వజ్రాల చెట్టు : --ఎం. వి. ఉమాదేవి


 అనగనగా ఒకఅడవిలో వజ్రాలు కాసే చెట్టు ఉంది.కోయ 

వాళ్ళు, జంతుజాలం ఆ చెట్టును చూసి సంతోషపడేవారు కానీ తాకడం 

చేయలేదు. 

వేటకొచ్చిన రాజు వజ్రాలు కాసే 

చెట్టుని చూసి ఆశ్చర్యం తోను, 

విలాసాలతో ఖాళీ అయిన ఖజానా గుర్తు వచ్చి దురాశతోను సైనికులను పిలిచి 

ఈ చెట్టును తవ్వి మన రాజ్యం 

లో నా తోటలో నాటండి అని 

ఆజ్ఞ ఇచ్చాడు. 

ఈ చెట్టు ద్వారా సమకూరే వజ్రాలతో ప్రపంచంలో నే సంపన్నుడిని కావచ్చు కదా అని మీసం దువ్వాడు. 

తవ్వేస్తున్న చెట్టును చూసి 

పక్షులు గోలగా అరుస్తూ అడివి 

అంతా చెప్పేశాయి. 

కోయలగూడెం వాళ్ళు గోడుగోడున ఏడ్చి ఆ చెట్టు మా 

దేవుడు సామీ వదిలేయ్ అంటే 

సైనికులు వారిని తరిమి కొట్టారు. 


వజ్ర వృక్షం రాజు తోటలో 

చంద్రకాంతశిలల మధ్య నాటబడి ఎరువులు,వండ్రుమట్టితో 

పుష్కలంగా నీరు అందిస్తూ 

పెంచేదానికి ఒక ప్రత్యేక మాలి 

కూడా నియమించబడ్డాడు 


రోజులు గడుస్తున్నా ఆ చెట్టుకు 

ఒక్క వజ్రంకూడా కాయలేదు 

రోజూ సభ అయినాక రాజు వచ్చి పరిశీలించి వెళ్ళేవాడు. 

చెట్టువాడి పోయి ఆకులు రాలడం మొదలైంది.రాజు చాలా విచారపడుతున్నాడు. 

      ఒకరోజు పక్క రాజ్యంలో 

వృక్షభాష తెలిసిన వైద్యుడు 

ఉన్నాడని తెలిసిన మంత్రి ఆ 

వైద్యుడిని తీసుకొని వచ్చాడు 


   వజ్ర వృక్షమా నీవు ఇలా కృశించడానికి కారణం ఏమిటి 

అని అడిగిన వైద్యుని చూసి 

చెట్టు జలజలా కన్నీరు కార్చి, 

ఇలా అంది. 

 అయ్యా అడవి నా తల్లి. పక్షులు, జంతువుల సహచర్యంతోనే నేను ఎదిగి 

పుష్పించి,ఫలించగలను. 

అడవి వాతావరణం లేనిదే 

నేను జీవించలేను. ఈ రాజు 

దురాశతో నన్ను తరలించాడు. 

దయచేసి నన్ను నా అడవికి 

చేర్చండి.వజ్రాలు కాసే శక్తి ఇక 

నాకు పోయింది. 

    చెట్టు మాటలు విన్న రాజు 

పశ్చాత్తాపంతో సైనికులని పిలిచి చెట్టును మళ్ళీ అడవికి

తరలింపు చేయండి అన్నాడు. 


నీతి - ప్రకృతి సహాయంతో 

జీవించాలి.ధనంతోనే కాదు. 


కామెంట్‌లు