తెలుగు వైభవము(వచనకవిత);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 త్రిలింగసంగమ హృదయంగమ భాషగా నానారాజన్యుల రాజభాష అయి 
రసరమ్య భావాల కవిహృదయ కేదారమై 
పరభాషాపదహృదయ పరిష్వంగ భాషగా మసలి 
సుధీర గభీర ఆలోచనాలోచన భాషగా తనరి 
ఏడురాగాల రుచిగల ఐంద్రచాపమై నిలిచి
అసమాన ఆత్మీయ అమృతధారలొలికి ఒంపుసొంపుల ముత్యాల హొయలుగల భాషగా 
పద్యమై, గద్యమై, గేయమై, కవితయై, కథయై, ఆత్మకథయై, జీవితకథయై, వ్యాసమై 
ఇలా నానా నామరూపధారియై అక్షరాస్యులే కాదు, నిరక్షరాస్యులే కాదు
నాగరీకులేకాదు, జానపదులేకాదు అందరినోట కూడా జాణయై, పట్టపురాణియై 
వేలయేండ్లుగా పదిలంగానిలిచి, దేశభాషలందు తెలుగులెస్సగా భావింపబడి
ఔరా! అనిపించు అందాల అజంతభాషగా ఒనరిన మాత ఏమిచెప్పను నా తెలుగు భాషామతల్లి వైభవము
అది అఖండ తేజోవిరాజిత దివ్య రమణీయ విభవము!!!
+++++++++++++++++++++++++
( *తా నా* నిర్వహించిన కవి సమ్మేళనములో నేను చదివిన కవిత)

కామెంట్‌లు