సిద్దార్ధ విద్యాలయం నేను ఒకటవ తరగతి నుంచి 7 వతరగతి వరకు చదువుకున్న బడి . ఆ బడిలో టీచర్లు ఎంత గొప్ప వాళ్లంటే ఆడపిల్లలను మగపిల్లలతో మగపిల్లలను ఆడపిల్లలతో పోల్చకుండా చదువు చెప్పారు. మేము చెట్లెక్కి చింతకాయలు కోసినా,బడిలో ఆయమ్మ చేతిలో బెల్లు లాక్కొని కొట్టినా మమ్మల్ని మందలించారు కానీ ఏమిటా మగపిల్లల పనులు ,అల్లరి అనలేదు.ఎదిగే మనసును ఎటు వంటి సంకోచాలు ,చిన్నపుచ్చుకోవటాలు లేకుండా ఎదగనివ్వటం మా సిధ్దర్ధ విద్యాలయం టీచర్లకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు అనుకుంటా.ఇంట్లోనూ,ఇంటి చుట్టుపక్కల వాతావరణంలోనూ మేము ఆడపిల్లలం అయినందుకు తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు.మంచినడత, నమ్రత ఎవరికైనా ఉండాలిలాంటి పెంపకం మా ఇంట్లో ఉండేది.ఉన్న ఒక్క అన్నయ్యను ,ఇంతమంది ఆడ పిల్లలను మా అమ్మ ఒక్కలాగే పెంచింది.ఏడవ తరగతి అయిపోయి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ కి వెళ్ళాక , అక్కడ కొందరు చాదస్తపు టీచర్ల వల్ల ఆడపిల్లలం అవ్వటం ఒకవేళ శాపమేమో?మనమే పూర్వజన్మలో చేసిన మహాపాపమేమో ?అనిపించేసింది.మగపిల్లల హై స్కూల్,ఆడపిల్ల హైస్కూల్ ఒకే కాంపౌండ్ లో విడి విడి గా ఉండేవి.అందరికీ ఒకే గేటు .గేటులో ప్రవేశం దగ్గరి నుండి ఆటస్థలం వరకు మగపిల్లలకు బోలెడు ప్రాధాన్యత ఉండేది.ఇక క్లాసులో కొంత మంది అమ్మాయిలు ముఖ్యంగా ఇంటిలో అన్నలో, తమ్ముళ్ళో ఉన్న అమ్మాయిలు అయితే ద్వితీయశ్రేణి పౌరులు.బామ్మలో,అమ్మలో,నాన్నలో ఎవరో ఒకరు వాళ్ళని మగపిల్లలతో పోల్చి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు.ఎప్పుడూ చూడని ,వినని ఇటు వంటి విషయాల వల్ల మానసికంగా కొంచెం బాధ,కోపం కూడా కలిగాయి.అయితే చక్కటి సాహిత్యం ,మా ఇంట్లో పెద్దవాళ్ళు, అక్కయ్యల వల్ల సమాజంలో ఈ కోణం పట్ల ఒక అవగాహన కలిగింది.కొందరు టీచర్ల వల్ల ఆడపిల్లల్లో గల సత్తా,దమ్ము ఏమిటో బాగా తెలిసి వచ్చింది.మా PET టీచర్ రాజరాజేశ్వరి టీచర్ పోరాటం ఎలా వుండాలో నేర్పించారు.జయమణి టీచర్ సత్ప్రవర్తన యొక్క విలువ ఎంత గొప్పదో మాకు తెలిసేలా చేశారు.ఇంట్లో ఎంతో వివక్షతకు గురైన బాలికలు కూడా మున్సిపల్ స్కూల్ నుంచి కాలు బయట పెట్టే సమయానికి గుండెలో ధైర్యాన్ని ,కళ్ళలో మెరుపును జీవితం పట్ల నమ్మకాన్ని నింపుకుని ఉత్సాహంగా జీవిత సమరానికి సిద్ధం అయ్యారు.ఈ అనుభవంలో కొసమెరుపు ఏమిటంటే నాకు ఆరవ ఏటనో ,ఎనిమిదవ ఏటనో సరిగ్గా గుర్తులేదు . దసరా నవరాత్రుల మొదటి రోజున మా అమ్మ నాకు కొత్త పావడా జాకెట్టు తొడిగి ఓ చిన్న చెక్క స్టూల్ మీద కూర్చోపెట్టి నుదుటన పెద్ద బొట్టుపెట్టి, కాళ్ళకు పసుపు రాసి,పారణి పెట్టి,మెడలో పచ్చని సువర్ణ గన్నేరు పూలమాల వేసి నువ్వే బాలా త్రిపుర సుందరివి అంటూ పువ్వులు,అక్షింతలు వేసింది. అంతే ఆ చెక్క స్టూల్ సింహవాహనం మనమే అమ్మోరు అన్న ఫీలింగ్ వచ్చేసి , బోలెడు ధైర్యం కూడా వచ్చేసింది.బాలికా దినోత్సవ శుభాకాంక్షలు ఒకప్పటి బాలికలకు,ఇప్పటి బాలికలకు కూడా
బాలికా దినోత్సవం.: వసుధా రాణి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి