భక్తి మార్గమే శ్రేయోదాయకం- సి.హెచ్.ప్రతాప్

 ఈ కలియుగం ఎన్నో దోషాలకు, కల్మషాలకు నిలయం. అయితే మానవుడు పక్కదారి పట్టకుండా సూటిగా శ్రేయోమార్గంలో నడిచేందుకు అనేక బోధనలు, సందేశాల ద్వారా భగవంతుడు మనిషికి సందేశాలను ఇస్తున్నాడు. వాటిని అర్ధం చేసుకొని మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎప్పుడూ మానవత్వంతో భక్తి మార్గంలో చచరించడమే అత్యంత శ్రేయోదాయకం. మానవత్వం మరిచి రాక్షసత్వానికి దగ్గరైతే నరుడు నారాయణుడు కాక  రెండు కాళ్లజంతువు వలె మారిపోతాడు.  అందుకే పరమాత్మ గురించి తెలుసుకొని పశుజన్మనుంచి పశుపతి కాగలిగితే మానవ జన్మ ధన్యం అయినట్లు అవుతుంది.
అనేక జనన మరణ పరంపరల నుండి ముక్తిని పొందేందుకు భక్తి ఒక మార్గము. జీవునికి , దేవునికి మధ్య వారధి భక్తి అన్నది శాస్త్ర వాక్యం. కాల ప్రవాహానికి ఒడిదొడుకులకు అతీతమయినది భక్తి . సాధకులు, ఆరాధకులు ఏ విధంగా ఉండాలో మనకు నారదభక్తి సూత్రాలు విపులీకరించాయి. భక్తి తో తన ఇష్ట‌దైవాన్ని ఆరాధిస్తే మనఃశ్శాంతి కలుగుతుంది .  సన్మార్గ‌ములో నడిచేందుకు వీలుపడుతుంది .  నిత్యజీవ‌నంలో ఒత్తిళ్ళకు , ఒడిదొడుకులను తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది. కృష్ణద్వైపాయనుడు అందించిన శ్రీమద్భాగవతములో ఏకాదశ స్కంధములోని “ఉద్ధవ గీతలో”  కృష్ణుడు కొంతమంది మహానుభావుల సగుణ భక్తి ద్వారానే మోక్షాన్ని పొందారని చెబుతాడు.గోవులు, గోపికలు, చెట్లు, జంతువులు మరియు పాములు కూడా తన మీద భక్తి ద్వారానే తనను పొందవచ్చునని, వీరు ఏ విధమైన వేద పఠనం గాని యోగములు కానీ చేయవలసిన పని లేదని అంటాడు.భక్తి లేకపోతే ఏ సాధన మోక్షమివ్వదు.  కానీ భక్తి ఒక సాధన మార్గం కాదు. భక్తి భౌతిక కర్మగా వ్యక్తమైతే అది కర్మయోగంగా, మానసిక కర్మగా వ్యక్తమైతే అది ఉపాసనాయోగంగా , అదే భక్తి స్వాధ్యాయంలో జ్ఞానయోగంగా సాధనమవుతుంది. ఆ భక్తి తీసివేస్తే ఏ పని సార్ధకమవదు.మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది.కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను, ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది అని శ్రీ కృష్ణ భగవానుడు గీతలో భక్తి మార్గం యొక్క ప్రాశస్త్యాన్ని అత్యద్భుతంగా తెలిపారు. 
కామెంట్‌లు