పూర్వం కోనాపురం గ్రామంలో కనకయ్య విశాలమ్మ అను దంపతులు ఉండేవారు . వారికి చాలా ఆస్తితో పాటు ఒక నల్లని ఆవు ఉండేది . ఇంత ఉన్నా వారికి తేరగా మరొక ఆవు కావాలని ఉండేది. ఆ అవును మేపుటకై రంగడు అను వెర్రిబాగులవాడిని వారు కుదుర్చుకున్నారు.ఒకరోజు రంగడు అవును మేపుటకై అడవికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు కనకయ్య చాటుగా వెళ్లి రంగడికి తెలియకుండా తన అవును దొంగతనంగా తెచ్చుకున్నాడు. ఆ అవును ఎవరికీ కనబడకుండా మరొక ఇంటిలో కట్టి వేశాడు. ఆ తర్వాత రంగడిని తన ఆవు ఏదని ప్రశ్నించాడు? రంగడు ఏమి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు . అప్పుడు కోపించిన కనకయ్య,విశాలమ్మ దంపతులు తమ ఆవును తమకు తెచ్చియిమ్మని అన్నారు. రంగడు "దొరికిన తర్వాత ఇస్తాలే" అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు. అందుకు కోపించిన కనకయ్య గ్రామాధికారికి రంగడిపై ఫిర్యాదు చేశాడు . గ్రామాధికారి తర్వాత రంగడిని పిలిపించి అడుగుతానని అన్నాడు .
ఇలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు గ్రామంలో మరొక తప్పిపోయిన ఆవు కొందరికి కనబడింది. దానిని వారు గ్రామాధికారికి అప్పగించారు. ఈ సంగతి తెలిసిన కనకయ్య,విశాలమ్మ దంపతులు ఆ ఆవు తమదేనని అన్నారు .కానీ రంగడిని ఆనవాళ్లు అడగనిదే ఆ ఆవు ఇవ్వనని గ్రామాధికారి సెలవిచ్చాడు .వెంటనే గ్రామాధికారి రంగడిని పిలిపించాడు.దాని రంగు చెప్పమన్నాడు. రంగడు "నల్లనిది" అని అన్నాడు .దాని కొమ్ములు" పొట్టివా! లేదా పొడుగువా" ! అని గ్రామాధికారి ప్రశ్నించాడు ? "మధ్యస్థంగా ఉంటాయి" అని అన్నాడు రంగడు. "దాని తోక ఎలా ఉంటుంది?" అని ప్రశ్నించాడు గ్రామాధికారి.రంగడికి ఒళ్ళు మండింది. వెంటనే వాడు " దానికి తోక లేదు. పీకలేదు" అని పెడసరిగా సమాధానం ఇచ్చాడు. అతడు చెప్పినట్లు ఆ ఆవుకు తోక లేనేలేదు. నల్లగా ఉంది. కొమ్ములు మధ్యస్థంగా ఉన్నాయి .ఆనవాళ్లు సరి పోయినందున గ్రామాధికారి ఆ అవును రంగడికి అప్పగించాడు.
రంగడు ఆ అవును కనకయ్య దంపతులను తోలుకొని వెళ్ళమన్నాడు. వారు ఆ అవు తమది కాదని తెలిసినప్పటికీ, దురాశతో తేరగా దొరికిందని, తమ వ్యూహం పారిందని తీసుకొని వెళ్లారు. దానిని కట్టివేసి తమ ఆవును తీసుకొని వద్దామని వారు మొదటి అవును దాచిన ఇంటి వద్దకు వెళ్ళేసరికి అక్కడ వారి ఆవు లేదు .ఎవరో దానిని ఎత్తుకొని వెళ్లారు. దానితో మళ్ళీ తమ ఆవు పోయిందని ఫిర్యాదు చేయలేక ఘొల్లుమన్నారు.అందుకే దురాశ పనికిరాదు.అమాయకులను మోసం చేయకూడదు.
దురాశ : -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.-మొబైల్: 9908554535.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి