దుష్ట సంహారిణి దుర్గామాత నమోస్తుతే !;- " కావ్యసుధ " 'వాజ్ఞయ భూషణ''ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'-9247313488 : హైదరాబాదు
 అమ్మవారికియుద్ధానికి సంబంధించిన ఆయుధాలనీ, అలంకారాలనీ వేస్తే ఆ రూపం 'దుర్గ' అవుతుంది. సమరే-యుద్ధవేషాన్ని ధరిస్తే దుర్గా- దుర్గాదేవి).
యుద్ధవేషం వేయడమంటే ఊరికే కత్తుల్ని, డాలునీ శూలాన్నీ... ఇలా మారణాయుధాలని ధరించిన ఓ సామాన్యయోధుని వేషం వేయడం లాటిది కాదు. ఏ యే దేవతలు తమ తమ తపశ్శక్తుల్ని ఆ యా ఆయుధాల్లో నిక్షేపించారో, ఆ ఆయుధాల్ని ఆ యా దేవతల నుండి తీసుకోవడమన్నమాట. శంకరుడు శూలాన్నిచ్చాడంటే ఆ శూలంలో శంకరశక్తి ఉన్నట్టు. విష్ణువు తన చక్రాన్ని చ్చాడంటే విష్ణుశక్తి ఆ చక్రంలో దాగివున్నట్టు.
ఇలా భల్లాన్ని (బల్లెం అంటారే అది) సుబ్రహ్మణ్యుడూ,వజ్రాన్ని (వజ్రాయుధం) ఇంద్రుడూ... ఇలా ఆమె కిస్తే ఆ అందరు దేవతల సహకారంతో మహిషాసురుని మీదికీ, అతని పరివారంమీదికి దూకింది అమ్మ..
ఓ రాక్షసుణ్ణి, వాడి పరివారాన్నీ వధించడానికి అమ్మకి. కూడా ఇందరి సహకారం కావలసివస్తే, అమ్మకి ఎంత శక్తి ఉన్నట్టు? ఆమె మన కష్టాలని ఏమాత్రం తీర్చ గలుగుతుంది? అని అన్పిస్తుంది. లోవిశేషం అది కాదు. ఏ రాక్షసులు తమ తపస్సుతో దేవతలనుండి వరాలు పొందారో, ఆ వరాలని పొందినందుకు కృతజ్ఞతాభావంతో ఉండాల్సిందిపోయి వరాలిచ్చిన దేవతలమీదికే ఎదురు దాడికి దిగారనేది ఇక్కడి రహస్యం.అందుకే ఏ దేవతాశక్తికి సంబంధించిన వరమూ కూడా ఆ రాక్షసుడికి సహాయపడకుండా వుండేందుకు 'అమ్మ అందరు దేవతలశక్తినీ వారివారి ఆయుధాల రూపంలో స్వీకరించి మరీ బయల్దేరింది- ఒక అన్యాయాన్ని మనం ఎదిరించడానికి అందరు
పక్షులనీ సమీకరించుకుని బయల్దేరినట్టు.
          ఎర్రని వస్త్రాలతో, ఎర్రని కళ్ళజీరతో, వ్యాఘ్రం మీద కూచుని అన్ని ఆయుధాలనీ ధరించిన అమ్మ రజోగుణ మూర్తిని కాబట్టి అమ్మకి ఈ రోజున ఉగ్రనైవేద్యం అంటే పులిహోరలో కొద్ది జీలకర్రపొడిని కలిపి మరీ నివేదిస్తారు. ఆవునేతిముద్దలో మిరియపుపొడి కలిపి భక్తులకి ప్రసా దంగా పెడతారు కూడా.
భీకరరూపాన్ని మార్చిన ఆదిశంకరులు:
విజయవాడలో ఉన్న దుర్గమ్మ మొదట్లో పైన అను కున్న రీతిగా భీకరంగా ఉండేదట. ఈమెను సర్వజన ఆరాధకురాలిగా తీర్చిదిద్దాలని భావించిన ఆదిశంకరులు. ఆమెముందు తపస్సుచేసి శాంతస్వరూపిణిగా ఉండవల సిందని ప్రార్థిస్తే, ఆ తల్లి ఈ భక్తుని కోరికకి ఆనంద పడి చక్కగా తలంటుపోసుకుని ఆటలాడుకోవడానికి సిద్ధంగా ఉన్న 10-12 ఏళ్ళ కూతురిలా చిరునవ్వు నవ్వుతూ మారిపోయింది.
'నన్ను కటాక్షించిన నా బంగారుతల్లివి కదూ!' అంటూ ఆదిశంకరులు ఆమెకి 'కనకదుర్గ' అని పేరుపెట్టారు. ఈ దుర్గమ్మని పూజిస్తే, మానసిక భయం తొలగుతుంది. చక్కని బుద్ధిని ప్రసాదిస్తుంది.
ఆర్థిక దారిద్ర్యాన్నీ - సంసారం ఏమైపోతుందో అనే ఆందోళననీ తొలగించడమేకాక పదిమంది సహాయకుల్ని కూడా ప్రార్థించిన వ్యక్తికి పరిచయం చేసి మనశ్శాంతిని కల్గిస్తుందట. దుర్గే స్మృతా హరసి భీతి మశేషజంతోః... సర్వోపకార కరణాయ సదార్థ చిత్తా! కాబట్టి దుర్గమ్మ భీకరరూపిణి కాదు-భయాన్ని
తొలగించే మూర్తి.
         

కామెంట్‌లు