సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -455
కీల ప్రతి కీల న్యాయము
****
కీల అనగా అగ్ని జ్వాల,మంట,చీల, మేకు,చిల్ల కోల, మోచేయి, కొంచెము.ప్రతి అనగా సమానము, మారు అనే అర్థాలు ఉన్నాయి.
బండిని నడిపే ఇరుసుకు రెండు వైపులా చక్రములు జారిపోకుండా ఉండేందుకు రెండు మేకులు ( శాయ మేకులు) బిగిస్తారు.
అలాగే ఏదైనా ఉద్దిష్టార్థమును అనగా ఉద్దేశించబడిన అర్థమును స్థిరము చేయు సిద్ధాంతమును దృఢీకరించుటకై మరికొన్ని ప్రమాణ వాక్యములను పొందు పరుస్తారు.
అనగా ఏదైనా విషయాన్ని  సుస్పష్టంగా విశదీకరించడంతో పాటు దానికి సంబంధించిన శాస్త్రీయపరమైన ఋజువులతో నిరూపిస్తూ,వేలెత్తి చూపడానికి కూడా వీలు లేకుండా సిద్ధాంతాలతో  దృఢీకరించుటను మన పెద్దలు ఈ "కీల ప్రతి కీల న్యాయము"తో పోల్చి చెబుతారు.
 మరి కీల లేదా మేకు బండికి ఎందుకు బిగిస్తారో చూద్దామా...
 రైతుల దైనందిన ప్రధాన భాగం ఎద్దుల బండి.పూర్వ కాలంలో ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళడానికి ఎడ్లబండినే ప్రయాణ సాధనంగా ఉపయోగించేవారు.ప్రస్తుతం పల్లెల్లో ధాన్యాన్ని ఇంటికి చేర్చడానికో,పొలాలకు యూరియా మొదలైన బస్తాలు మోయడానికో ఎద్దుల బండిని ఉపయోగిస్తున్నారు.
అయితే  ఈ ఎద్దుల బండికి ఇరువైపులా రెండు పెద్ద చక్రాలు  ఇరుసుకు తగిలించి ఉంటాయి.ఆ చక్రాలు కదలికలో ఊడి రాకుండ వాటికి మేకులు బిగిస్తారు.ఇరుసు అంటే చక్రం లేదా గేరు  తిరగడానికి బిగించిబడిన బేరింగ్ వ్యవస్థ. అలా ఇరువైపులా ఇరుసుకు  బిగించిన మేకుల వల్ల బండి గతుకుల్లాంటి రోడ్లలో ప్రయాణించినా చక్రాలు ఊడకుండా పటిష్టంగా ఉంటాయి.అలా  బండికి చెక్కతో చేసిన చక్రాలు , ఆ చక్రాల చుట్టూ ఇనుప పట్టీలు బిగించేవారు . అలా బిగించడం వల్ల చక్రాలు అరిగిపోకుండా నునుపుగా సాగిపోయేలా వుంటాయి.ప్రస్తుతం ఇదంతా ఎందుకని జీపులు,బస్సుల టైర్లను చక్రాలుగా వాడుతున్నారు.
 ఇలా బండి నడవడానికి చక్రాలు, చక్రాలు ఊడకుండా శాయ మేకులు బిగించడం తప్పని సరి అని తెలిసింది కదా!
బండికి ఇరుసు,ఇరుసుకు చక్రాలు, చక్రాలకు శాయ మేకులు..ఇలా బండి నిర్మాణం,నడక చెప్పుకున్నాం. ఐతే బండి  సులువుగా నడవాలంటే ఇరుసుకు కందెన అనగా  ఇరుసు తుప్పు పట్టకుండా,చక్రం తేలికగా  తిరగడానికి రాసే గ్రీజు వంటి పదార్థము.సుమతీ శతక కర్త  "ఇరుసుకు కందెన పెట్టక/పరమేశ్వరు బండియైన పారదు  సుమతీ! అంటారు.
 ఇక శివ భక్తులు ఏమంటారంటే నిరంతరం చలించే ఈ విశ్వభ్రమణానికి శివుడు ఇరుసు వలె వుండి లోక రక్షణ చేస్తున్నాడని అంటారు.
అంతే కాదండోయ్! మనిషి వ్యక్తిత్వాన్ని కూడా దీనితో పోల్చి చెప్పారు.కట్టుబాట్లు అనే శాయ మేకులు లేకుంటే మనిషి అనే బండి ఎప్పుడో చక్రాలు ఊడిపోయి నలుగుట్లో నగుబాటు అవుతుంది అంటారు.
 కేవలం బండిని ఉద్దేశించి మాత్రమే కాదు ఏదైనా విషయాన్ని ధృవీకరించడానికి పకడ్బందీగా  చూపించే ఋజువులు కూడా శాయ మేకుల్లాంటివి అన్న మాట.
ఇక అలాంటి విషయాలు నమ్మదగినవి,ప్రమాణపూర్వకమైనవని మనకు అర్థమవుతోంది.
 
 ఇలా వివిధ విషయాలు, శాస్త్రీయ పరిశోధనలతో పాటు మనుషులకు సంబంధించిన నమ్మకాలకు, వ్యక్తిత్వాలకు కూడా ఈ "కీల ప్రతి కీల న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చని గ్రహించగలిగాం.
ఏది ఏమైనా మన పెద్దవాళ్ళు మాట్లాడే ప్రతి మాట,చెప్పే ప్రతి సామెత , సూక్తి వెనుక ఏదో ఒక అంతరార్థం ఖచ్చితంగా ఉండి తీరుతుందని ఇలాంటి వాటి వల్ల అర్థం చేసుకోవచ్చు.
  ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు