ఒకానొక నెమలీక:--డా॥ కొండపల్లి నీహారిణి

 బాల్యం ఒక మరచిపోలేని జ్ఞాపిక. గుండె సొరగులో దాచుకొని,తీరిక సమయాలలో నింపాదిగా నెమరువేసుకోవాల్సిన జ్ఞాన దీపిక. మనం ఉన్న ఇప్పటి పరిస్థితులకు మనం గడిపిన అప్పటి పరిస్థితులకూ మధ్య వంతెన వేసుకొని అప్పుడప్పుడు అలా బాల్యానికి వెళ్ళివస్తుండాలి. అప్పుడే భావిజీవితానికి కొంచమైనా  బలం చేకూరుతుంది. ఆ చిలిపి పనులు,ఆ అమాయకత,ఆవేదనలెరుగని ఆ ఏడుపులూ,అమానవీయకోణంలోంచి నవ్వని నవ్వులూ ఎన్నో ఎన్నెన్నో బాల్యానికి మట్టి అంటని అనుభూతులు అన్నీకూడా కళ్ళుమూసుకొని అలా వదిలొచ్చిన తోటలో విహరించిరావాలి. గతం అంతా మధురమైందేమీ కాకున్నవాళ్ళైనాగాని,ఏవోకొన్ని మరచిపోలేని మంచి సంగతులు ఉండే ఉంటాయి. మనసు గతులను మీటుతూ హృదయరాగాలను వినిపించే సుసంగతులుగా 
స్మృతికి తెచ్చుకోవాలి. కొండంత జవాన్నిస్తుంది. అందుకే అంటాను బాల్యం బతుకుపుస్తకంలో భద్రంగా దాచుకున్న నెమలీక అని .ఈ జ్ఞాపకం నాకు అటువంటి ఒకానొక నెమలీక!
     నా చిన్నతనం అంతా శోధన,సాధనలతోనే గడిచింది. ఎప్పుడుచూడూ ఇదేంటి ఎందుకిట్లా అదేంటి ఎందుకట్లా అని అన్నీ తెలుసుకోవడం నేర్చుకోవడంతోనే గడిచింది.బాగా ఆటలు ఆడుకోవాలి,బాగా చదువుకోవాలి.అందరు మెచ్చాలి.ఇదే ఉండేది. అమ్మాబాపు,అన్నయ్యలు,అక్కయ్యా,తమ్ముడూ,బాపమ్మ, దోస్తులు,బడి,తోటోళ్ళు,టీచర్లు అందరూ నిచ్చెనమెట్లే!కన్నతల్లిలా పుట్టిన ఊరు కూడా ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. ఆ చిన్ననాటి ముచ్చట్లలో నేనో పసిపాపనయిపోతే....
       పచ్చని వరిపొలాల దృశ్యాన్ని చూడగానే అందరికీ ఏమనిపిస్తుందోగాని, నాకు మహదానందాన్నిచ్చేది. ఓ9,10 ఏళ్ళప్పుడు కావచ్చు అమ్మతోబాటు బావిదగ్గరికి వెళ్ళేదాన్ని . ఇరుకుబాయి అనే పేరుతో ఒకటి , వెంకటేశ్వర్ల బాయి అనే పేరుతో మరొక బావి ఉండేవి . పొలం అంతా పచ్చగా పలకరించేసరికి చిన్ని హృదయం కేరింతలు కొట్టదూ?అలా ఏదో తెలియని పిలుపును గాలి మోసుకొస్తుంటే, ముంగురలను సవరించుకున్నట్లే,ఎగురుతున్న పూలపూల కలినేతలంగాను   చేతితో క్రిందకుతోసుకుంటూ పొలాల గట్లమీదినుండి నడిచిన రోజులవి. . అంత దగ్గరనుండి చూస్తేగాని అర్ధంకాలేదు నేనేమని ఊహించుకున్నానో . నా 7,8 ఏళ్ళప్పుడనుకుంటా ఒక తుంటరి ఆలోచన ఆలోచన వచ్చేది . ఇప్పుటికీ ఎప్పుడు గుర్తుచేసుకున్నా నవ్వు వస్తుంది , అంతేకాదు నిజంగా అదే నిజమైతే బావుండుననీ అనిపిస్తూవుంటుంది. దూరం నుండి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లనిపించి ఆకుపచ్చని ఆ పొలంపైన తెల్లని చెద్దరు వేసుకొని పడుకుంటే బావుంటుందనుకునేదాన్ని.పచ్చని ఆ మొలకలక్రింద నల్లని బురద ఉంటుందని ఏం తెలుసు? 
        ఇలాంటి కోరికను చెబితే అమ్మాబాపులైతే నవ్వి ఊరుకుంటారుగాని అక్కయ్య అన్నదమ్ములకు చెప్తే ఇంకేమన్న ఉంటుందా ?ఏడిపించిపెట్టరూ! “ఆ ..పో పో బాగుంటుంది” అని బనాయించిపెట్టరూ !
    వరి పొలంలో కూలీవాళ్ళు కలుపు తీస్తున్నపుడు దగ్గరినుండి చూస్తేగాని తెలిసింది ఒక్కో మొక్కమధ్య ఖాళీ ఉంటుందని! అబ్బో బురదనా అనుకున్నా, అది గడ్డిమొక్కలా అంత పల్చగా సన్నగా ఉంటుందానని ఆశ్చర్యపోయాను . బురదబ్రతుకులేం తెలుస్తాయి? వాళ్ళ జీవితాలకోసమే మా నాన్న పోరాటాలు చేసారని ఏమితెలుస్తుంది?  పక్కనే  కోతకోస్తున్నదీ గమనించాను.      నేలమ్మ గుండెలోంచి ఆకుపచ్చని మొలకలు ఒడ్లగుత్తుల్ని తెచ్చాక, అవి పసుపుపచ్చ రంగులోకి మారుతాయని,వాటిలోంచే తెల్లని బియ్యం వస్తుందనీ తెలుసుకున్నాక “యురేకా” అని అరవకున్నా మనసైతే ఎలుగెత్తింది. 
            ప్రకృతికి మనిషికీ  విడదీయరాని బంధం ఉంటుంది.  ఆ బంధంలోంచి చూస్తే ఎంతైనా ఒక మహా జ్ఞాపకంగా నా చిన్ననాటి ఆ అమాయక ఆలోచన   చెక్కిన బొమ్మలా అట్లా నిలిచిపోయింది . జీవకళ ఉట్టిపడేటువంటి చైతన్యాన్నీ ఇచ్చింది. ఎందుకంటే పల్లెలను వీడి పట్నాల దారిబట్టినందుకు జ్ఞాపకాలే కదా స్థిరసౌందర్య భావనలు పంచేది! ఇప్పుడు ఎప్పుడు గుర్తుకొచ్చినా నవ్వు వస్తుంది. పంటపొలంపై పక్క వేసి పడుకోలేమని తెలియని బాల్యం ఎంత మధుర జ్ఞాపకం! ఎక్కడో ముసుగేసుకొని ఉన్న ఆ తీపి జ్ఞాపకాల మొలకలను మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ మన ‘మొలక’ పత్రిక చిగురింపజేసింది.నా మనసులోని ఒకానొక నెమలీకను చేతిలోకి తెచ్చుకొని చక్కదనాలను చూపించిన ‘మొలక’కు అభినందనలు.
    

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం