“వ్యాసరచకులంతా తమ వ్యాసాల్ని బహు క్లుప్తంగా పుటకొక ప్రక్క చొప్పున నాల్గు పుటలకి మించకుండా వ్రాయాలి. మాచే నిరాకరింపబడిన వ్యాసాల్ని త్రిప్పి పంపజాలము. కావున వ్యాసరచకులు తమ వ్యాసముల యొక్క ప్రతి నొక్కక్క దానిని తమ వద్ద యుంచుకొనవలెను. అనువాదములు గాని, అనుకరణములు గాని యామోదకరములు కావు. వ్యాసములన్నియు స్వపోలకల్పితములై వుండాలి…”ఈ ప్రకటన "వినోదని" అని ఓ నవ్వుల మాస పత్రిక రచయితలకు చేసిన ముఖ్య సూచన. వ్యాస రచకులు ....అనే మాట బలే ఉంది.అరవై ఎనిమిది పేజీల ఈ " వినోదిని " పత్రిక ధర రెండు అణాలు. పైగా ధర చుట్టూ తెలుగు అక్షరంతోపాటు ఇంగ్లీషు, తమిళ అక్షరాలు కూడా ఉండటం విశేషం.ఈ పత్రికలో "కిచకిచలు" పేరిట కొన్ని జోకులు ఇచ్చారు.బహుమతి పొందిన వారి పేళ్ళు (పేర్లను ఈ విధంగా పేళ్ళు అని ఇచ్చారు) అంటూ ఓ పది మంది రచయితల పేర్లను ఇస్తూ వారి వ్యాసరచనలకు పైకాన్ని మనియార్డరు ద్వారా పంపుతామని ఒక పేజీలో ప్రకటించారు. అయితే ఆ పైకం ఎంతన్నదీ తెలుపలేదు. వారిలో మునిమాణిక్యం నరసింహారావు, మొక్కపాటి నరసింహశాస్త్రి, ఆచంట సూర్య నారాయణ మూర్తి తదితరుల పేర్లు ఉన్నాయి.నవ్వు పేరిట ఓ వ్యాసం ఇచ్చారు. ఈ వ్యాస రచయిత పేరు ఇవ్వలేదు కానీ శీర్షిక కింద అనుభవశాలి అని ఇచ్చారు.మునిమాణిక్యం గారి కథ బహుముఖాల అద్దం శీర్షికతో ఈ సంచికలో ఇచ్చారు. ఈ కథకు బొమ్మి గీసిన వారు ఎస్. బ్రహ్మ. సనాతన కాఫీ హోటల్ అనే శీర్షికతో ఎ.వి. కృష్ణమూర్తి గారి కథ వేసారు. దీనికి కూడా ఎస్. బ్రహ్మే బొమ్మ వేశారు. నాయని శేషాచలరావుగారి కథ (లౌ రోగములు), కొంపెల్ల సూర్యారావు గారి కథ, పాత్రుని లక్ష్మణరావు గారి కథ, టి.వి. శర్మ (ఇన్సూరెన్సు ప్రాయశ్చిత్తము), బులుసు వేంకటేశ్వర్లు (సైకిల్ సరదా), ఆచంట సూర్యనారాయణ మూర్తి, గరికపాటి రామారావు, జి. రాజగోపాలరావు, బొడ్డు బాపిరాజు, కాంచనపల్లి వేంకట రంగారావు, మొక్కపాటి నరసింహశాస్త్రి, ఇరువంటి విష్ణురావు, జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి, మల్లవరపు సుబ్బారావు, వల్లూరి చినరథాంగపాణి రచనలు ఈ సంచికలో వెలువడ్డాయి.ఈ పత్రికకు సంపాదకుడు పి. గోపాలస్వామి నాయుడు. మద్రాసులోని గోవిందప్ప నాయక్ స్ట్రీట్ నుంచి వెలువడేది. గోపాలస్వామి నాయుడే ప్రచురణకర్త కూడా.వినోదిని నవ్వుల సచిత్ర మాస పత్రిక విడి ప్రతి రెండు అణాలు కాగా సంవత్సర చందా రూపాయి. విదేశానికైతే సంవత్సర చందా రెండు రూపాయలని పేర్కొన్నారు.ఇక్కడ ఇచ్చిన పత్రిక 1934లో వెలువడింది. నేను చూసిన ఈ పత్రిక రెండో సంవత్సరంలో అడుగుపెట్టి అయిదో సంచికగా పాఠక లోకానికొచ్చింది.
వో ముఖ్య విషయం: -- యామిజాల జగదీశ్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి