అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. రష్యాలో ఎందరో చనిపోయారు. వారిలో ఒకామె భర్త కూడా ఉన్నారు. అయినా ఆమె తన కొడుకునీ దేశం కోసం యుద్ధానికి పంపింది ఏమాత్రం వెనుకాడక.రోజులూ నెలలూ గడుస్తున్నాయి. యుద్ధరంగానికి వెళ్ళిన కొడుకు విషయం తెలీక ఆ తల్లిలో ఒకింత దిగులు మొదలైంది.ఏదైనా కబురు తెలుస్తుందేమోనని వాకబు చేసింది. కానీ ఫలితం లేకపోయింది.ఇంతలో ఓరోజు కొడుకు స్వదస్తూరితో ఓ లేఖ వచ్చింది."మమ్మల్ని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరానికి పంపుతున్నారు. మేము ప్రయాణిస్తున్న రైలు మన ఊరుమీద నించే పోతుంది. మన ఊళ్ళో రెండు నిముషాలు రైలు ఆగుతుంది. కనుక నువ్వక్కడికి వస్తే నన్ను చూడొచ్చు..." అన్నదే కొడుకు లేఖ సారాంశం.ఆ ఉత్తరం చదవడంతోనే ఆ తల్లి మదినిండా ఆశలు....ఒకటికి పది సార్లు చదువుకుందా ఉత్తరాన్ని. కొడుకుని చూడొచ్చని ఆనందం.కొడుక్కి ఇష్టమైనవన్నీ చేసి తీసుకుపోతుంది రైల్వే స్టేషన్ కి. ఒక్క కొడుకుకే కాకుండా మరికొందరికికూడా ఆ వంటపదార్థాలను తీసుకుపోతుంది. రైలు రావడానికన్నా ముందరే ఆమె స్టేషన్ కి చేరుకుంటుంది. కానీ రావలసిన సమయానికి రైలు రావడం లేదని, ఆలస్యమవుతోందని రైల్వే వాళ్ళు చెప్తారు. దాంతో ఆ తల్లి కంగారింతా అంతా కాదు.ఇంతలో ఉన్నట్లుండి ఓ ప్రకటన...రైలు రాకలో అనుకోని ఆలస్యం కారణంగా ఈ స్టేషన్లో ఆగడం లేదని. రెండు మూడు సార్లు ఆ ప్రకటన వెలువడుతుంది.ఆ మాటలతో కొడుకుని చూసి తన చేత్తో తినిపించి ముచ్చటపడాలనుకున్న ఆ తల్లి ఆశలు ఆవిరి అవుతాయి. పోనీ అతన్ని దూరం నించైనా చూసినా చాలనుకుంటుంది. స్టేషన్ ప్లాట్ ఫాంమీదే నిల్చుంటుంది.రైలు మరి కొన్ని క్షణాల్లో వస్తుందనగానే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుందా తల్లి కొడుకుకి చేయి ఊపుదామని.రైలు స్టేషన్లోకి రావడంతోనే ప్రతి పెట్టెలోనూ చూస్తుంది కొడుక్కోసం.తీరా చివరి నించి రెండో పెట్టెలో కొడుకు కనిపిస్తాడు. చెయ్యి ఊపుతుంది.కొడుకూ చెయ్యి ఊపడంతోపాటు తను పెట్టుకున్న టోపీని తల మీద నించి తీసి రైలు కిటికీలోంచి బయటకు విసురుతాడు.కొడుకు విసిరిన టోపీ గాల్లో తిరిగి తిరిగి పట్టాల మీద పడుతుంది. ఆ టోపీని తీసుకోవాలన్న ఆశతో ఆ తల్లి పట్టాలమీదకు వెళ్తుంది. టోపీ తీసుకుంటుంది. గుండెకు హత్తుకుంటుంది గాఢంగా. ఆమె కళ్ళనించి పట్టరాని ఆనంద బాష్పాలు కారుతాయి.ఆ ఆనందంలో ఆమె చెప్పిన మాటలు..."నా కొడుకు పుట్టిన క్షణంలో ఎత్తుకుని గుండెలకు హత్తుకుని పొందినప్పుడు కలిగిన ఆనందాన్ని మళ్ళీ ఈరోజు వాడి టోపీ గుండెకు హత్తుకున్నఫ్పుడు పొందుతున్నాను" అని.ఈ నిజమైన సంఘటనను ఓ రష్యా రచయిత కళ్ళకు కట్టినట్లు రాశాడు. నేనీ రచనను ఓ తమిళ సాహితీకారుడు భావోద్వేగంతో చెప్పగా వింటుంటే మనసంతా బరువెక్కింది ఆ తల్లి ఆనందాన్ని ఊహించుకుంటూ!
ఆ తల్లి ఆనందం:--- యామిజాల జగదీశ్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి