మంచి మనసుకు మంచిరోజులు;- - బోగా పురుషోత్తం.

 సీతారామాపురంలో సీతయ్య అనే గొప్ప ధనవంతుడు వుండేవాడు. అతనికి కోట్ల రూపాయల ఆస్తి వుంది. పిల్లలు పుట్టలేదు. వృద్ధాప్యం సమీపించింది. తీవ్ర మనో వేదనతో మంచం పట్టాడు. నడవలేకపోయాడు. ఆరోగ్యం క్షీణించింది.
 దీన్ని గమనించిన అతని తమ్ముడి కుమారుడు పెద్దనాన్న వద్దకు వెళ్లాడు. ‘‘ పెద నాన్నా..పెద్దనాన్నా.. నువ్వేం భయపడకు..నీకు మేమున్నాం..దిగులు పడకు..ఏదైనా అయితే నాకు బాధేకదా..!’’ అని కపటప్రేమ కురిపించాడు.
సీతయ్య అతని మాటలతో ఆందోళన చెందాడు. ఇన్ని రోజులు తన వద్దకు వచ్చి కనీసం పలుకరించని వాడికి ఒకే సారి ఇంత ప్రేమ ఎలా పుట్టిందా..’’ అని ఆలోచనలో పడ్డాడు. అప్రమత్తతతో గమనించసాగాడు.
 సీతయ్య ఆరోగ్యం మెరుగు పడలేదు. అతని తమ్ముడి కొడుకు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఖర్చులన్నీ తనే ఇచ్చాడు. డాక్టరు ఇచ్చిన మందుల్ని తనే స్వయంగా అందించాడు. ఆరోగ్యం కొంత మెరుగైంది. ఇంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది.
  సీతయ్య తీవ్ర అనారోగ్యానికి గురై అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇంట్లో పని పనిషి దీన్ని గమనించింది. వెంటనే ఆస్పత్రిలో చేర్చింది. సీతయ్య విసం మింగాడని వైద్యులు తేల్చారు. సీతయ్యకు ఇచ్చిన మందుల సీసా తీసుకొచ్చి పనిమనిషి వైద్యులకు చూపించింది.
  వైద్యులు విషప్రయోగం జరిగిందని తేల్చారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందింది. సీతయ్య తమ్ముడి కొడుకును పోలీసులు తీసుకెళ్లారు.
సీతయ్యకు పనిమనిషి దగ్గరుండి సేవలు చేసింది.  కొద్ది రోజులకే సీతయ్య మంచి వైద్యం అంది కోలుకున్నాడు. మంచి మనసుతో తనను రక్షించిన పని మనిషి రత్తమ్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కోట్ల రూపాయలు వున్న తన ఆస్తి మొత్తాన్ని రత్తమ్మపేరుపై రాసి రుణం తీర్చుకున్నాడు సీతయ్య.
ఎంతో పేదరికంతో పస్తులతో బతికిన రత్తమ్మ  మంచి మనసుకు ఆకలి బాధ తప్పిపోయింది. సీతయ్య కోరిక మేరకు తన భర్త, కొడుకును వెంట తెచ్చుకుని సీతయ్య ఇంట్లో కాపురం పెట్టింది.
   సీతయ్యకు నిస్వార్థంతో సేవలు చేస్తూ ఆనందంతో అందరికీ ఆదర్శంగా నిలిచింది రత్తమ్మ.

కామెంట్‌లు