వెంటాడే జ్ఞాపకాలు : దాసరి వెంకటరమణ

 చందమామ అభిమానులందరికీ అందిన గౌరవం
చందమామ చిత్రకారులు శంకర్, గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఆయన మరణానంతరం ప్రకటించారన్న అసంతృప్తి ఏ మూలో కాస్త ఉన్నప్పటికీ, చందమామలో బొమ్మలేసుకునే ఓ ముసలాడి ప్రతిభను గుర్తించి, పట్టం గట్టి, పద్మశ్రీ ని కట్టబెట్టడం చందమామ అభిమానులందరికీ ఆనందమే!
 చందమామ బొమ్మల ద్వారా, ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు ఆయన రూపకల్పన చేసిన విధానం అనన్యం. సెప్టెంబర్ 29 2020 రోజున  ఆయన మరణించినప్పుడు బేతాళ విక్రామార్కునితో కలిపి ఆయన ఫోటో లేని, ముఖపుస్తకం కూటమి లేదు, వాట్సాప్ గ్రూప్ లేదు. ఆయన ప్రతిభా ప్రభను ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ని ప్రధానం చేయడం చందమామ అభిమానులందరికీ ఒకింత గౌరవ, గర్వ కారణం.
 1985 జులై చందమామలో నా కథ మాటనేర్పరికి ఆయన మొదటి సారిగా బొమ్మలు వేశారు. ఆ తర్వాత చాల కథలకు ఆయన బొమ్మలు వేశారు. చందమామలో నా చివరి కథ మోసం (2012 నవంబర్ సంచిక)కు కూడా శంకర్ గారే బొమ్మలు వేశారు.
 ఈ సందర్భంగా ఆయనతో నా అనుబంధం గురించి రెండు సంఘటనలు చెప్పుకోవాలి.
మొదటిది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 1986 లో కాలేజి విద్యార్థులతో కలసి విద్యా విషయక టూర్ వెళ్ళినప్పుడు అందరూ మద్రాస్ సిటీ చూస్తూంటే, నేను దారి వెతుక్కుంటూ వడపళనిలో వున్న చందమామ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ శంకర్ గారిని మొదటి సారిగా చూశాను. చాలాసేపు తదేకంగా ఆయన వేస్తున్న బొమ్మను చూస్తూండి పోయాను. తర్వాత ఆయనతో "మనం పురాణాలలో అనేకమంది దేవతల గురించి చదువుతున్నాం. కానీ వర్ణనను బట్టి వాళ్ళు  ఇలా ఉండొచ్చు అని ఊహించుకోవడమే తప్ప ఎన్నడూ చూడలేం. కానీ మీ బొమ్మలను చూశాక ఆయా పాత్రలను ఊహించుకోవడం మానేసి, ఇలాగే ఉంటారు అనే నిశ్చయానికి వచ్చేస్తాం. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.'' అన్నాను. ఆయన అయిదు నిముషాలు మాట్లాడలేదు. అలాగే బొమ్మ వేయడంలో మునిగి వున్నారు. నేను ఏమైనా తప్పు మాట్లాడానా, ఎక్కువ మాట్లాడానా లేక ఈయన అసలు మాట్లాడర  .. ఈయన తత్త్వం ఇంతేనేమో ఇలా ఆలోచనల్లో మునిగి వున్నాను. ఒకసారి బాల సుబ్రహ్మణ్యం గారి వంక చూసాను. ఆయనే నన్ను శంకర్ గారికి పరిచయం చేసింది. (వీరు చందమామ సంపాదక వర్గంలో ఒకరు. కుటుంబరావు గారి తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారికి సహాయంగా ఉన్నారు.) అప్పుడు పెద్దాయన నోరు విప్పారు. "మీ కథలు చదివాక దాసరి వెంకటరమణ అంటే ఏ యాభై అరవై ఎండ్లో ఉంటాయను కున్నాను. ఇలా బిలో ట్వెంటీ యియర్స్ యంగ్ అని అనుకోలేదు."అన్నాడు. అంతే మాట్లాడాడు. తర్వాత తన పని తను చేస్తూనే వున్నాడు. 
