మనిషి మేథోపరంగా ఎంతెత్తు ఎదిగినా ఎన్ని ఆవిష్కరణలు కనుగొన్నా ప్రకృతి ముందు పిపిలీకమే అన్న వాస్తవం రేగొండ పాండవుల గుట్టను సందర్శించడంతో
కోట్ల వత్సరాల ప్రాకృతిక సౌందర్యం మరో మారు
మాకళ్ళ ముందు సాకరమై నిల్చింది
దాని విస్తీర్ణం రెండువేల ఎకరాలు,ఎత్తు ఐదువందల యాభై అడుగులు
ఒక్కోగుట్టది ఒక్కో జంతువు ఆకృతి చూస్తున్నా కొద్ది ఇంకా ఇంకా చూడాలన్పించే వైచిత్రి
పొరలు పొరలుగా నీటి రంపాలతో ఏ అదృశ్యశక్తులో కొండల కాయాలను ఖాయంగా చిత్రికపట్టిన కమనీయ బహుకృతి
గోధుమవన్నె కొండలమీదకెళ్ళే కాలిబాటలకిరువంకలా సాలభంజికలై నిల్చిన ఆకుపచ్చ వృక్షాలు
గాలి గొంతుకలతో గుసగుసగా ఊసులు చెబుతూ ఏడేండ్ల నుండి డెబ్భై ఏండ్లవారి దాకా వచ్చే సందర్శకుల మార్గాయాసాన్ని సునాయాసంగా హరించి వేస్తాయి
కుంతీ సమేత పాండవుల గుహలను, గుహాంతర్భాగాల్లో చిత్రితమైవున్న వేల ఏండ్లనాటి వర్ణసమ్మేళనాలను రెప్పవాల్చడం మరచిపోయి ఆత్మానందాన్ని పొందాము
కొండగుండెల్లో దాగిన నీటి ఊటను సామూహికంగా అర్ధిస్తే అక్కడున్న వాళ్ళందరి దప్పికా తీరేటన్ని నీళ్ళు ఇసుక చెలిమలోమాదిరిగా వెలికి రావడం అబ్బురపరిచే ఘటన
దిగిరాను దిగిరాను దివినుండి భువికి అన్నట్టు రాలేక రాలేక వెనుదిరిగి వచ్చాము
ఇంత అద్భుతమైన సందర్శక ప్రాంతాన్ని అభివృద్ది పర్చడంలో ప్రభుత్వాల అలసత్వం క్షమార్హంకానిది
***
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి