అనగనగా విదర్భ దేశాన్ని శూరసేనుడు పాలించేవాడు.ప్రజలందరూ రాజుగారి పాలన రామరాజ్యాన్ని మరిపిస్తుందని గొప్పగా చెప్పుకునేవారు.ఆనోటా ఈనోటా పొరుగుదేశంలో ఉన్న వీరేంద్రకు తెలిసింది.ఒకసారి వెళ్ళి రాజ్యం లోని విశేషాలు తెలుసుకోవాలనుకున్నాడు.
ఆ సమయం రానే వచ్చింది.ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న యువకులకు శూరసేనుడు ఆహ్వానం పంపాడు.విదర్భ రాజ్యంలో ఇరవై ఒక్క రోజులు అతిథులుగా మర్యాదలు స్వీకరించడానికి అవకాశం కల్పించాము.వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు.కానీ వచ్చినవారు రెండు మంచి అలవాట్లు అలవరచుకొని వెళ్ళాలని,ఆ ఇరవైఒక్క రోజులు కోపతాపాలకు అతీతులుగా ఉండాలనీ,వారి రాజుగారి వద్ద నుండి ఆదేశపౌరుడిగా వస్తున్నట్లు లేఖ తీసుకురావాలని షరతు విధించాడు.ఈ అవకాశాన్ని వీరేంద్ర ఉపయోగించుకున్నాడు.అలా పొరుగు దేశాలనుండి యువకులు విదర్భ రాజ్యానికి పయనమయ్యారు.
శూరసేనుడు యువకులకోసం ఏర్పాట్లు చేయించాడు.మంత్రిని పిలిపించి సమాలోచనలు జరిపాడు.యువకులందరితో పాటు వీరేంద్ర చేరుకున్నాడు.ప్రయాణబడలిక తీర్చుకుని ,అందరు ఉదయం ఆరుగంటల కల్లా కాలకృత్యాలు తీర్చుకొని సిద్ధంగా ఉండాలని సమాచారాన్ని అందించాడు.
మరుసటి రోజు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదికాలు ముగించుకొని యువకులంతా సిద్ధమైనారు.ఆరుగంటలకు శూరసేనుడు యువకులను ఉద్దేశించి ప్రసంగించారు.
" విదర్భ దేశానికి అతిథులుగా విచ్చేసిన యువకులందరికీ సాదర స్వాగతం.ఈరోజు నుండి సరిగ్గా ఇరవై ఒక్క రోజులు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ,మారాజ్యం లోని వింతలు, విశేషాలు తెలుసుకోండి.ప్రజల జీవనవిధానాన్ని గమనించండి.అందుకు తగిన అన్ని ఏర్పాట్లను చేయడమే కాకుండా ,తగిన బలగాన్ని కూడా ఏర్పాటు చేస్తాను " అన్నారు.అందరూ ఉత్సాహంగా కరతాళ ధ్వనులు చేసారు.
ప్రణాళిక ప్రకారం ఆయుధశాలలు,విద్యాలయాలు,అటవీ ప్రాంతాలు ,సామాజిక స్థితిగతులు ,జీవనవిధానం అన్నీ వివరంగా తెలుసుకున్నారు యువకులంతా.సమయం పూర్తయింది . చివరిరోజు శూరసేనుడు యువకులతో సమావేశమై వారి మనోభావాలను,అభిప్రాయాలను తెలుసుకున్నాడు.
మన షరతు ప్రకారం మీరు రెండు మంచి అలవాట్లు చేసుకున్నారు.ఒకటి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం,రెండు సమయపాలన పాటిస్తూ పద్ధతి ప్రకారం ఆచరించడం.మానవుని ఉన్నత స్థితికి,అభివృద్ధికి కారణాలివే.యువత ఈ అలవాట్లను పెంపొందించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు".యువకులందరితో పాటు వీరేంద్ర సంతోషంగా స్వదేశాలకు పయనమయ్యారు.
..
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి