తగిన శాస్తి: -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్:9908554535.

 పూర్వం రామాపురం అనే  గ్రామంలో  దుర్గయ్య అనే శివ భక్తుడు ఉండేవాడు. అతడు  చాలా పిసినారి. అతనికి దేవునికి ఏదైనా పెట్టాలనే ఆలోచన కలిగింది. ఎంతోమంది బిచ్చగాళ్ళు అతని ఇంటికి వచ్చినా వారిని ఏమీ లేదని కసరి కొట్టి పంపేవాడు.    
         ఒకరోజు దుర్గయ్య కలలో కనబడిన శివుడు తాను అతని ఇంటికి వస్తానని ,తనకు డబ్బుకానీ, బంగారం కానీ  దానం చేయమని చెప్పాడు. దుర్గయ్య శివుడి కోసం ఎదురుచూచి ,ఎదురు చూచి అతని కళ్ళు కాయలు కాశాయి. ఎంతో మంది బిచ్చగాళ్ళు వచ్చి వెళ్లారు కానీ శివుడు మాత్రం రాలేదు. దానితో దుర్గయ్య రాత్రి కలలో శివుడిని రాలేదేమని ప్రశ్నించాడు. శివుడు ఆశ్చర్యపోయి" దుర్గయ్యా !నేను మీ ఇంటికి బిచ్చగాని  రూపంలో వచ్చాను. నీవు నన్ను కసరి  కొట్టావు. గుర్తుందా"!  అని ప్రశ్నించాడు? దుర్గయ్య చాలా నొచ్చుకొని  "అయ్యో స్వామీ !మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను. రేపు మళ్లీ రండి" అని వేడుకున్నాడు.  
             మరునాడు దుర్గయ్య శివుడి కోసం చూశాడు. ఒక బిచ్చగాడు" అమ్మా! ఏదైనా నాకు తినడానికి పెట్టండి "అని అడిగాడు. వెంటనే దుర్గయ్య అతడిని లోపలికి తీసుకొని వెళ్లి ,కడుపు నిండుగా భోజనం పెట్టి, అతనికి ఒక పెద్ద బంగారు నగల మూటను ఇచ్చి సాగనంపాడు. ఆ రాత్రి కలలో దుర్గయ్య శివుడితో మాట్లాడాడు. " స్వామీ ! నగల మూట తమకు అర్పించు కున్నాను. నా కోరిక ఇన్నాళ్లకు తీరింది" అని అన్నాడు. దానికి శివుడు" ఏం దుర్గయ్యా! ఎప్పుడు నాకు నగల మూట ఇచ్చావు .ఈ అబద్ధాలు కూడా నేర్చావా" అంటూ ప్రశ్నించాడు? "  అదేమి స్వామీ!  మీరు మా ఇంటికి వచ్చారు కదా! అప్పుడు మీకు భోజనం కూడా పెట్టాను కదా!" అంటూ గుర్తు చేశాడు. అది విన్న శివుడు" అయ్యో పిచ్చి దుర్గయ్యా! నేను మీ ఇంటికి ఈరోజు రానేలేదు .ఎవరో దొంగ నీ ఇంటికి బిచ్చగాని రూపంలో వచ్చి నీ  నగల మూటను తస్కరించాడు" అనే సరికి దుర్గయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.  తెల్లవారిలేచి లబోదిబోమని మొత్తుకున్నాడు పిసినారి దుర్గయ్య. ప్రజలందరూ శివుడు ఇతనికి తగిన శాస్తి చేశాడని సంబర పడ్డారు.
కామెంట్‌లు