేర్చుకున్నాడు.
తన భవంతి సమీపంలోని సువిశాలమైన స్థలంలో వైద్యశాలఏర్పాటు చేశాడు. ఊళ్లోవాళ్లందరికీ వైద్యం అందించే వాడు. నాగదత్తుడికి కొడుకుతీరు నచ్చలేదు. జమీందారైన తనకొడుకు అందరి కాళ్లూ పట్టుకుని పసర్లు రాయడం సహించలేకపోయాడు. వద్దని మొత్తుకున్నాడు. అయినా వినయదత్తుడు తండ్రి మాటల్ని చెవికెక్కించుకోలేదు.
నరాలవ్యాధులు,పక్షవాతంతో ఎంతో మంది కదల్లేని స్థితిలో వైద్యం కోసం వస్తున్నారు. వినయదత్తుడు పేదలకు ఉచితవైద్యం అందిస్తున్నాడు.వైద్యశాలకు వచ్చేవారంతా నాగదత్తుడిని కలిసేవారు. వినయదత్తుడి గొప్పదనాన్ని ప్రశంసించేవారు. అలాంటి కుమారుడిని కన్న మీఋణం ఎన్నిజన్మలెత్తినా తీర్చుకోలేమని కృతజ్ఞతలు తెలిపేవారు.
చుట్టుపక్కల వందగ్రామాల్లో ఆయన పేరు మారుమోగింది.గతంలో నాగదత్తుని వద్ద పనిచేసేవారు,ఆయనతో అవసరమున్న వారు మాత్రమే ఆయనను గౌరవించేవారు. ఇప్పుడు నాగదత్తుడు ఎక్కడికెళ్లినా ఎనలేని గౌరవం లభిస్తోంది. వారి వంశగౌరవం పెరిగింది. తరతరాలకూ తరగని సిరిసంపదలున్నా, ఇంతకాలం నాగదత్తుడిలో ఏదో అసంతృప్తి, అశాంతి ఉండేవి.ఇప్పుడు మనసు హాయిగా, తృప్తితో, శాంతి నిండిఉంది. ఇదే విషయం కొడుకుతో అంటే "నాన్నా!తరగని సంపదలున్నంతమాత్రాన మనశ్శాంతి లభించదు.అలాంటి వారు ఎక్కడెక్కడో తిరుగుతూ,మనశ్శాంతికోసం వెదుక్కుంటున్నారు.ఇతరులకు చేతనైనసాయం చేయటంలోనే మనశ్శాంతి,తృప్తి,జీవితానికి సార్థకత ఉన్నాయి.ఆఆనందం వెలకట్టలేనిది. శాశ్వతమైనది."అన్నాడు వినయంగా.
నాగదత్తుడికి తన అశాంతికి కారణం అర్థమయింది.సత్కార్యాలు చేయడంలో, మానవసేవలో తానూ పాలుపంచుకోవటానికి వైద్యశాలలోకి నడిచాడు.
మనశ్శాంతి: --డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి