దావత్ జేయాలె-ఖుషీగుండాలె:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 నేను లాబీ జెండాను
ఛీ!వీళ్ళ చేతుల్లో బడి నలిగిపోతున్నాను.
నయవంచనల నినాదాలిస్తూ,
నమ్మబలుకుతూ కారుకూతలు  కూస్తున్నారు.
సెంటిమెంటును అవసరమొచ్చినప్పుడల్లా, రావణకాష్ఠంలా రగిలిస్తూ,
రాక్షసక్రీడ ఆడుతూనే ఉన్నారు.
సంవత్సరాలు నింపుకుంటూ
కేకులు కట్ చేసుకొని తింటున్నారు.
స్కాముల స్నానాలు హాయిగా చేసేసి,
చిరునవ్వుల సెంటులద్దుకొని
సిగ్గు,షరం లేకుండా తిరుగుతూనే ఉన్నారు.
భూభోజనం షడ్రసోపతంగా చేసి,
బ్రేవుమని సేదతీరినవారే లగచర్ల,కంచ గచ్చిబౌలీల బౌండరీలు కొట్టజూస్తున్నారు.
రవ్వంత పౌరుషపు పోకడలతో ఫామ్ హౌసుల ప్రహేళికలు సంధిస్తున్నారు.
పంచభూతాల సాక్షిగా హస్తసాముద్రికాలు చూపించుకుంటూ ఊరేగుతున్నారు.
మద్యకుంభకోణాల కుతంత్రాలతో తడిగుడ్డలు లేకుండానే కుత్తుకలు కోసినారు.
కుదేలు పడేసి అగ్వ తెలంగాణ జేసి,పండ్లికిలిస్తున్నారు.
నీళ్ళలో పగుళ్ళు చేసి,
లక్షలకోట్లు ప్రవహింపజేసినారు.
పీతజాతి ఆహారాలై గొంతుల్లో
హాయిగా జారిపోతున్నారు.
భక్షణ,భజన,గానా బజానాలతో ఖజానాలు కొల్లగొట్టినారు‌.
జీతాలే జీవితాలు చేసి
శల్యసారధ్యాలు నడిపినారు.
ఉసురు ముట్టి మూలగ్గూసున్నా,
బుసలు కొడుతూ,కుబుసాలు విడుస్తూ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు.
దేవుళ్ళ సొమ్ములు అలంకరిస్తూ
పాపభీతులతో పునీతులవుతున్నారు.
ఉత్సవాలు చేయిస్తూ,ఉత్సవమూర్తులై ఊరేగుతున్నారు.
నినాదాల బలిపీఠాలెక్కిస్తూ,
నీచరాజకీయాలు ముందుకు తీసుకెళ్తున్నారు.
వాపు చూసుకొని బలుపనుకొని,
అస్తిత్వానికే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు.
ప్రాంతీయుడే మోసం చేస్తుంటే
మొద్దునిద్రలో ఉచిత జనులు
జోగుతున్నారు.
కామెంట్‌లు