తల్లిదండ్రులు: గంగమ్మ, వెంకటప్పయ్య.ఒక జాతి జీవన స్థితిగతులు , ఆచార వ్యవహారాలు ,మెరుగైన జీవితం కోసం చేసిన పోరాటాలు వాటి ద్వారా సాధించిన ఫలితాలు సాహిత్యంలో ప్రతి ఫలించిన నాడే వాటికి శాశ్వతత్వం ఏర్పడుతుంది.తెలుగు వారి జీవితాల్ని సాంస్కృతిక పునర్వికాస వెలుగులో కథా సాహిత్యంలో రికార్డు చేసిన వారిలో అగ్రగణ్యులు ,ఆద్యులు భండారు అచ్చమాంబ. తెలంగాణ, ఆంధ్ర, విదర్భ,చత్తీస్ ఘడ్ ప్రాంతాల్లోని జీవితాలతో లోతైన సంబంధాలు కలిగిన అచ్చమాంబ 19వ శతాబ్దంలోనే తాను చూసిన జీవితాలను, వాటిలో రావాల్సిన మార్పుల్ని కథా సాహిత్యంలో రికార్డు చేశారు.ఆధునిక కథానిక ప్రక్రియకు అక్షరార్పణ చేసింది, పునాది వేసింది భండారు అచ్చమాంబే.తెలుగులో మొట్టమొదటి సారిగా ఆధునిక పద్ధతిలో కథలు రాసిన వారిలో భండారు అచ్చమాంబ ఆద్యులు. ఆవిడ రచనలు ఆనాటి ప్రజల జీవితాల్ని అధ్యయనం చేసి వాటిలో మెరుగైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో పాత్రలను సృష్టించి వాటి ద్వారా కథని నడిపించిన తీరు ఆధునికతకు అద్దం పట్టింది .భండారు అచ్చమాంబ మొట్టమొదటి కథ “రాయసం వెంకటశివుడు" సంపాదకత్వంలో వెలువడిన ' తెలుగు జనానా ' పత్రికలో 1898 జూలైలో ' ప్రేమ పరీక్షణము ', 1898సెప్టెంబరులో ' ఎఱువు సొమ్ము పరువు చేటు ' పేరిట అచ్చయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా వెంకటశివుడు 1945 లో హైదరాబాద్ నుంచి వెలువడ్డ 'తెలుగు తల్లి' కొమర్రాజు లక్ష్మణరావు స్మారక సంచికలో రాసిండు. అయితే ఇప్పటికీ 'తెలుగు జనానా' పత్రిక సంచికలు పూర్తిగా అందుబాటులో లేనందున ఇదే పత్రికలో 'మే'లో అచ్చయిన' గుణవతియగు స్త్రీ ' మొట్టమొదటి కథగా స్వీకరించాల్సి ఉంటుంది.భండారు అచ్చమాంబ రాశారని తెలుస్తున్న మొత్తం 12కథల్లో పది కథల శీర్షికలు:- 1. గుణవతియగు స్త్రీ , 2. లలితా శారదలు ,3. జానకమ్మ , 4. దంపతుల ప్రథమ కలహం ,5. సత్పాత్ర దానము , 6. స్త్రీ విద్య , 7. ధనత్రయోదశి ,8. భార్యభర్తల సంవాదం , 9. అద్దమును , సత్యవతియును , 10. బీద కుటుంబము .మొసలికంటి రాంబాయమ్మ సంపాదకత్వంలో వెలువడ్డ “హిందూ సుందరి” పత్రికలోనూ, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ సంపాదకత్వంలోని 'సావిత్రి' పత్రికల్లో అచ్చమాంబ రచనలు చాలా అచ్చయ్యాయి. ఇందులో ' అబలా సచ్చరిత్ర రత్నమాల ' దేశ విదేశాల్లోని వీర , ధీర వనితల ఉదాత్త చరిత్రల వ్యాస సమాహారం. ఆనాటి మహిళల్లో స్ఫూర్తి , రచనా ప్రేరణను కలిగించిందంటే అతిశయోక్తి కాదు.తెలుగునాట పునర్వికాసోద్యమానికి 20వ శతాబ్ది ఆరంభం నుండి విస్తృతంగా పని చేసిన అచ్చమాంబ ఆంధ్రదేశంలో మొట్టమొదటి సారిగా 1901 బృందావనీ స్త్రీ సమాజాన్ని మచిలీపట్నంలో నెలకొలిపారు. ఆ మరుసటి సంవత్సరం అక్కడే కృష్ణా పత్రిక స్థాపించబడింది . ఇదే సమయంలో తెలంగాణలో పునర్వికాసోద్యమానికి పునాదులు పడ్డాయి .అచ్చమాంబ తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు పూనిక మేరకు హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించబడింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ , మద్రాసు,బొంబాయిలకు రైలు సదుపాయాలు విస్తృతం కావడంతో ఈ ప్రాంతాలకు రాకపోకలు తరచుగా జరిగాయి. వీటి వల్ల అచ్చమాంబ , తెలంగాణ , తెలుగు సాహిత్యం , పునర్వికాసోద్యమాలు లబ్ధిపొందాయి .అచ్చమాంబ రాసిన కథలన్నీ ఆధునిక భావాలతో పాత్రల సంభాషణలతో, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాసినవే. స్త్రీల చదువే సర్వ సమస్యలకు పరిష్కార మార్గమని నేటి ‘పాపులేషన్ సిద్ధాంత ' కర్తలు చెబుతున్న విషయాన్నివందేళ్ళ క్రితమే ఆచరణకు ప్రయత్నించిన సాహసి అచ్చమాంబ.