పెద్దలు కెఎల్వీ ప్రసాద్ సర్ గారి మరో ఆణిముత్యపు రచన *నాన్నా పెళ్ళిచేయవూ* అనే కధల పుస్తకం నాకు నేర్పిన గుణపాఠం ఏమిటంటే పుస్తకం పేరుచూసి కధలను ఊహించరాదని. పుస్తకం పేరు చూస్తే అది ఒక హాస్య కధల సంకలనం అనుకున్న నాకు అది జీవిత సత్యాలను నేర్పే గ్రంధమని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. అన్నింటిలోనూ బంధాలు బాంధవ్యాలకు పెద్దపీఠవేసే ప్రసాద్ సర్ తన అలవాటును కొనసాగిస్తూ వారి అక్క(అత్త)గారికి అంకితమివ్వడంలోనే మొదలయ్యింది వారి మక్కువ. ఇక గిరిజా మనోహర్ గారు, సుశీలమ్మగారు, ఝూన్సీ మేడం గారు అందించిన వాక్యాలు పుస్తకానికి ఒక నిండుతనం తెప్పించాయి. ఇక కధల విషయానికొస్తే తన చుట్టూ జరిగిన, జరుగుతున్న విషయాలను సమాజానికి పనికి వచ్చేలా అక్షరీకరించడం రచయితగారికున్న కళలలో ఒకటి. ఇక పెళ్ళీడుకొచ్చిన కుమార్తెల విషయంలో అనవసర భేషజాలతో సాగదీసే తల్లితండ్రులకు నేర్పేగుణపాఠమే పుస్తకం పేరుకూడ అవడమే ఇక్కడి ప్రత్యేకత. ఉచిత తాయిలాలకు ఈడ్చి చెంపదెబ్బ కొట్టేలా అవ్వమనసు బుద్దిచెపుతోంది. మోసం చేసే తెలివిమంతులను అపరిచితుడులో వర్ణించిఋజాగృతపరచారు. హాశ్యపు కధగ అల్లుడి దంతదావనం, పెన్షన్ తో నెట్టుకొచ్చే మద్యతరగతి కుటుంబం ఆందోళన, ఇక క్షణికా వేశంలో చేసే తప్పులకు నిజాయితీ కధను జాగ్రత్తగా అల్లారు. ఇక మాధ్యమాలలో చేసే తప్పిదాలతో సంసారంలో వచ్చే ఒడిదుడుకులను ప్రతిధ్వని పేరుతో వివరించారు. అన్నిపనులు కులాసాగా జరిగితే మగవాడి పని దిలాసా అని ఒక గృహిణి వేదనను చెప్పకనే చెప్పారు. ఇన్ని రకాల సందేశాలలో ప్రతి కధలో సరళమైన బాషలో వివరించడం రచయిత గారి ప్రతిభ మరియు రచనల పై వారి ఆసక్తి వెల్లడి చేస్తుంది. వారికి నా హృధయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు.
***
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి