వ్యాయామ కళ : -- యామిజాల జగదీశ్

 నేనిప్పుడు చెప్పబోతున్న సంచిక వ్యాయామకళ ప్రథమ సంచిక గురించి! 
ఔను, ఈ పేరుతో 1939 అక్టోబరులో  తొలి సంచిక వెలువడింది. ఇది మాస పత్రిక. సంపాదకులు ఆచార్య గర్రె వీర రాఘవులు గుప్త. ఈ పత్రికాకార్యాలయం గుంటూరులో ఉండేది.  
"ఆంధ్రమున జనులందు వ్యాయామ విద్య గణ్యత వహి పజే..." అంటూ మొత్తం ముప్పై ఎనిమిది పేజీల సంచిక పాఠకలోకానికి వచ్చిందీ పత్రిక. 


సంపాదకీయం కాకుండా 21 వ్యాసాలు ఈ పత్రికలో ఉన్నాయి.


"తెలుగు నందు వ్యాయామమును గురించి ప్రకటించు పత్రికొకటైనను ఆంధ్రదేశమున లేదు. ప్రాక్పశ్చిమ దేశములలో వ్యాయామోద్యమ వ్యాప్తికి పెక్కు పత్రికలు ప్రచురితమగుచున్నవి. ఇక భారతదేశమున హిందీ మున్నగు భాషలలో కొన్ని పత్రికలు ప్రచురింపబడుచున్నవి. అదేమియోకాని తెలుగున మాత్రము పూజ్యముగ నున్నది. 1925 నుంచి ప్రజలలో వ్యాయామము పూర్ణముగ వ్యాప్తి గావించుటకై అనేక విధముల ప్రయత్నించుచుంటిని. కాని అనుకొనిన రీతిగ కృతకృత్యుడను కాజాలకపోతిని అందుకనియే ఆంధ్రులలో అంత అభిరుచి లేకపోయినను వ్యాయామోద్యమాభివృద్ధికి ప్రత్యేక పత్రికను ప్రచురింపబూనితిని. ఇందులకు కారణము నేను స్థాపించిన వ్యాయామ సంఘములు, నేను స్థాపించిన వన నేల...ఆంధ్రదేశములో నున్న వ్యాయామ సంస్థలన్నియు దీక్షతో పత్రికాభివృద్ధికి ప్రచారము కావించి పత్రికను పోషించుట వారి విధ్యుక్త ధర్మముగా తలచి తోడ్పడుదురని నాకు కలిగిన ఆశయే కాని నా నిశ్చితాభిప్రాయమున కంతరాయము కలుగకుండునటుల వైశ్య వ్యాయామ సంఘములు, యితర ధర్మసంస్థలు, నుదార గుణేపేతులును ముఖ్యముగ తోడ్పడుదురని విశ్వసించుచున్నాను.  ఈ పత్రిక పొట్ట కూటికి కాదు. నా జీవనోపాధికి వ్యాపారములు కలవు. పత్రిక కేవలం వ్యాయామ ప్రచారముకరకే ప్రచురింపబడుతున్నది. ప్రతి సంవత్సరము పాఠక మహాశయులకు లెక్కలను అందజేయుదును" అని సంపాదకీయంలో పేర్కొన్నారు సంపాదకులు. స్వవిషయం అనే శీర్షికతో ఈ సంపాదకీయాన్నిచ్చారు. 


ఈ పత్రికను దీవిస్తూ శ్రీ బాలకవి అల్లమరాజు నారాయణరావుగారు (బొబ్బిలి) రాసిన అయిదు పద్యాలను సంపాదకీయం మరుసటి పేజీలో ఇచ్చారు. అలాగే గర్రే సత్యనారాయణ గారి ఆశీస్సు పద్యాలు కూడా ఉన్నాయిందులో. వ్యాయామ సుభాషితాలు పేరిట వ్యాయామసేవకుడు (తెనాలి) రాసిన విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. 


"బాదంకాయలు' గురించి అన్నా పుల్లారావు గుప్త (వైశ్య వ్యాయామ సంఘం, గుంటూరు), వ్యాయామ సూత్రములు (డాక్టర్ కె.యన్. దేశాయ్, నెల్లూరు వారి వ్యాసం), సూర్య నమస్కారాలు వంటి వ్యాసాలు ఈ తొలి సంచికలో ఉన్నాయి.
కొన్ని పేజీలలో దొర్లిన తప్పులకు సంబంధించి ఈ పత్రికలోనే సవరణలు ఇవ్వడం విశేషం. సవరణలను ఈ విధంగా ఇచ్చారు....
"సూర్యనమస్కార ఫలితములలో నెం. 8 అర్ద సరళ భుజంగాసనము యొక్క వివరము పొరపాటున నెం.9 హస్తపాదము కింద అచ్చు పడినది గాన పాఠకమహాశయులు సరిచూచుకొన ప్రార్థన. పేజీ 20 నుండి 24 వరకు, పేజీ 29 నుండి 32 వరకు కొలది అచ్చు పొరపాటులు నేను ప్రచారం కొరకు యితర గ్రామములలో నుండునపుడు జరిగినవి. కనుక సోదర మహాశయులు సవరించుకొన కోరుచున్నాను...."


ఇక ఈ పత్రిక చందా వివరాలు ఇలా ఉన్నాయప్పట్లో.....

1. శాశ్వత పద్ధతి చందాదారులు
వంద రూపాయలు ఇచ్చిన వారిని శాశ్వత మహారాజపోషకులు!
2. యాభై రూపాయలు ఇచ్చే వారిని రాజపోషకులు! 
3 ఇరవై అయిదు రూపాయలు ఇచ్చువారిని పోషకులు!


ఈ పత్రిక ఎంత కాలం నడిచిందోనని ఎంత ప్రయత్నం చేసినా వివరాలు తెలీలేదు.
కామెంట్‌లు