అటు బొంబాయి,ఇటు బిలాస్ పూర్,నాగపూర్ , హైదరాబాద్ , మచిలీపట్నం , రాజమండ్రి ,వారణాసి ఇలా చాలా ప్రదేశాలు తిరిగి తమ భావాల్ని ఉపన్యాసాలు , రచనలు , ఉత్తరాలు , పుస్తకాలు , ప్రసంగాల ద్వారా బహుళ ప్రచారంలోకి తెచ్చిన ఆమె చైతన్యం నేటికీ స్ఫూర్తిదాయకం .అచ్చమాంబ కథలన్నీ ఆధునిక భావాలకు వేదికలు. ప్రతి కథలోనూ సమాజోద్ధరణ,మహిళాభ్యున్నతి, మెరుగైన సమాజం కోసం తహతహ ప్రతి అక్షరంలో ప్రత్యక్షమయ్యేవి .20 వ శతాబ్ది ఆరంభంలో తన కథల ద్వారా తెలుగు సమాజంలో ముఖ్యంగా మహిళల్లో ఆమె చెదరని ముద్ర వేశారు. ఆనాడు చదువుకున్న ప్రతి స్త్రీ ఏ ప్రాంతం వారైనా ఆమె ప్రభావానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె కార్యాచరణ , వాక్చాతుర్యం వీటికి తోడు భిన్న ప్రదేశాల్లో వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఒకరిగా కలిసి పోయారు.వీటన్నింటితో పాటు పట్టించుకోవాల్సిన మరో ప్రధాన విషయం అచ్చమాంబ ప్రాంతం . అచ్చమాంబను ఏఒక్క ప్రాంతానికి పరిమితం చేయలేం . ఎందుకంటే ఇప్పటి నల్లగొండ జిల్లాలోని, ఒకప్పటి కృష్ణాజిల్లాలోని మునగాల పరగణా మేనేజరు కొమర్రాజు వెంకటప్పయ్య – గంగమ్మల సంతానంగా ఆమె పుట్టింది . అయితే ఆమె ఎక్కువ భాగం జీవితం గడిపింది తెలంగాణలో. రాజా నాయని వెంకట రంగారావు ప్రభావం ఆమె పై ఎక్కువగానే ఉండింది .వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆవిడపై మిగతా ఏ ప్రాంతంతో పోల్చుకున్నా తెలంగాణ వారికే ఎక్కువహక్కుంది. అచ్చమాంబ మూలాలు మాత్రం ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి .1874 లో అచ్చమాంబ తాత (తల్లి - తండ్రి) వ్యాపార లావాదేవీల కారణంగా నందిగామలో ఉండిపోయారు. వీరితో పాటు గంగమ్మ కూడా అక్కడే ఉండడంతో అచ్చమాంబ నందిగామలో జన్మించింది .అయితే అచ్చమాంబ ఆరేండ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో వారి మకాం సవతి తల్లి కొడుకు కొమర్రాజు శంకరరావు దగ్గరికి మారింది . అప్పుడాయన ఉద్యోగరీత్యా నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉండేవాడు . దీంతో ఈసారి పూర్తిగా ఆమె నల్లగొండ వాసిగా మారారు . ఇక్కడున్న సమయంలోనే ఓనమాలు నేర్చుకున్నారు .వివాహం తరువాత ఆమె మకాం విదర్భకు మారింది .అక్కడ తమ్ముడితో పాటు నాగపూర్ , బిలాస్ పూర్ లలో విద్యాభ్యాసం జరిగింది.ఇక్కడున్న కాలంలోనే గుజరాతీ ,మరాఠీ , తెలుగు , హిందీ భాషలు నేర్చుకుంది .కేవలం కథలే గాకుండా “అబలా సచ్చరిత్ర రత్నమాల” పేరిట తెలుగులో మొట్టమొదటి సారిగా మహిళల జీవిత చరిత్రల్ని రాసింది. క్రోషా అల్లిక , వంటలు , కుట్లు వంటి మహిళలకు సంబంధించిన విషయాల్ని పట్టించుకొని వాటి ప్రచారాని కోసం తన జీవితాన్ని వెచ్చించారు . కేవలం రాతలకే పరిమితం గాకుండా ఆచరణలో అనాథ పిల్లల్ని ఆదుకున్నారు. దాంతో ఆవిడ అనాథ పిల్లల్లోనే తన పిల్లల్ని చూసుకుంటూ వారి బాగోగుల్నిపట్టించుకునేవారు .1904 చివర్లో బిలాస్ పూర్ లో ప్లేగు వ్యాధి వచ్చిన సందర్భంలో అనాథ పిల్లల్ని చేరదీసి వారి ఆలన పాలన చూశారు. పిల్లల నుంచి ఆ వ్యాధి ఆమెకు సోకి వారి సేవలోనే 1905 జనవరి 19 న అచ్చమాంబ మరణించారు . కేవలం 30 ఏండ్ల జీవితంలోనే కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా కృషిని , ఆచరణను మనందరికీ అందించిన అచ్చమాంబ ఆశయాలను అమలు పరచడమే ఆవిడకు నిజమైన నివాళి .(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “తెలంగాణ తేజోమూర్తులు” గ్రంధం నుండి.)
భండారు అచ్చమాంబ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి