బాలికాసాధికారతకు సమిష్టికృషి ::--- నల్లాని రాజేశ్వరి
  ప్రభుత్వంతో పాటు స్వచ్ఛందసంస్థలు, విద్యాసంస్థలు సమిష్టిగా కృషిచేస్తే బాలికా సాధికారత సాధ్యమవుతుందని రచయిత్రి, బాలల సంక్షేమ సమితి (CWC) ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి అభిప్రాయపడ్డారు.
సమాజంలో ఎదురయ్యే  సవాళ్లను ఆత్మవిశ్వాసంతో  ఎదుర్కొనేలా బాలికలను తీర్చిదిద్దాలన్నారు. ఉత్తమ శిక్షణ, ఉన్నత విద్యతోనే  సాధికారత  సాధ్యమవుతుందని నిరూపించాలన్నారు.
ఐసిపిఎస్ డిసిపిఓ డా. దాసరి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో గురువారం కురుగుంట బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ బాలికా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు.
ప్రిన్సిపాల్ సునీత అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్యఅతిథిగా నల్లాని రాజేశ్వరి హాజరై మాట్లాడారు.
 బాలికలు, యువతులు, మహిళలకు స్వీయరక్షణ,   సాధికారిత" ఎంతో ముఖ్యమన్నారు. ఉన్నత  విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు.
 
ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ,  ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్ పర్సన్, రాజ్య మహిళా సమ్మాన్ అవార్డు గ్రహీత  నల్లాని రాజేశ్వరి సేవలు స్ఫూర్తిదాయక మన్నారు. అనంత నగరంలో మహిళా సంఘ సంస్కర్తగా అనేక అవార్డులను సొంతం చేసుకున్నారని వివరించారు.
బాలల సంక్షేమ సమితి ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ  "సాధికారత"  పుస్తకాన్ని రచించి పలువురి  ప్రశంసలు పొందారన్నారు. అదే అంశాన్ని మా విద్యార్థులతో చర్చించడానికి వచ్చిన రాజేశ్వరి  అభినందనీయులు అన్నారు. 
ఈ సందర్భంగా CWC చైర్ పర్సన్ నల్లాని  రాజేశ్వరి మాట్లాడుతూ, బాలికలు  ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే  సాధికారిత సాధించగలరని పేర్కొన్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మొక్కవోని సంకల్పం, దృఢదీక్షతో లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషిచేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో బాలికలు, మహిళపై జరుగుతున్న  అమానుషాలకు అకృత్యాలకు చరమగీతం పాడాలంటే మగ వారి ప్రవర్తనలో పరివర్తన తీసుకువచ్చే బాధ్యతను ప్రతి ఇంటిలో ముఖ్యంగా తల్లి తీసుకోవాలన్నారు. ఆ రకంగానే మంచి సమాజం తయారవుతుందని తెలిపారు. సాధ్యానికి అసాధ్యానికి మధ్య ఉన్న తేడా మనిషికి ఉన్న సంకల్పం మాత్రమే అన్నారు. విద్యార్థి దశనుంచే గట్టిగా తలచుకుంటే ఈ సృష్టిలో సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. 
ఈ కార్యక్రమంలో  DCPO డా. దాసరి సుబ్రమణ్యం, RIP హుస్సేన్ బాషా, వనిత సంస్థ అధ్యక్షుడు రచయిత గుత్తా హరి సర్వోత్తమ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ విజయ మాట్లాడారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఆరు మొక్కలు నాటి, నీళ్లుపోశారు. జాగ్రత్తగా సంరక్షించాలని సూచిస్తూ, నల్లాని రాజేశ్వరి వాటికి జీవనదుల పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో 
ఐసిపిఎస్ పిఓ శీలా మురళీధర్, శ్రీలక్ష్మి,  టీచర్లు, విద్యార్థినిలు తదితరులు  పాల్గొన్నారు.
కామెంట్‌లు