ఒక చిన్న అడవి ఉండేది. అందులో కుందేళ్లు, జింకలు, కోతులు, ఉడుతలు , పక్షులు వంటి చిన్న చిన్న ప్రాణులు నివసించేవి. పులి, సింహం వంటి క్రూర జంతువులు మాత్రం లేవు. ఆ అడవికి రాజు అనేది ఎవరూ లేరు. అక్కడ పక్షులు , జంతువులు స్వేచ్ఛగా బతికేది . దొరికిన పండ్లు, ఫలాలు తింటూ కలిసిమెలిసి ఉండేవి. రోజూ సాయంత్రం ఒకచోట కూర్చుని ముచ్చట పెట్టుకునేవి. డాన్సులు వేసేవి. ఇక్కడి విషయాలను తెలుసుకున్న కొండముచ్చు పక్క అడవి నుండి వచ్చి చేరింది. తోక పొడవుగా ఉండి నల్లని ముఖము కలిగిన కొండముచ్చును చూసి పిల్ల కోతి ఫక్కున నవ్వింది . మునుపే కొండముచ్చులకు, కోతులకు పడదాయే. అట్లా నవ్వొద్దని తల్లి కోతి పిల్ల కోతికి చెప్పింది. అయినప్పటికీ పిల్ల కోతి తన నవ్వును ఆపుకోలేక పోయింది. దీనితో కొండముచ్చుకు పట్టరాని కోపం వచ్చింది. ఈలోగా మరికొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. కొండముచ్చు జోలికి వెళ్లొద్దని పిల్ల కోతికి చెబుతూ అక్కడి నుండి జారుకునే ప్రయత్నం చేయ సాగాయి. ఇది గమనించిన కొండముచ్చు వాటిని బెదిరించాలని అనుకుంది. వెంటనే "నేను ఈ అడవికి రాజును. నన్ను చూసి పిల్ల కోతి నవ్వుతాదా!" అంటూ ఉరిమి ఉరిమి చూసింది. "నీ కాలిన ముఖానికి నువ్వొక రాజువా? " అని పిల్ల కోతి మనసులో అనుకుని మళ్లీ గల్లుమని నవ్వింది. దీంతో కొండముచ్చుకు పట్టరాని కోపం వచ్చి పిల్ల కోతి పై దూకపోయింది. తల్లి కోతి వెంటనే సమయస్ఫూర్తితో పిల్ల కోతిని పక్కకు తప్పించి తన అక్కున చేర్చుకుంది. " అయ్యా మహారాజా! ఈ పిల్ల కోతికి ఏమి తెల్వదు. దయచేసి మన్నించు " అని తల్లి కోతి కొండముచ్చును బ్రతిమిలాడింది. కొండముచ్చు కాస్తంత శాంతించింది. " నేను పక్క అడవిలో ఉండే దాన్ని. మా అడవికి రాజైన సింహం నన్ను ఈ అడవికి రాజుగా నియమిస్తూ పంపించింది" అంటూ కోతులకు సెప్పింది . కోతుల ముఖాల్లోని భయాన్ని చూస్తూ ఆనందపడ్డది. ఆ కోతులను మరింతగా భయపెట్టిస్తూ ఈ పూటకు తనకు ఆహారాన్ని అందించాలని ఆదేశించింది. చేసేది లేక తల్లి కోతి తన చెట్టు పైన దాచుకున్న ఆహారాన్ని తెచ్చి ఇచ్చింది. ఇట్లా రోజుకింత ఆహారాన్ని నాకు తెచ్చిపెట్టాలని హెచ్చరించింది . సరే అని ఒప్పుకున్నది తల్లి కోతి.