రెండవది: 2012 మార్చి చందమామలో వచ్చిన విత్తనం గింజ అనే కథకు ఆయన బొమ్మలు వేశారు. ఆయన బొమ్మకు కథలు వేశాక ఆ కథ మీద ఆయన అభిప్రాయాన్ని, నాటి చందమామ సంపాదకులు శ్రీ రాజశేఖరరాజు గారికి చెబితే, ఆయన ఒక ఉత్తరం ద్వారా నాకు ఆ విషయం తెలియజేస్తూ..... 
  '.......మీ కథకు బొమ్మలు వేయవలసిందిగా సీనియర్ చిత్రకారులు శంకర్ గారికి పంపించాము. ఆయన చందమామ ఆఫీసుకు వచ్చి పని చేస్తున్న కాలంలో తెలుగు కథను ఒకటికి రెండు సార్లు చదివించుకుని అర్థం చేసుకుని తర్వాతే బొమ్మలు వేసేవారు. ఇంటిపట్టునే ఉంటూ ఇప్పుడు బొమ్మలు వేస్తున్నారు కనుక కథ ఇంగ్లీష్ అనువాదాన్ని పంపిస్తే దాని రెండు సార్లు చదివి తర్వాతే బొమ్మలేయడానికి కూచుంటారు. కథలో ఏమాత్రం సందేహం వచ్చినా, బొమ్మకోసం పంపిన వర్ణనలో కాస్త తేడా ఉందని గమనించినా వెంటనే ఫోన్ చేసి బొమ్మను కాస్త మార్చవచ్చునా అని అడుగుతుంటారాయన. 
 ఆయన మీ కథ ముందుగా చదివారు. అతిశయోక్తి అనుకోకుంటే మీ కథ చదివాక ఆయన నిజంగా కదిలిపోయారు. సందేహ నివృత్తికోసం ఫోన్‌లో మాట్లాడుతూ, తనను విశేషంగా ఆకర్షించిన ఒక వ్యాక్యాన్ని పదే పదే తల్చుకుని ప్రస్తావించారు. 
 "చిన్న పిల్లవాడిని బడికి పంపకుండా పనిలో పెట్టి చాలా తప్పు చేశావు సూరయ్యా, అసలు చిన్నపిల్లవాడిని పనిలో పెట్టడం నేరం. తెలుసా!" అంటూ టీచర్ మాధవయ్య, పిల్లవాడి తండ్రిని మందలిస్తే, "తెలియదయ్యా, ఆకలి తప్ప మాకేమీ తెలియదు. రేపటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం పూట గడవటం లేదు," అంటాడు ఆ పేద తండ్రి.
 శంకర్ గారు 'ఆకలి తప్ప మాకేమీ తెలియదు' అనే ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకున్నారు. 'ఎంత గొప్ప వ్యక్తీకరణ.. ఆకలి ముందు ఈ ధర్మసూత్రాలూ పనిచేయవ'ని చెబుతూ, ఇలాంటి కథలు చందమామకు ప్రాణం పోస్తాయంటూ ఆయన కదిలిపోయారు. రచయితలను ప్రోత్సహిస్తే, రచనలు పంపమని వారి వెంటబడి మరీ ఒత్తిడి పెడితే చందమామకు కథలు కరువా..! అంటూ ఆయన ఏకవాక్యంతో మీ కథను శిరసున పెట్టుకున్నారు.' అంటూ రాశారు.
నిజంగా నా కథపై శ్రీ శంకర్ గారి ప్రశంశ నేను మరువలేనిది.
 ఈ రోజు శంకర్ గారు లేరు. ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ చందమామ శిరసున అలంకరించిన కీర్తి కిరీటంగా నేను భావిస్తున్నాను. ఈ ఆనందం చందమామ అభిమానులందరిదీ.
కామెంట్‌లు