ఒకప్పుడు ఆంధ్రదేశం ఆ చివరి నుండి ఓ పెద్దాయన గొల్లకొండకు వచ్చారు! ఎవరో ఆహ్వానించగా వచ్చి ఓ లాడ్జ్ లో బస చేసారు! వారికి శిష్యులు అభిమానులు స్నేహితులు బంధువులు ఉన్నారు కనుక , కొందరు ఆ లాడ్జ్ వద్దకే వచ్చి ఆ పెద్దాయన్ను కలుస్తూ ఉన్నారు. వారిలో ఓ భార్యాభర్తా కూడా వచ్చారు,చంకలో ఓ రెండు సంవత్సరాల బాబును ఎత్తుకుని! పది నిమిషాల తరువాత ఆ పిల్లవాడు ఏడ్వటం ప్రారంభం చేసాడు- తల్లిదండ్రులు ఓదర్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు- వాడు వినడం లేదు!తల్లిదండ్రులలో ఏ ఒక్కరు కూడా వాడిని బయటకు తీసుకువెళ్లడం లేదు! అదనంగా "అదిగో తాతగారిని చూడూ ఏం చెప్తున్నారో వినూ'' అంటూ గారాల మాటలు కూడా చెప్తున్నారు!ఆ లాడ్జ్ గదిలో వచ్చి కలుస్తూ ఏవో మాటాముచ్చట సాగించే స్ధితి , మధ్య మధ్య డిస్ట్రబ్ అవుతోంది! అయినా ఆ భార్యాభర్తలు ఆ పెద్దాయన పక్కకు అలాగే కూర్చుని పారవశ్యం చెందుతున్నారు!"ఎవరో ఒకరు ఆ బాబును బయటకు తీసుకు వెళ్లండి" అని నేను అంటే ,అప్పుడు కానీ, సదరు భర్తగారు కదలలేదు!కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని సభలు సమావేశాలకు వస్తుంటారు. తమ పిల్లలు మొత్తం 'సభాసదుల పిల్లలు' అన్నట్టుగా,వారు మామూలు పిల్లలు కానట్టుగా,బాల మేధావులు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు! సభలో మరికొందరు ఆ తల్లిదండ్రులతో స్వప్రయోజనాలున్న కొందరు అటువంటి'జాతీయపిల్లలను' తెగ ముద్దు చేస్తూ ఉంటారు! పిల్లల అల్లరి ,ఆ కన్న ప్రాణాలకు వీనుల విందుగా ఉంటుంది కానీ, సభను వినాలనుకుని వచ్చిన వారికి మాచెడ్డగా ఉంటుంది!ఆ మధ్య ఓ క్షిపణి శాస్త్రవేత్త రాజకీయ కారణాల వల్ల రాష్ట్రపతి అవడం- వెనువెంటనే ఆయన రచనలు దేశవ్యాప్తంగా ప్రచారం అవడం- ఇహ మధ్యతరగతి తల్లిదండ్రులలో ఓ ధోరణి ప్రారంభం అయింది! తమ పిల్లలను తొందరగా మేధావులను చెయ్యాలని! ఇక తల్లిదండ్రులు ఎక్కడికి వెల్తే వారి గారాల పుత్రీపుత్రులను కూడా అక్కడికి తీసుకుని వెళ్లడం , అదే రోజుల్లో ఎక్కువ అయింది.మేధావులు తయారు చెయ్యబడరు, మేధావి లక్షణాలు జన్మతః వస్తాయి! అంతే!! తల్లిదండ్రులు పిల్లల వెంటపడితే మేధావులు అవరు! పైగా వ్యతిరేకత పెరుగుతుంది!పిల్లలు తమ పద్దతిలో తాము ఎదుగుతారు,పెద్దలు అవకాశాలు కల్పించాలి. రుద్దుడు కార్యక్రమాలు పెట్టకూడదు. తాము ఎక్కడికి వెళ్ళితే పిల్లలను అక్కడికి తీసుకుని వెళ్లకూడదు! సభలను చట్టుబండలు చెయ్యకూడదు! పిల్లలకు స్వంతంగా ఎదిగే అవకాశాలు కల్పించాలి.పెద్దలు కామన్ సెన్స్ ను కోల్పోయి ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుని వెళ్లకూడదు!వెళ్లవలసిన అవసరం ఉంటే, భార్యో భర్తో వంతుల వారీగా పిల్లలను పట్టుకుని ఇంటివద్ద ఉండాలి.పిల్లలు పెద్దవారు అయ్యాకా ఇద్దరూ కలిసి వెళ్లవచ్చు!పిల్లలు వెళ్లాలని అనుకునే చోట్లకు ప్రత్యేకంగా తీసుకు వెళ్లాలి- పిల్లలు చూడటానికి ఇష్టపడే వాటిని చూపించాలి!అంతే కానీ గంభీరమైన చర్చలు జరిగే చోట్లకు మీ చాపల్యాలకు తీసుకు వెళ్లకండి! సభా సమయం విలువైన సమయం! ప్రతీ సభలో ఓ మూడ్ ఉంటుంది. దాన్ని డిస్ట్రబ్ చెయ్యకూడదు.పిల్లలను వాళ్ల పద్దతిలో వారిని ఎదగనివ్వాలి!మన పద్దతిలో ఎదగాలని ఒత్తిడి చెయ్యకూడదు!పిల్లలు ఏదో తమకు ఆసక్తి ఉన్న చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ సౌకర్యంగా సంతోషంగా బ్రతికితే చాలు!అంతకంటే గొప్ప మంచిబ్రతుకు ఏముంది?నిజానికి , సర్వసామాన్యమైన బ్రతుకును మించిన సంతోషకరమైన బ్రతుకు లేదు!మనం మేధావులు అనుకున్న వారెవరూ సంతోషంగా బ్రతకలేదు.ఎన్నో కష్టాలు పడ్డారు.మేధావులు తయారు చెయ్యబడరు,మేధో లక్షణాలతో జన్మిస్తారు! అది గుర్తించాలి ముందు!
గుడ్మార్నింగ్ --తుమ్మేటి రఘోత్తమరెడ్డి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి