జయపురంలో మహీపతి అనే గురువు ఒక గురుకులం స్థాపించి విద్యార్థులకు అనేక కొత్త అంశాలు,విశేష శాస్త్ర విషయాలు,కళలు బోధించేవాడు.
ఆయన బోధనా పద్ధతులు నచ్చి జయపురం రాజు తన పుత్రుడు సుగుణాకరుణ్ణి ఆ గురుకులంలో చేర్చాడు.సుగుణాకరుడు ఎంతో ఆసక్తితో విద్య అభ్యసిస్తూ అనేక పురాణాలు,ఉపనిషత్తులు,తాత్విక కథలు నేర్చుకున్నాడు,వాటిని విశ్లేషించే స్థాయికి ఎదిగాడు.క్రమేపీ సుగుణాకరుడిలో తనే తెలివైన వాడిననే గర్వం పొడచూప సాగింది!
సుగుణాకరుడిలో వచ్చిన మార్పును గురువు మహీపతి గమనించి తగిన సమయంలో తగిన విధంగా చెప్పి సుగుణాకరుడి గర్వం తొలగించాలని నిశ్చయించాడు.
ఒకరోజు విద్యార్థులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ "సమస్తం భగవంతుని సృష్టే పశుపక్ష్యాదులు,వృక్షసంపద,ఆఖరికి మనిషి మేధస్సు కూడాఆయన సృష్టే"అని చెప్పాడు.
వెంటనే సుగుణాకరుడు లేచి "ఆచార్యా,భగవంతుడి సృష్టికి భిన్నంగా నేను సృష్టించగలను,తమరు అనుమతిస్తే"అని వినయంగా అడిగాడు.
గురువు ఆశ్చర్య పోయి "భగవంతుడు సృష్టించలేనిది సృష్టించు నాయనా,నేను చూస్తాను"అని చెప్పారు గురువు.
తరువాత సుగుణాకరుడు దూరంగా ఉన్న ఒక రాతి పలక మీద సుద్ద ముక్కతో ఒక వింత చిత్రం గీసాడు.అతని మొహంలో చిరునవ్వు చిగురించింది గర్వంతో.గురువు గారిని ఆచిత్రం వద్దకు తీసుక వెళ్ళి ఈ విధంగా చెప్పాడు."గురువుగారూ ఈబొమ్మ చూడండి,భగవంతుడు సృష్టించని,సృష్టించలేని ఒక జంతువును సృష్టించాను.ఈ జంతువుకి ఏనుగ కాళ్ళు,పక్షి రెక్కలు,సింహంతల,ఎద్దు కొమ్ములు,పాముతోక..."అంటూ ఆచిత్రాన్ని గురించి గర్వంగా వివరించాడు.
"ఆగు నాయనా ఆగు ఇందులో నీవు నీవు సృష్టించిన కొత్త జంతువు ఏదీ లేదు,నీవు గీసిన ఈ చిత్రంలోని జంతువు అవయవాలన్నీ భగవంతుడు ఇంతకు ముందు సృష్టించినవే!అవన్నీ నీవు ఒక చోటకు చేర్చి లేక అమర్చి నాసృష్టి అని చెప్పుకోవడంలో అర్థం ఏముంది?నీవు సృష్టించాలంటే ఈ ప్రపంచంలో అసలు ఇంతవరకు లేనిది సృష్టించాలి కదా!ఇప్పుడు శాస్త్రజ్ఞలు కనిబెడుతున్న పరికరాలకు, మూలసూత్రాలు భగవంతుడు సృష్టించినవే కదా!,ఆలోచించు"అని వివరించారు గురువు.
గరువు చెప్పిన మాటలను గురించి తీవ్రంగా ఆలోచించాడు సుగుణాకరుడు.గురువు చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాక సుగుణాకరుడులోని గర్వం తొలగిపోయింది.
"నన్ను క్షమించండి గురువు గారూ,ఇన్నాళ్ళూ నేనే తెలివిమంతుడని విర్రవీగాను...ఇప్పుడు తెలిసింది నేను నేర్చుకోవలసింది ఎంతో ఉందని,తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయని"అంటూ తలవంచిగురువుగారి పాదాలకు నమస్కారం చేశాడుసుగుణాకరుడు.
గరువుగారు సుగుణాకరుణ్ణి ఆశీర్వదించాడు.
(మంజిత్ బావా చిత్రం చూశాక వచ్చిన ఆలోచన ఈ కథ)
గర్వ భంగం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి