సంగీతంలో ఓ ముచ్చట: -విషయ సేకరణ - యామిజాల జగదీశ్
 కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రముఖులలో జీ. ఎన్. బాలసుబ్రహ్మణ్యం గారొకరు. 1959లో ఆకాశవాణి అంటే రేడియోలో జీఎన్బీగారి గాత్రకచ్చేరీ ప్రత్యక్ష ప్రసారమైంది. 
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన కమలాంబాం భజరే అనే కృతి ఆలపించారు. ఆయన పాడిన ఈ కీర్తనకు మన మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు వయోలిన్ వాయించడం గమనార్హం. ఈ కార్యక.రమం ప్రసారమైన మరుసటి వారమే ఇదే కృతిని బాలమురళీకృష్ణగారు ప్రత్యక్ష ప్రసారంలో పాడారు.  అప్పుడు బాలమురళీగారి వయస్సు 29 ఏళ్ళు.
ఇదలా ఉంటే కమలాంబాం భజరే కీర్తన విషయానికి వద్దాం. 
ఈ కీర్తన కృతికర్త శ్రీ ముత్తుస్వామి దీక్షితులు గారు. ఆయనను దీక్షితార్ అని కూడా అనే వారు. ఆయన అమ్మవారి భక్తుడు. ఆయన శ్రీ విద్యను అర్చించేవారు. శ్రీ చక్ర యంత్రానికి  తొమ్మిది ఆవరణలు ఉంటాయి. ఈ తొమ్మిది (నవ) ఆవరణలను ఆయన కీర్తనలలో వర్ణించారు. అమ్మవారి ఈ ఉపాసన కృతులను నవావరణ కీర్తనలు అని అంటారు. 
త్యాగరాజువారు “పంచరత్న కీర్తనలు” ఏ విధంగా  ప్రసిద్ధి చెందాయో అట్లగా దీక్షితుల వారి “నవావరణ” కీర్తనలు కూడా  ప్రసిద్ధి చెందాయి. 
ముఖ్యంగా దేవీ నవరాత్రులప్పుడు ఈ కీర్తనలను ఆలపిస్తారు. 
ఈ కీర్తనలు మొత్తం పదకొండు. మొదటి ధ్యాన కీర్తనైతే చివరది మంగళహారతి కీర్తన. ఈ రెండూ పోగా మిగిలినవి తొమ్మిది నవావరణ కీర్తనలవుతాయి. ఈ అన్ని కీర్తనలు “కమలాంబికే” లేదా “శ్రీ కమలాంబికే” అని ప్రారంభింపబడతాయి.
ఈ పదకొండు కీర్తనలను రాగదేవతలకు దేవాలయాలు” అని అంటారు. 
కమలాంబాం భజరే ...కీర్తన కళ్యాణి రాగంలోది ( ఆది తాళం). 
ఆ కీర్తన పూర్తి పాఠం....
పల్లవి
కమలాంబాం భజరే రే మానస
కల్పిత మాయా కార్యం త్యజ రే
అనుపల్లవి
కమలా వాణీ సేవిత పార్శ్వాం
కంబు జయ గ్రీవాం నత దేవాం
కమలా పుర సదనాం మృదు గదనాం
కమనీయ రదనాం కమల వదనామ్
చరణం
సర్వాశా- పరిపూరక-చక్ర స్వామినీం
పరమ- శివ కామినీం
దుర్వాసార్చిత గుప్త- యోగినీం
దుఃఖ ధ్వంసినీం హంసినీమ్
నిర్వాణ నిజ సుఖ ప్రదాయినీం
నిత్య కల్యాణీం కాత్యాయనీం
శర్వాణీం మధుప విజయ వేణీం
సద్-గురు గుహ జననీం నిరంజనీమ్
గర్విత భండాసుర భంజనీం
కామాకర్షిణ్యాది రంజనీం
నిర్విశేష చైతన్య రూపిణీం
ఉర్వీ తత్వాది స్వరూపిణీం
కామెంట్‌లు