సామెత కథ : -ఎం. బిందు మాధవి


 కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకు పోయింది!


‘శివ రావు’ గారు ఆ రోజు వార్తా పత్రిక చదువుతూ, ‘రొయ్యల పెంపకం’ ఇప్పుడు బాగా లాభసాటి వృత్తిగా ఉన్నది, అని వేస్తున్నారు అమ్మాయి ఈ రొయ్య లనేవి ఎలాంటి భూముల్లో, లేదా ఎలాంటి చోట సాగు చేస్తారు’ అని కోడలు మాధవిని అడిగారు. ‘వీటిని కూడా వరి పండే భూమిలోనే వేస్తారా’ అని అడిగారు. ‘మేము సర్వీస్ లో ఉండే రోజుల్లో ఇలా అనేక రకాల అవకాశాలు లేవు, కేవలం సంప్రదాయమైన పంటలు వెయ్యటం, ఏదో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ నడుపుకోవటం మాత్రమే ఉండేవి. కొన్నిచోట్ల, ప్రాంతాలని బట్టి తేనెటీగల పెంపకం, పట్టు పురుగుల పెంపకం కూడా చేస్తూ ఉండే వారు’ అన్నారు.

‘మాధవి’ బ్యాంక్ ఆఫీసర్. ‘అవునండీ మామయ్యగారు, వరి పొలాల్లోనే భూమిని కొంత లోతు వరకు తవ్వి, నీరు నింపి అందులో రొయ్య పిల్లలు విత్తనాలుగా వేస్తారు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకుల్లో ఇలాంటి విషయాల్లో సహాయం చెయ్యటానికి ప్రత్యేకంగా రూరల్ క్రెడిట్ ఆఫీసర్స్ ఉంటారు. రొయ్యలు ఆరోగ్యం గా పెరగటానికి రసాయనిక మందులు జల్లుతారు. రొయ్యలకి గాలి, ఆక్సిజన్ బాగా అందటానికి మోటార్లు కూడా పెడతారు’ అని చెప్పింది. ‘రొయ్యలు బాగా ఎదిగితే వరి మీద వచ్చే ఆదాయానికి మూడు నాలుగు రెట్లు ఎక్కువ వస్తుంది’ అన్నది. ‘అదీ కాక బ్యాంకులు నామమాత్రపు వడ్డీమీద చాల ఎక్కువ మొత్తం ఋణం గా కూడా ఇస్తుందండీ’ అన్నది. ‘కానీ ఏ తెగులు అయినా సోకితే రొయ్యలు మొత్తం చనిపోతే ఇక ఆ వ్యవసాయదారుడు దారుణంగా నష్ట పోతాడు, కోలుకోవటం కూడా కష్టమే’ అని చెప్పింది.

శివరావుగారు, ‘అయితే అమ్మాయి ఆ పొలాలు మళ్ళీ తరువాత వరి వేసుకోవటానికి ఉపయోగ పడతాయా’ అని అడిగారు. ‘ఎబ్బే లేదండీ, ఒక సారి “రొయ్యలు- చేపలు” చెరువులుగా తవ్విన భూములు ఇహ ఎప్పటికీ వరే కాదు ఏ ధాన్యం పండించటానికి ఉపయోగ పడవండీ’ అని చెప్పింది. ‘అవి పూర్తిగా ఉప్పు చౌడు అయిపోతాయి’ అన్నది.

‘మరి ఆ రసాయనాలు అవీ వాతావరణాన్ని కలుషితం చెయ్యవంటావా అమ్మాయి’ అని అడిగారు. ‘అదే కదండీ ఇప్పుడు పర్యావరణ వేత్తలు ఆర్ధికంగా లాభసాటిగా ఉండే ఇలాంటి వృత్తుల వలన ప్రకృతి కలుషితమవుతున్నది అని ఘోషిస్తున్నారు’ అని చెప్పింది.

శివ రావు గారు ‘అంతే కాదమ్మాయి, ఎంత డబ్బు సంపాదించినా మనిషి అన్నం తినే కదమ్మా బ్రతకాలి. లాభసాటి పంట అని, రొయ్యలు, చేపలు, అవి తినే పదార్ధమే(కొందరికి) అయినా అన్నంలో ఒక ఆధరువుగానే తినగలరు కానీ అదే తిని బ్రతకలేరు కదమ్మా’ అన్నారు. ‘పైగా నువ్వు చెప్పినట్లు ఇంక ఆ భూములు సంప్రదాయ వ్యవసాయానికి యోగ్యం కాకుండా పోయేట్లైతే, ఆహార ధాన్యాల భాండాగారం గా పేరు పడిన ఆంధ్ర ప్రాంతం ఆహార ధాన్యాల లోటు తో తల్లడిల్ల వలసిందేనా’ అని బాధ పడ్డారు. ‘ఇన్ని రకాల సమస్యలున్న పరిశ్రమని ప్రోత్సహించటం అంత అవసరమా’ అని అడిగారు.

‘మా చిన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం లో మంచి నల్లరేగడి నేలలు ఉన్న ప్రాంతాల్లో మంచి నాణ్యమైన వరి పంటలు పండించే వారు. అవి ‘నెల్లూరు మొలకొలుకులు’ అని, ‘వరంగల్ సన్నాలని’, ‘కర్నూల్ సోనా మసూరి’ అని చక్కగా పేర్లు పెట్టి ఎంతో అప్యాయంగా వాటి గురించి మాట్లాడుకునే వారు. ఆ పేరు వినగానే నోరూరేది. వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని నెయ్యి వేసుకుతిని గడ్డ పెరుగుతో తింటున్న అనుభూతిని పొందే వాళ్ళం’, అని నిట్టూర్చారు.

‘అయితే ఇలా పర్యావరణాన్ని నాశనం చేసే పంటలు ఎందుకమ్మాయి వెయ్యటం?  అలా వేసి, ఉన్న వ్యవసాయ భూములని పాడు చెయ్యటం ఎందుకు’ అంటూ ‘ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ సామాజిక బాధ్యత వహించకపోతే ముందు తరాలకి మనమేమి మిగులుస్తాం’ అని బాధ పడ్డారు.

‘అంతగా ఆ పరిశ్రమని ప్రోత్సహించ దల్ఛుకుంటే కొత్త అటవీ భూములనో, లేక సాగు చెయ్యకుండా వృధాగా పడి ఉన్న భూములనో వాడకంలోకి తెఛ్ఛి ప్రోత్సహించాలి కానీ ఇదేమి పని అమ్మాయి’ అన్నారు.

‘ఒకప్పుడు గోదావరి నీరంతా వరదలు వచ్చినప్పుడు ఊళ్ళు ముంచెత్తి ఆ తరువాత సముద్రంలో కలిసి వృధాగా పోయేది. అప్పుడు బ్రిటీష్ అధికారి సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట కట్టి నీటిని దారి మళ్ళించి ఆ ప్రాంత పొలాలన్నీ సుక్షేత్రాలుగా మార్చాడు. ఇప్పుడు అవి ఇలా ముందు చూపులేని పాలకుల నిర్ణయాల వల్ల చౌడు భూములుగా మారతాయన్న మాట’ అని శివ రావు గారు ఎంతో బాధ పడ్డారు.

‘ఒక్క ముందు చూపులేని ఆర్ధిక నిర్ణయం వలన కొన్ని తరాలకి నష్టం జరుగుతున్నది చూశావా అంటూ, ఇదే “కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోవటం” అంటే అని నిట్టూర్చారు


కామెంట్‌లు