చదివింపులు.:--వసుధారాణి.

  కనిగిరిలో రోడ్డు మీద నడవటం అంటే పూర్తి జనసమర్ధతతో ఉన్న ప్రాంతంలో ఒక వ్యక్తి నడుస్తుంటే మొత్తం జనం అంతా వాళ్ళ కార్యకలాపాలు ఆపేసి ఆ వ్యక్తినే చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది,అలాంటి నడక అది.నేను నరసరావుపేటలో సైకిలు బ్రేకులు తీసి విలాసంగా రోడ్ల మీద తిరిగిన రకాన్ని.మరి ఇక్కడ ఇదీ పరిస్థితి.
కనిగిరిలో మెయిన్ రోడ్డులో ఉన్న ఒక ఇంట్లో మొదటగా గృహప్రవేశం చేసిన తరవాత వ్రతం అదే రోడ్డులో ఇంకో పెద్ద ఇంట్లో చేసుకున్నాం.ఆ ఇంటికి, ఈ ఇంటికి ఓ పావుకిలో మీటరు దూరం. పెద్దయింటిని మా మామగారి నాన్న గారు  వెన్నెలగంటి గోపాలరావుగారు 1933 వసంవత్సరంలో కట్టించారుట.కనిగిరిలో మొదటి మూడంతస్తుల మేడట ఆయిల్లు (ఏడంతస్థుల మేడ కాకున్నా మూడుతో సర్దుకోవాలి మరి).
ఆ యిల్లు అయితే రంగూన్ టేకు,ఇనుప దంతెలు.ఇంట్లొనించి మెడపైకి మెట్లు, మూడవ అంతస్తులో పెద్ద గది. ఆ గది పైకి ఎక్కటానికి కూడా ఓ ఇనప నిచ్చెన.మొత్తం ఊరంతా కనపడినట్లు అనిపించింది నాకైతే.మా అక్కా,పిన్ని వ్రతం బాగా జరిగిందని.జనం బాగా వచ్చారని ఆనంద పడిపోయారు.
వచ్చిన వాళ్లంతా బంధువులు,ఊళ్లోని డాక్టర్లు,MLA, ఇంకా కొందరు వ్యాపార ప్రముఖులు వీళ్లంతా.నన్ను ఆకర్షించింది మాత్రం ఎక్కువ మొత్తంలో వచ్చిన మావారి క్లయింట్లు, చుట్టు పక్కల పల్లెల నుంచి వచ్చారనుకుంటా చక్కగా భోజనం చేసిన తరువాత , వాళ్లలో ఒక అతను కూర్చుని ఓ పేపరు మీద అందరి చదివింపులు రాసి కాగితం డబ్బులు అప్పజెప్పి వెళ్ళాడు.లిస్టులో ప్రతిపేరు ఎదురుగా 10 రూపాయలు,కొంతమంది కాస్త ఘనంగా 20 రూపాయలు కూడా చదివించి వాళ్ళు ఉన్నారు.
ఆ లిస్ట్ చూసుకుని మా వారు అయ్యో వెంగయ్య 20 రూపాయలు ఇచ్చాడు అనవసరంగా పాపం చార్జీ పెట్టుకుని వచ్చింది కాక అని పేర్లు చూసుకుని ఒక్కొక్కరిని ఇలా అనుకుంటుంటే అర్ధం అయిపోయింది నాకు. మన ప్లీడరు గారు క్లయింట్లకి కేసు చేసిపెట్టి, చార్జీలు కూడా ఇచ్చి పంపించే తరహాఅని.చాలా హాయిగా అనిపించింది.ఇది నాకు కలిగిన మొదటి ఆనందం.
నాకు మాత్రమే ఆనందం కలిగితే చాలదు కదా.కనిగిరి రామాలయ కమిటీ వాళ్ళు వచ్చి మాకు ఓ సన్మాన పత్రం చదివించి వెళ్లారు.తరవాత సత్యసాయిబాబా సేవా సమితి (మా అత్తగారు ప్రసిడెంట్ చేశారు ) ఒక సాయిబాబా పటం పెద్దది ఒకటి తెచ్చి చదివించారు.ఆ పటం నేను అందుకుని నా చేతులతో మందిరం పక్కన పెట్టగానే ఆపటంలోని సాయిబాబా చేతి నుంచి విభూతి ఓ చిన్న సైజు కుప్పగా రాలిపడింది. 
ఓ అని భక్తులంతా చప్పట్లు కొట్టి ,కోడలు వచ్చింది స్వామి ఆశీర్వదించారు అని ఆనంద పడిపోయారు పాపం మా అత్తగారితో సహా.ఐతే తరవాతి రోజులలో ప్రతి గురువారం మా ఇంట్లో మా అత్తగారు జరిపే భజనలో నేను కూడా చుట్టూ చీరకొంగు కప్పుకుని బుద్ధిగా పాటలు నాకు రాకపోయినా పాల్గొన్నాను అనుకోండి అది వేరే విషయం.
వ్రతం ముగిసి భోజనం అయ్యాక మా చిన్న ఆడపడుచు నన్ను పిలుచుకుని మేడ మీద మొదటి అంతస్తులో మెట్ల పక్కన ఉన్న చిన్న గదిలోకి తీసుకెళ్లి కొంచెం సేపు పడుకో అని చెప్పి, ఈ గదిలో టంగుటూరి ప్రకాశం గారు పడుకున్నారు తెలుసా అని చెప్పింది .గోపాలరావుగారు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్ గా ఉండే వారట .అప్పుడు ప్రకాశం గారు వస్తే ఆయన ఇక్కడ బస చేశారట.అసలే నాకు దేశభక్తి ఎక్కువని మీకు తెలుసుగా.ఇది రెండవ ఆనందం.
      
కామెంట్‌లు