పరహితమైన కార్యమతి భారతముతోడిదియైన పూను స (39)త్పురుషుడు లోకము ల్పొగడ, పూర్వమునం దొక రాలవర్షమున్
కురియగ చొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై
గిరి నొక కేల ఎత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా!
తాత్పర్యం: లోకులకు హితాన్ని కలిగించే పని ఎంత కష్టమైనది అయినా మంచివాడు పూనుకుంటాడు. పూర్వం రాళ్ళ వర్షం కురిసినప్పుడు గోవులను, గోపాలకులనూ రక్షించటానికి కృష్ణుడు కొండనే ఎత్తి గొడుగుగా పట్టాడు.
"పర హితం"
జుబిలీ హిల్స్ జగన్నాధ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకు వస్తున్న సునీతకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు బోలెడంత మంది జనం గుమి కూడి కనిపించారు.
"రత్నం ఏమిటా జనం? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటావా" అన్నది.
"క్యాన్సర్ రోగులని తీసుకుని ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడికొస్తారు కదమ్మా! పాపం వారిలో పొరుగూళ్ళనించి వచ్చే వారు కూడా ఉంటారు. ఓ పక్క ఈ మాయదారి రోగానికి వైద్యం ఖర్చు, తోడొచ్చినవారికి ఉండటానికి బాడుగ, తినటానికి తిండి ఖర్చు? ఎన్నాళ్ళుండాల్సి వస్తుందో తెలియదు. ఎంత డబ్బైనా చాలదు! డబ్బు ఖర్చు పెట్టి హోటల్ రూములు, తీసుకోవాలంటే ఖర్చు భరించలేక హాస్పిటల్ ముందు రోడ్డు మీదే..ఆ షెడ్స్ కిందే ఉంటారు. వాళ్ళకి పూట పూట తిండి చాలా కష్టం అమ్మా! అందుకని దయగల వాళ్ళు రోజూ మధ్యాహ్నం, అన్నదానం పేరుతో భోజనం పాకెట్స్ తెచ్చి పంచుతారమ్మా. వాటికోసం జనాలు కెబీఆర్ పార్క్ దగ్గర గుమి కూడతారు. ఆ జనాలేనమ్మా వాళ్ళు" అన్నాడు రత్నం.
* * * *
అన్నపూర్ణమ్మగారు, సాయి బాబా గుడి దగ్గర ప్రతి గురువారం పదిహేనుమందికి తక్కువ కాకుండా చపాతీలు-కూర, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రతి శనివారం పులిహోర-పెరుగన్నం పంచి పెట్టేవారు. అలా ఎన్నో ఏళ్ళు ఆవిడ చేసిన అన్నదాన కార్యక్రమల్లో పాలుపంచుకున్న సునీత, ఇటీవలే స్వర్గస్తురాలైన ఆమె పేరుతో, ఆ పరంపర కొనసాగించాలని, అన్నదాన కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నది.
కానీ జనానికి ఇతరుల పట్ల జాలి..దయ కంటే తాము చేసే పాపాలు కడుక్కోవటానికి అన్నదానాలు చెయ్యటం ఫ్యాషన్ అయిపోయింది. అందువల్ల ఆ దేవాలయాల దగ్గర అన్నదానాలు చేసేవారు ఎక్కువయి, దానం స్వీకరించేవారిలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నది. భోజనం ప్యాకెట్స్ వద్దని, డబ్బిమ్మని అడుగుతున్నారు. ఇది ఒక వ్యాపారంగా మారింది.
ఎంతోమందికి సేవ చెయ్యలేకపోయినా, తను పెట్టగలిగేది నిజంగా అన్నార్తులకి చేరితే తృప్తిగా ఉంటుంది అని ఆలోచిస్తున్న సునీతకి, ఈ రోజు తన కంటపడిన ఈ సన్నివేశం ఓ దారి చూపినట్టు అయింది.
ఉద్యోగంతో బిజీగా ఉండే తనకి, ఒంటరిగా అంత మందికి భోజనం వండి ప్యాకెట్స్ తయారు చెయ్యటం కష్టమైన పని. "కష్టం అని మానేస్తే ఎలా" అనుకుంటున్న సునీతకి ఇంటి దగ్గర కొత్తగా పెట్టిన మెస్ పరిష్కారాన్ని సూచించింది.
వారితో తనకి ప్రతి శనివారం ఏభయి ప్యాకెట్స్ భోజనం తయారు చేసి ఇమ్మని ఆర్డర్ ఇచ్చింది. దీనివల్ల ఇటు మెస్ వారికి బిజినెస్ పెరుగుతుంది, అటు తల్లి పేరుతో అన్నదానం చెయ్యాలన్న తన కోరిక నెరవేరుతుంది అనుకుంది.
అనుకున్నదే తడవు...కార్యరంగంలోకి దిగింది. మొదటి శనివారం మధ్యాహ్నం తన కార్ లో భోజనం ప్యాకెట్స్, కొన్ని పాత దుప్పట్లు, బట్టలు, తీసుకెళ్ళి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరకి వెళ్ళింది.
హాస్పిటల్ ముందు కార్ ఆపి, తను తెచ్చినవి వారికి స్వయంగా తన చేత్తో ఇచ్చి, వారి కళ్ళల్లో కనిపించిన తృప్తిని చూసి, అనుకున్న పని దిగ్విజయంగా చెయ్యగలిగినందుకు సంతోషించింది.
తన లాగే ఇంకా కొంత మంది భోజనం తెచ్చారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించటానికి అందరూ కలిసి మాట్లాడుకుని, రోగులకోసం ఒకరు పండ్లు తేవాలని, ఒకరు పౌష్టికాహారం కొనడానికి డబ్బివ్వాలని నిర్ణయించుకున్నారు.
అలా హాస్పిటల్ ముందు అయితే, లబ్ధిదారులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. అవసరాలు మారుతూ ఉంటాయి. నిజంగా కష్టంలో ఉన్నవారికి సహాయం చేశామన్న తృప్తి ఉంటుంది అనుకుంది సునీత. తన ఆఫీస్ లో వారితో కూడా ఈ విషయం చెప్పి, వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్నవారిని ముందుకు రమ్మని కోరింది.
యాజమాన్యం తో మాట్లాడి "కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ" క్రింద అక్కడ షెల్టర్ హోంస్ లో ఉండేవారికి ఒక భవనంకట్టించే ఏర్పాటు చేసింది.
"సమాజాన్ని నువ్వొక్కదానివే ఉద్ధరించగలవా, వ్యక్తిగతంగా ఏమి చెయ్యగలవో అది చెయ్యి చాలు" అన్న భర్తతో
"ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు కొండని తన చిటికెన వ్రేలిమీద గొడుగుగా ఎత్తి పట్టుకుని వడగళ్ళ వాన నించి గోకులాన్ని కాపాడిన బాల కృష్ణుడంత గొప్ప వాళ్ళం కాకపోయినా, పరహితానికి మన పరిధిలో ఎంత చెయ్యగలమో అంత చెయ్యటానికి ఎప్పుడూ సంసిద్ధులమయి ఉండాలి" అన్నది.
స్వతహాగా ఇలాంటి విషయాలు పెద్దగా తెలియకపోయినా, సునీత ఉత్సాహం, పూనిక చూసి వెంకట్ కూడా తన వంతు సహాయం చెయ్యటానికి ముందుకొచ్చాడు.
సామెత కథ :-ఎం బిందుమాధవి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి