భయమే ప్రాణం తీసింది:--కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాదు.

 అడవివరం మారుమూల పల్లెగ్రామం. నిరక్షరాస్యత , మూఢ నమ్మకాలు ,  రోడ్డు సౌకర్యాలు లేక గ్రామాభివృద్ధి జరగక ఏ అవుసరమైనా దగ్గరున్న పట్నానికి పోవల్సిందే.
    ఊరిలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు , కాయకూరలు, పళ్లు కాలి నడకన పోయి వారాంతపు సంతలో పట్నం పోయి అమ్ము
కుంటున్నారు.
      పాడి పశువుల్ని  పెంచుకుని పాలను సేకరించి ఇత్తడి బిందెలు, సివ్వర్ ముంతల్లో కాలినడకన కొందరు , సైకిళ్లపై కొందరు పట్నానికి
వెళ్లి హోటళ్లు, పాలకేంద్రాలు , ఇళ్లకు  అమ్ము కుంటారు.
     పండగ లప్పుడు , విశ్రాంతి సమయంలో రైతులు , కూలిజనం , కుల
వృత్తుల వారు కాలక్షేపానికి ఊరి రచ్చబండ దగ్గర  గుమిగూడి రాజకీయాలు , సినిమాలు , పిచ్చాపాటి మాట్లాడుకుంటారు.
   ఊళ్లోంచి పట్నానికీ కాలిబాట చెరువు గట్టు మీదుగా స్మసాన వాటిక,
పక్క నుంచి కొద్ది దూరం ముళ్ల పొదల మద్య నుంచి నడవాల్సి
ఉంటుంది.
        పల్లె ప్రజలు పట్నానికి పోయి పాలు అమ్ముకుని రాత్రి వేళలో తిరిగి
వచ్చే టప్పుడు స్మసాన వాటిక వద్ద కొరివి దెయ్యాలు కనిపించేవని , ముళ్ల పొదల దగ్గర పెద్ద నాగుపామును చూసామని రచ్చబండ వద్ద
 మాట్లాడుకునే వారు.
       ఊళ్లో కరెంటు ఉంది కాని పట్నాని కెళ్లే కాలిబాట మీద చీకటిగా
ఉంటుందని ఊళ్లోకి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు లేక ముగ్గురు కలిసి
కబుర్లు చెప్పుకుంటు వస్తూంటారు.
     ఊళ్లోని రైతు సాంబయ్య వ్యవసాయం చేస్తూ పాడిగేదెల పాలను
పట్నానికి తీసుకెళ్లి అమ్మి  రాత్రికి తిరిగి వస్తూంటాడు.
      కొడుకు సూరి తండ్రికి పొలం పనుల్లో సాయంగా ఉంటూ, అప్పుడప్పుడు సైకిలు మీద ఇత్తడి  బిందెలో పాలను పట్నమెళ్లి
అమ్మిన తర్వాత వీలుంటే అక్కని కలిసి వచ్చే వాడు.
    రచ్చబండ దగ్గర జనం మాట్లాడుకునే  పిచ్చాపాటి కబుర్లు రాత్రి
చెరువు గట్టున స్మసాన వాటికలో కొరివి దెయ్యాలు , ముళ్లపొదల్లో
నాగుపాము సంచారం ఆశక్తిగా  వినేవాడు.
     ఒకరోజు సాంబయ్య జ్వరంతో మంచాన పడ్డాడు. ఆ రోజు అన్ని
పనులు  సూరి చక్కపెట్టి  సాయంకాలం గేదెల పాలు పితికి సైకిలుకి
 బిందెలు కట్టి స్నేహితులతో పట్నానికి బయలు దేరేడు.
        పట్నంలో అందరికీ పాలు పోసే సరికి చీకటి పడింది. ఊళ్లోకి తిరిగి
వచ్చే సమయానికి సైకిల్ టైరు పంక్చరైంది
   పంక్చరు వేసే వాళ్లెవరు అందుబాట్లో  లేరు. సూరి కనబడక పోతే
వెంట వచ్చిన స్నేహితులు అక్క ఇంటికి వెళ్లి ఉంటాడని తలిచి ఊళ్లోకి
బయలుదేరి వచ్చేసారు.
    టైరు పంక్తర్ రిపైరు కోసం ఎక్కడ తిరిగినా పని జరగక తండ్రికి 
ఆరోగ్యం బాగులేదని ,  ఎలాగైనా ఇంటికి  చేరుకోవాలను కున్నాడు
సూరి.
     అప్పటికే బాగా రాత్రయింది. ఒంటరిగా సైకిలు నడుపుకుంటూ
ఇంటికి బయలుదేరాడు.
      చెరువు గట్టు మీదకు రాగానే స్మసానవాటిక దగ్గర కొరివి దెయ్యాల
సంచారం జ్ఞాపకం వచ్చింది. చిమ్మ చీకటి. కీచురాళ్ల అరుపులతో
పరిసరాలు భయానకంగా ఉన్నాయి.
       సూరి భయంగా సైకిలు తోసుకుంటు ముందుకు అడుగులేస్తు
ముళ్లపొదల దగ్గరకు రాగానే కాలి ముందు భాగంలో ఏదో కరిచి
నట్టయింది. అక్కడ నాగుపాము తిరుగుతోందన్న సంగతి జ్ఞాపకమొచ్చి
పాము కరిచిందని తలిచి కింద పడిపోయాడు.భయంతో ప్రాణాలు వదిలాడు.
    బాగా రాత్రయినా కొడుకు సూరి ఊళ్లోకి రాకపోతే పట్నంలో అక్క
గారింటి వద్ద ఉండి పోయాడను కున్నాడు సాంబయ్య.
    ఉదయం రోజూ మాదిరి పాలు తీసుకుని పట్నానికి బయలుదేరిన
పాలవాళ్లకు ముళ్ల పొదల వద్ద మట్టి రోడ్డు  మీద సాంబయ్య కొడుకు
సూరి కింద పడి ఉండగా పక్కన సైకిలు , కాళీ బిందెలు కనబడ్డాయి.
    పాలవాళ్లు కంగారుగా ఏమైందని దగ్గరికెళ్లి చూడగా చెప్పులు లేని
సూరి కాలికి వంకర తిరిగి ఎండిన తాటి గిలక గుచ్చుకుని కనబడింది
    భయంతో కింద పడి ఉంటాడని భావించి అందరూ సాయం పట్టి
పట్నంలో డాక్టరుకి చూపగా , సూరిని పరిక్షించిన డాక్టరు భయంతో
షాక్ కి గరై గుండె ఆగి చనిపోయినట్టు నిర్ధారించారు.
        అందరూ విషాద వదనాలతో సూరి శవాన్ని ఊళ్లోకి వెంటబెట్టు
కొచ్చారు.
          అందుకే పిల్లల దగ్గర భయాన్ని కలిగించే ఎటువంటి కబుర్లు
మాట్లాడ కూడదు.
                   *             *             *
       
కామెంట్‌లు