గోవిందపురం ఒక అందమైన జ్ఞాపకం.: --వసుధా రాణి

 మా కాకమ్మ సంక్రాంతి అరిసెలు నోట్లో ఉండటం వలన కబుర్లు చెప్పలేదు అందువలన కబురు కాస్త ఆలస్యం అయ్యింది .మీరందరూ కూడా పండగ హడావిడిలో ఉంటారని ఆశించి ఈ ప్రసారం ఆలస్యం చేసాము.
మా గోవిందపురపు రంగమ్మామ్మ  లాంటివాళ్ళు ఇంక భూప్రపంచం మీద కనపడరని నాకు గొప్ప నమ్మకం .ఇది చదివాక మీరుకూడా ఆమాటని ఒప్పుకుంటారు.  20 ఏళ్ల మా నాన్నగారి పెదనాన్న కొడుకుకు 13 సంవత్సరాల ఈవిడని ఇచ్చి పెళ్లిచేశారు.అలా రంగమ్మగారు మాకు ఆమ్మ వరస అయ్యారన్నమాట.పాపం దురదృష్ట వశాత్తు ఈవిడ కాపురానికి వెళ్ళకుండానే ఈవిడ 14 ఏట మాపెదనాన్నగారు పాముకాటుకు గురియై మరణించారు.అప్పటినుంచి ఈవిడ తండ్రిగారి ఇంట్లో గోవిందపురం అనే చిన్న పల్లెటూరులోనే ఉండిపోయారు. అయితే అత్తగారి తరఫు వాళ్ళమైన మా అందరితో చుట్టరికం బాగానే నడిపేది మా ఆమ్మ .మాఇంటికి బాగా వస్తుండేది .నా చిన్నతనం నుంచి ఆవిడ బాగా అలవాటు.
మాఇంట్లో ఇంతమంది అక్కచెల్లెళ్ల,వీళ్ళందరికీ పుట్టిన పిల్లల పుట్టినరోజులు ఆవిడకి తెలుగు సంవత్సరాలు తిధులతో సహా గుర్తు.రాణీ చైత్ర పౌర్ణమి కదే నీ పుట్టినరోజు అని చెప్పేది. ఒక్క మనిషి గురించి ఆవిడ చెడుగా చెప్పగా నేను వినలేదు.ఎప్పుడూ మడిలోనే ఉండేది.మడి కట్టుకోకుండా మంచినీళ్లు కూడా తాగేది కాదు.చాదస్తంగా ఉండే వాళ్ళగురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాడు రంగమామ్మ మడిలే అని చెప్పుకొనే వాళ్ళం.పెళ్లిళ్లు ,పురుళ్ళు  అంటే ఆవిడే ఇష్టంగా వచ్చి సహాయం చేసేది.పిల్లలు సరిగ్గా తినకపోతే ఎట్లా అని మీగడ పెరుగు, వెన్న అన్నీ ఎక్కువెక్కువ పెట్టేది.
ఆవిడ పొలం కౌలు వసూలు చేసి పెడతానని నన్ను ఇంకా బాగా చూసుకునేది.
ఒకసారి నన్ను, మాపద్మక్కని పట్టుబట్టి వాళ్ళ ఊరు గోవిందపురం తీసుకెళ్లింది.ఆవూరు ఎంత బాగుందంటే.నరసరావుపేట నుంచి చిలకలూరి పేట వెళ్లే దారిలో కోమటివారిపాలెం దగ్గరదిగి 3 కిలోమీటర్లు నడవాలి. మొదట ఓ మంచినీటి చెరువు దాని పక్కన ఓ వంద గడప గల చిన్న ఊరే గోవిందపురం.వెళ్లే దోవంతా రంగమ్మగారు ఎవరీ పిల్లలు అని పలకరింపులే.పెద్ద పాత కాలం పెంకుటిల్లు ఆవిడ నివాసం.తల్లితండ్రులు చనిపోయినాక ఆవిడ ఒక్కతే ఉండేది ఆయింట్లో.
రంగమ్మ గారింటికి చుట్టాలొచ్చారని ఒకళ్ళు దొడ్లో కాసిన కూరలు ఇస్తే, ఒకళ్ళు పాలు పెరుగు ఇస్తే ఇంకొకళ్ళు నెయ్యి తెచ్చిస్తే, ఇలా ఊరు ఊరంతా వచ్చి నన్ను మా అక్కని చూసివెళ్లారు.పల్లెటూర్లు నాకు కొత్త కాకపోయినా గోవిందపురం భలేగా అనిపించింది.వాళ్ళ ఊరికి సినిమా తారలు వచ్చినంత పని చేశారు జనం నన్ను మా అక్కని చూడటానికి.
గోవిందపురానికి అందం అంతా ఆవూరి చెరువు . ఉదయాన్నే మా ఆమ్మ చెరువుకు నీళ్ళకి పోతుంటే మేమూ వెళ్ళాం.చెరువునిండా తామరపూలు,ఎర్రవీ ,తెల్లవీ కలగలిసి.మా ఆమ్మ ఓబిందె నీళ్లు ముంచుకుని గట్టుఎక్కి ఆబిందె నీళ్లు నెత్తిన కుమ్మరించుకుని మళ్లీ మడినీళ్లు ముంచుకుని ఓ నాలుగు తామరాకులు కోసుకుని వచ్చింది.ఊరి బావుల్లో నీళ్లు బాగుండవుట అందరూ చెరువు నీళ్లే మంచినీళ్లు తాగుతారుట.
మా ఆమ్మ వంట చేసి తామరాకులు వెనక్కి తిప్పి వేడి వేడి అన్నం కూరలు దాంట్లో వడ్డిస్తే ఆరుచి ఎంత బాగుందంటే ఆ ఫీల్ పోకుండా ఉండాలని నేను మళ్ళీ ఇంతవరకు తామరాకులో భోజనం చెయ్యలేదు.గోవిందపురం నేను గుర్తుపెట్టుకున్న అపురూప  అనుభవాల్లో ఒకటి.పాతకాలం సంఘజీవనంలా వస్తుమార్పిడి,ఉమ్మడి ఆస్తి,ఊరు ఊరు ఒకమాటమీద ఉండటం,చాలా ఉన్నాయి అనిపించింది ఆ చిన్నఊరులో.
తామరాకుమీద నీటి బొట్టులా జీవితం ఎక్కడా దేనికీ అంటుకోకుండా గడిపేసిన మా రంగమామ్మ.అజాతశత్రువు.
కామెంట్‌లు