ఇట్లా కొంత కాలం పాటు కొండముచ్చు అడవిలోని సాధు జంతువులను బెదిరిస్తూ కాలం కొనసాగించింది. గతంలో ఉన్న స్వేచ్ఛ ఈ అడవిలోని కోతులకు, కుందేళ్ళకు, జింకలకు, ఉడుతలకు లేకుండా పోయింది. తమ ఆత్మ గౌరవం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఒకరోజు అల్ప జీవులన్నీ రహస్యంగా ఒకచోట సమావేశం పెట్టుకున్నయి. ఈ ఆపద నుండి కాపాడుకోవడానికి తన దగ్గర ఒక ఆలోచన ఉందని తల్లి కోతి మిగతా జంతువులతో చెప్పింది. అన్నింటికి ధైర్యం చెప్పింది.
ఆ మరునాడు కొండముచ్చు దగ్గరికి వెళ్లి " మహారాజా..! మాలాంటి అల్పజీవులను భయపెట్టడం మీకు తగదు. మీ గురించి చెడుగా మాట్లాడుకునే మనుషులు ఉన్నారు. మిమ్ములను వారు ఎప్పుడు బెదిరిస్తూ ఉంటారు. ఈ అడవిలోని పండ్లు, పొలాలు అన్నింటిని మనుషులు మనల్ని బెదిరించి తీసుకెళ్తున్నారు. పాపం కుందేళ్ళకు, ఉడతలకు ఆహారం దొరకక చాలా రోజులైంది. ఆ మనుషులను భయపెడితే మీకు సరిపోను ఆహారం లభిస్తుంది " అని తల్లి కోతి పలికింది. అప్పటినుండి కొండముచ్చు అడవికి వచ్చి పోయే జనం మీద దాడి చేస్తూ భయపెట్ట సాగింది. రాను రాను కొండముచ్చు దాడి జనం మీద పెరిగిపోయింది. కొండముచ్చు భారీ నుండి తప్పించుకోవడం ఎలా అని మనుషులు ఆలోచించసాగారు.
ఈ విషయం తెలుసుకున్న మహేష్ అనే యువకుడు కొండముచ్చు భారీ నుండి ప్రజలను కాపాడేందుకు ఒక ఆలోచన చేసి మర్రి చెట్టు కింద నున్న బావి పక్కన మంచం మీద పడుకున్నాడు. చెట్టు పైన ఉన్న కొండముచ్చుకు మరింత కోపం వచ్చింది. ఈ మనిషిని మంచం తో సహా బావిలోనికి తోసేయాలని అనుకుని మెల్లగా చెట్టు దిగి వచ్చింది. కొండముచ్చు వస్తున్న విషయాన్ని గమనించిన యువకుడు పడుకున్నట్లు నటించాడు. మంచం దగ్గరికి వచ్చిన కొండముచ్చు మంచాన్ని ఎలా బావిలోకి తోయాలి అని ఆలోచిస్తూ నెట్టబోయింది . విషయం తెలుసుకున్న యువకుడు దాని తోకను దానికి తెలియకుండా మంచం నులక తాడుతో కట్టాడు. కొండముచ్చు మంచాన్ని బావిలోనికి నెట్టేసింది. బావిలో పడే సమయంలో ఆ యువకుడు పైనుంచి వేలాడే మర్రి ఊడలు పట్టుకుని బయటపడ్డాడు. మంచంతో సహా కొండముచ్చు బావిలో పడింది. చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్న కొండముచ్చును చూసి పాపం అనిపించి దాన్ని రక్షించాడు. కుండముచ్చుకు చావు భయమంటే ఏమిటో తెలిసి వచ్చింది. అది వెంటనే తన అడవికి వెళ్ళిపోయింది. దాంతో ఈ అడవిలోని కుందేళ్లు , కోతులు, జింకలు, ఉడుతలు, పక్షులు హాయిగా జీవించడం చేశాయి. ఇక అప్పటినుండి కొండముచ్చులు జనం జోలికి రాకుండా ఏదో భయపెడుతున్నట్లు మాత్రమే చేస్తాయి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి