తెలుగు భాషను సుందరమన్న సుబ్రహ్మణ్య భారతి!;- - యామిజాల జగదీశ్
 తెలుగు భాష సుందరమైనదని అభివర్ణించిన తమిళ జాతీయ కవి ప్రముఖుడు సుబ్రహ్మణ్య భారతి బతికున్న రోజుల్లో ఆయనను, ఆయన కుటుంబాన్ని పేదరికంలో వాడనిచ్చి చూసీచూడనట్టు ఆయన చుట్టూ ఉన్న సమాజం!
వంచిన తల ఎత్తని భార్య చెల్లమ్మ చేయి పట్టుకుని వెళ్తున్న భారతియారుని పిచ్చోడని ఆమె చెవిన పడటం కోసం పెద్దగా చెప్తూ హేళన చేసిన సమాజం!
భారతియార్ అన్నం తినే విధానమే విచిత్రంగా ఉండేది.
అన్నం తినేటప్పుడు ఓ మహారాజు కూర్చున్నట్టుగా నేల మీద కూర్చునేవారు.
బొటనవేలు, మధ్య వేలు, ఉంగరం వేలు అంటూ ఈ మూడు వేళ్ళను మాత్రమే ఉపయోగించేవారు తినేటప్పుడు.
ఆయనకు నచ్చిన ఆహారం కుంపటి మీద కాల్చిన అప్పడం. దారిద్ర్యం వల్ల నెలలో ఓ పది రోజులు మాత్రమే ఏదో ఒక కూర ఉండేది తినడానికి. మిగిలిన రోజులలో కుంపటిమీద కాల్చిన అప్పడమే అన్నంలోకి!
భారతియార్ చెన్నైలోని ట్రిప్లికేన్లో ఉన్న పార్థసారథి ఆలయంలో గల ఏనుగు దాడిలో ఆరోగ్యం దెబ్బతిని మరణించినట్లు పాఠ్యపుస్తకాలలో తప్పుగా చెప్పబడుతోంది.
ఆ బాధాకర సంఘటన రోజున భారతియార్ ఏనుగుకి కొబ్బరికాయ, అరటీ పండు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడున్నవారు ఆయనను అడ్డుకుని హెచ్చరించారు. 
కానీ భారతియార్ సమీపించినప్పుడు ఏనుగు శాంతంగానే ఉంది.
ఆ క్షణంలో ఏమైందో ఏమోకానీ తొండంతో కొబ్బరికాయ, పండు తీసుకోకుండా భారతియార్ నడుము దగ్గర చుట్టి తన నాలుగు కాళ్ళ నడుమ పడేసింది ఆ ఏనుగు. 
రెప్పపాటు కాలంలో భారతియార్ స్నేహితుడైన కణ్ణన్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏనుగు కాళ్ళమధ్యకు పోయి భారతియారుని తన భుజంమీద వేసుకున్నారు.
ఏనుగు తలచి ఉంటే తన కాళ్ళ కింద ఉన్న ఆ ఇద్దరినీ ఆ క్షణాన తొక్కి ప్రాణాలు తీసేసేదే. కానీ తాను చేసింది తప్పని అనిపించిందో ఏమిటో గానీ ఆప్పుడు ఆ ఏనుగులో ఎలాంటి చలనమూ లేదు.
కింద పడినప్పుడు భారతియార్ తలపాగా ఉండటం వల్ల తల వెనుకభాగానికి గాయం కాలేదు. కానీ నేలమీద పడటంతో ముఖమూ ముక్కూ భుజమూ మోచేయీ మోకాళ్ళూ గాయపడి రక్తం కారి స్పృహ కోల్పోయారు భారతియార్.
గాయపడిన కవి భారతియారుని దగ్గర్లోని రాయపేట ఆసుపత్రిలో చేర్చారు మిత్రుడు శ్రీనివాసాచార్య. 
పగవాడికీ మంచి చెప్పిన భారతియార్ తనను గాయపరచిన ఏనుగుని నిందిస్తారా? అంటే లేనే లేదనే చెప్పాలి
కాస్తంత స్పృహలోకి రావడంతోనే భారతియార్ చెప్పారట "ఏనుగు చిరునామా తెలియక నన్ను డీకొంది. ఏమైనా దానికి నాపట్ల కరుణ ఎక్కువే. లేకుంటే నన్ను ప్రాణంతో విడిచిపెట్టేదా?"
గాయం క్రమంగా మానడం మొదలైంది. భారతియార్ స్వదేశమిత్రన్ ఆనే పత్రిక కార్యాలయానికి అయిదారు నెలలు శ్రమతోనే వెళ్ళి వస్తుండేవారు.
గాయం మానిందే తప్ప ఆ అనుకోని సంఘటన మరికొన్ని వ్యాధులను తీసుకొచ్చింది. విరేచనొలతో భారతియార్ ఆరోగ్యం బాగా దెబ్బతీసింది. మళ్ళీ అదే రాయపేట ఆస్పత్రిలో చేరారు.
సెప్టెంబర్ 11 అర్ధరాత్రి దాటింది. శ్వాస ఆగి ముప్పై తొమ్మిదేళ్ళ భారతియార్ భౌతికంగా దూరమయ్యారు.
ఓ అగ్నిపర్వతం ఎలా చల్లారిందో?
ఓ జ్ఞానసాగరం ఎలా ఇంకిపోయిందో?
కువళైకణ్ణన్, లక్ష్మణ అయ్యర్, హరిహర శర్మ, సురేంద్రనాథ్ ఆర్య, నెల్లయప్పర్ అనే అయిదుగురు తమ భుజాలమీద భారతియార్ భౌతికకాయాన్ని మోసుకుని కృష్ణమాపేట శ్మశానవాటికకేసి నడిచారు.
అంతిమయాత్రలో భుజాలమీద మోసినవారిని కలుపుకుని పదహారు మంది మాత్రమే పాల్గొన్నారు. మహాకవి పట్ల చూపిన గౌరవమిదే!? ఆయన శరీరాన వాలిన ఈగల సంఖ్య అధికం అక్కడున్న మనుషుల కన్న!!
భుజాల మీద మోసుకెళ్ళినవారు శ్మశానంలో తమ భారాన్ని దింపి ఉండొచ్చు కానీ బాధాకర సంఘటనతో కలిగిన ఆవేదన భారాన్ని దించగలమా?
ఆయన భౌతికకాయానికి చితి పెట్టే ముందర ఓ నివాళి....
భారతియార్ కీర్తిని సురేంద్రనాథ్ ఆర్య చెప్పగా హరిహర శర్మ చితికి నిప్పంటిం చారు.
వేల కవితలు చెప్పిన పెదవులను,
జ్ఞానజ్యోతిని చిమ్మిన ఆ తీక్షణ చూపులను,
రక్తం ఇంకినా ఊహలు ఇంకని ఆ హృదయాన్ని...
వెతికి వెతికి మరీ లోనికి తీసుకున్నాయి అగ్ని నాలుకలు!!
మహాకవీ!
ఎట్టయపురపు వాగ్ధాటి!
నీ గురించి స్థానికులే అర్థం చేసుకోనప్పుడు ఈ ప్రపంచానికి ఎలా అర్థమవుతుంది?
1882 డిసెంబర్ 11వ తేదీన తమిళనాడులోని ఎట్టయాపురంలో జన్మించిన చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి 1921 సెప్టెంబర్ పన్నెండో తేదీన చెన్నైలో కన్నుమూశారు. జాతీయవిగా పత్రికా రచయితగా స్వాతంత్ర్య సమరయోధుడిగా సంఘసంస్కర్తగా ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న భారతియార్ రచనలు భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలు విస్తరించేలా చేశాయి. అలనాటి భారత జాతీయ కాంగ్రెస్ క్రియాశీల సభ్యుడిగా జాతీయోద్యమంలో పాలుపంచుకున్న భారతియార్ విప్లవాత్మక కార్యకలాపాలకు కన్నెర్ర చేసిన బ్రిటీష్ పాలకులు అరెస్టు వారంట్ జారీ చేసారు. ఆయన రచనలన్నీ మతమూ రాజకీయమూ సాంఘిక అంశాల చుట్టూ సాగేవి. ఆయన రాసిన పాటలను కవితలనం తమిళ సినిమాలలోనూ సంగీత కచేరీలలో విరివిగా వాడుకున్నారు. ఇప్పటికీ వాడుతుంటారుకూడా. భారత ప్రభుత్వం 1987 నుంచి అత్యున్నత జాతీయ స్థాయి సుబ్రహ్మణ్య భారతి పురస్కారాన్ని నెలకొల్పి ప్రతి ఏటా హిందూ సాహిత్యంపై అత్యున్నత స్థాయి రచనలు చేసిన రచయితలను సత్కరిస్తూ వస్తోంది. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం ఓ పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది.

కామెంట్‌లు