పక్షుల సంకల్పబలం:- --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 9441561655
 ఒకానొకప్పుడు సముద్ర తీరాన తీతువు పక్షుల జంట సంతోషంగా ఉండేది. కొంతకాలం పిదప  తీతువు ఆడ పక్షి తీరం వెంట ఉన్న ఇసుక    తిన్నెల పై గుడ్లు పెట్టేది . ఆహారం కోసం బయటకు వెళ్లి వచ్చేసరికి   అలల తాకిడికి ఆ గుడ్లు సముద్రంలో కలిసేవి. దాంతో ఆ పక్షి చాలా బాధపడేది . మళ్లీ గుడ్లు పెట్టి మేతకు వెళ్లి వచ్చేసరికి సముద్రపు అలలు వీచి నీళ్లల్లోకి కొట్టుకుపోయేవి. ఇలా అనేకమార్లు పెట్టిన గుడ్లు సముద్రం పాలు అయ్యేవి. జరుగుతున్న విషయాన్ని తన భర్త అయిన మగ పక్షి కూడా చెప్పింది. దాంతో ఆ పక్షులకు కోపం వచ్చి  దీనంగా సముద్రుణ్ణి ప్రార్థించాయి . అయినా ఎటువంటి ఫలితం లేదు.  తుదకు తీతువు పక్షుల జంట తమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం కోసం    సముద్రపు నీటిలో  మునిగి నోటి నిండా నీళ్లతో ఒడ్డుకు వచ్చి ఇసుకలో పోస్తూ  ఇసుకను తమ రెక్కలకు,ఈకలకు అద్దుకుని   తిరిగి నీటిలో మునగడం నిరంతరం చేస్తుండేవి.   ఈ చిన్న పక్షులు పెద్ద సముద్రాన్ని లేకుండా చేయడమనేది  అసంభవమని చూసిన వారంతా నవ్వసాగారు . అయినా ఈ పక్షులు అవేమీ పట్టించుకోకుండా  పట్టుదలతో అదే పనిని నిరంతరం చేస్తు వచ్చాయి . కొద్దిరోజుల తర్వాత  ఇవి చేస్తున్న తీరును ఇదే జాతికి చెందిన పక్షులన్ని  ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగాయి. తమ గుడ్లను నిరంతరం సముద్రపు అలలు నాశనం చేస్తున్నాయని, అందుకనే సముద్రంలో ఉన్న నీరంతా  ఎండగట్టాలని, అదే రీతిన  ఇసుక అంతా సముద్రంలో నింపాలన్న తమ సంకల్ప బలాన్ని తెలిపాయి. మిగిలిన తీతువు పక్షులన్నీ ఏకమై ఇదే ప్రయత్నం చేయ సాగాయి.
      కొంతకాలానికి  ఈ పక్షి జాతి చేస్తున్న పోరాటం పక్షుల రాజైన గరుత్మంతుడు కి తెలిసింది.  వెంటనే గరుత్మంతుడు తన జాతి పక్షులు చేస్తున్న  ప్రాంతానికి మద్దతుగా చేరుకున్నాడు. తన జాతిని రక్షించుకోవడం కోసం తాను కూడా నీటిలో మునిగి  ఇసుక దిబ్బలపై పొర్లి  పెద్ద పెద్ద రాళ్ళను  తెచ్చి సముద్రంలో వేయడం చేశాడు.
     ఈ ప్రక్రియ ఇలా  నిరంతరం కొనసాగుతూ ఉండగా ఓ రోజున    పై లోకంలో ఉన్న  విష్ణుమూర్తి తన అవసర నిమిత్తము తన వాహనమైన గరుత్మంతుడు గురించి వాకబు చేయగా భూలోకంలోని సముద్ర తీరాన ఉన్న విషయం తెలిసింది. దానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని స్వయంగా విష్ణుమూర్తి కిందికి దిగి వచ్చాడు.  తన పక్షి జాతి గుడ్లను సముద్రం నాశనం చేస్తున్నదని అందుకే మేమంతా సముద్రాన్ని ఎండగట్టాలని ఈ ప్రయత్నం జరుగుతుందని  గరుత్మంతుడు చెప్పాడు.
       పట్టుదలగా చేస్తున్న పక్షులకు సహాయం చేయదలచి విష్ణుమూర్తి వెంటనే సముద్రుడుని రమ్మని ఆజ్ఞాపించాడు.  విష్ణుమూర్తి పిలుపు  మేరకు ప్రత్యక్షమైన సముద్రునితో  వెంటనే పక్షుల జాతి గుడ్లు తెచ్చి ఇవ్వమని చెప్పాడు.  అతని మాటలు కాదనలేక సముద్రుడు గుడ్లు తెచ్చి ఇచ్చాడు. విష్ణుమూర్తి పక్షులను పిలిచి గుడ్లని ఇచ్చి  సముద్రపు తీరానికి  అలలు రావడమనేది దాని నైజమని,  వేరొక చోట గుడ్లు పెట్టమని కోరాడు. సరే అని పక్షులన్ని ఒప్పుకున్నాయి.అటు సముద్రుడికి ఇటు పక్షులకు న్యాయం జరిగినందుకు  తృప్తిపడ్డారు.
చిన్న పక్షి ప్రారంభించిన సంకల్ప బలానికి  లోపల నుండి సముద్రుడు పైకి రావడం, పైనున్న విష్ణుమూర్తి కిందికి దిగి రావడం గొప్ప విషయం. ఇక్కడ పక్షుల వజ్ర సంకల్పం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.
       
    

కామెంట్‌లు