గ్రహాంతర వాసులు: --ఎం బిందుమాధవి

 "గ్రహాంతర వాసులు"
"అమ్మా పాలు...అని గేదెని ఇంటి తోలుకొచ్చి పాలు పిండే బాలమ్మ కేకకి బయటికొచ్చిన విజయకి చెట్టు కింద కూర్చున్న కిట్టు కనిపించాడు. అక్కడేం చేస్తున్నావురా, చీకటి పడేట్టుంది లోపలికి రా" అన్నది.
"గ్రహాంతర వాసులు వస్తున్నారుటమ్మా.. మా ఫ్రెండ్ చెప్పాడు. నిన్న పేపర్లో వేశారుట. వాళ్ళు రాత్రి చీకటి పడి ఊరు మాటుమణిగాక వస్తారుట. మరి నేను వాళ్ళని చూడాలి కద, అందుకే ఇక్కడ కూర్చున్నాను. లోపలికి రాను. ఏ టైం లోనైనా రావచ్చు." అన్నాడు
"నీ మొహం! గ్రహాంతర వాసులెవరు. నాకు ఎనభయ్యేళ్ళు వచ్చాయి. ఇంతవరకు నేనే ఎప్పుడూ వినలేదు.. చూడలేదు. నిండా పదేళ్ళు లేవు..నీక్కనిపిస్తారా? ఎవరా చెప్పింది" అని దీర్ఘం తీసింది నాయనమ్మ రుక్కమ్మ లోపలినించి.
"మన భూమి ఒక గ్రహం. అలాగే బుధుడు, శుక్రుడు, శని, అంగారకుడు...ఇలా అన్నమాట! ఆ గ్రహాల్లో నివశించే వాళ్ళని గ్రహాంతర వాసులంటారు. వాళ్ళు మన లాగా ఉండరుట. అంటే కాళ్ళూ, చేతులు మనలాగా ఉండవు" అన్నాడు.
"ఆ:( శని గ్రహం వాళ్ళు కూడా వస్తారా? ఓ పట్టాన కష్టాలు వదలకపోతే, శనిగ్రహం పట్టింది అని తిడతారు కదరా! వాళ్ళెందుకు మధ్యలో..పట్టుకుంటే ఓ పట్టాన వదిలిపెట్టరు నాయనా! లోపలికి రా. ఇక్కడ కూర్చుంటే నిన్నో, నన్నో పట్టుకుంటే చచ్చామన్నమాటే" అన్నది తల కొట్టుకుంటూ రుక్కమ్మ.
"బుధుడు, శుక్రులు ఫరవాలేదు. కానీ ఎవరొస్తారో తెలియనప్పుడు ఎందుకొచ్చిన తంటా? బుధుడైతే తెలివితేటలు, విద్య బాగా వస్తుందిట. శుక్రుడు అనుగ్రహిస్తే సిరిసంపదలొస్తాయిట" ఇలా సాగిపోతున్నది ఆవిడ వాక్ప్రవాహం.
"మీరు మరీ అత్తయ్యా. వాడేదో చెప్పటం, మీరు విని దాని మీద చర్చించటం! బానే ఉంది. అసలు వేరే గ్రహం మీద జీవరాశి బ్రతకదు. జీవరాశి బ్రతకటానికి నీళ్ళు ఉండాలి. ఇప్పటికి అంగారకుడి మీద మాత్రం ఒకప్పుడెప్పుడో నీటి జాడలు ఉన్నట్టు కనుక్కున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి."
"మిగిలిన గ్రహాల మీద ఏ ప్రాణులు లేవు. అమీర్ఖాన్ అని ఒక హింది యాక్టర్ నటించిన "PK" అని ఒక హింది సినిమా, "ET"అనే ఒక ఇంగ్లీష్ సినిమా ఈ సబ్జక్ట్ మీద వచ్చాయి. గ్రహాంతర వాసులు అని అప్పుడప్పుడు ఇలాంటి సంచలన వార్తలు పేపర్ లో వస్తూ ఉంటాయి, మనకి కాలక్షేపంగా మాట్లాడుకోవటానికి" అని విజయ గిన్నె తీసుకెళ్ళి బాలమ్మకిచ్చింది.
బాలమ్మ పాలు పితక్కుండా, కిట్టుని ఏవో లెక్కలడుగుతున్నది. కిట్టు అంతకంటే శ్రద్ధగా ఆ కాయితాలు చూసి, "బాలమ్మా ఇప్పటికి ఇరవై వేలు కట్టినట్టుంది ఈ రశీదులన్నీ కలిపితే. అసలు చిట్టు ఎంతకేశావు"అనడిగాడు. "ఇరవై వేలయిపోయిందా. మరింకా రెణ్ణెల్లు కట్టాలంటాడేం ఆ ఎదవ సచ్చినోడు" అన్నది.
"ఇదిగో బుల్లి దొరా నే సెప్పేది యిని, మరో పాలి సరిగా సూసి ఓ కాయితం మీద తారీకుల ప్రకారం ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టానో యేసిచ్చావంటే, ఆడి భరతం పడతా! సిట్టు ఇరవై యేలకి యేసినా! ఖచ్చితంగా ప్రతి పస్టు తారీకుకి అమ్మ దగ్గరనే డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేస్తన్నా! పిల్ల పెళ్ళి కుదిరింది..డబ్బిమ్మంటే ఇంకా రెణ్ణెల్లు కట్టాలన్నాడు, దొంగెదవ. సాయంత్రం, అమ్మని కానీ నిన్ను కానీ ఇవరంగా అన్నీ అడగచ్చు అని కాయితాలు, రశీదులు అన్నీ తెచ్చినా" అన్నది బాలమ్మ.
"ఆ:( తెమిలాయా మీ లెక్కలు? బాలమ్మా కాయితాలు బాబుకిచ్చెళ్ళు. పని అయ్యాక నేను చూసి పెడతాను. 'కిట్టూ...ఇవన్నీ సైన్స్ నేపధ్యంగా వచ్చిన కధలు మాత్రమే. ఫ్లైయింగ్ సాసర్స్ చూశాము అని కొన్ని దేశాల వాళ్ళు చెబితే అవి గ్రహాంతర వాసులని కొంతమంది కధలల్లారు. అంతే కానీ ఇంతవరకు వాటి శాస్త్రీయ నిరూపణలేవీ జరగలేదు. అలాంటివి వచ్చేస్తాయని అక్కడ కూర్చుంటే, చీకటి పడ్డాక ఏ పురుగో పుట్రో వస్తాయి లోపలికిరా అన్నం తిందువుగాని."అని పాల గిన్నె తీసుకుని లోపలికెళ్ళింది. చేసేదేమీ లేక కిట్టు కూడా అమ్మని అనుసరించాడు.
కామెంట్‌లు