ఆలోచించి మాట్లాడాలి:- - యామిజాల జగదీశ్

 అనగనగా ఓ రాజు. అతనికి ఓ విచిత్రమైన కల వచ్చింది.
ఆ కలలో అతనొక భారీ మర్రిచెట్టుగా మారిపోయాడు. దాంతో అతనికి భయమేసి తాను చెట్టుగా మారిపోవడమేమిటీ...తన రాజ్యం ఏమైపోవాలి అని భయపడి లేచి కూర్చున్నాడు.  అప్పుడు సమయం అర్థరాత్రి దాటింది. నిద్రపట్టలేదు.
ఎప్పుడు తెల్లవారుతుందా ఆలోచనలోపడ్డాడు. పడుకున్న గదిలోంచి ఇవతలకు వచ్చి అటూ ఇటూ తిరుగాడాడు.
తనకొచ్చిన కలతో ఏమవుతుందోనని ఆందోళనచెందాడు.
ఉదయం పనులన్నీ త్వరత్వరగా కానిచ్చుకున్నాడు.
భటులను పంపించి ఆస్థాన జ్యోతిష్కుడిని దగ్గరుండి తీసుకురమ్మన్నాడు.
జ్యోతిష్కుడు రావడంతోనే రాజు తనకొచ్చిన కలను పొల్లుపోకుండా చెప్పాడు. దాని వల్ల ఏదన్నా ముప్పా అని అడిగాడు. అప్పుడు జ్యోతిష్కుడు తన దగ్గరున్న పురాతన ప్రతినొకటి బయటకు తీసాడు. మర్రిచెట్టుగా మారిపోతే ఏమవుతోందన్న పేజీ తీసి చదివాడు.
రాజా, మీకొచ్చిన కల ప్రకారం మీ భార్య, పిల్లలు, బంధువులు అందరూ మీ కన్నా ముందరే చనిపోతారు అన్నాడు జ్యోతిష్కుడు.
రాజు ఏమిటీ నా వాళ్లందరూ నాకన్నా ముందరే నన్ను విడిచిపెట్టిపోతారా అని కంగారుగా అడిగాడు. అంతేకాదు, కోపావేశంతో రెచ్చిపోయాడు. ఈ జ్యోతిష్కుడిని తీసుకుపోయి తక్షణమే  బంధించండి అని ఆజ్ఞాపించాడు.  
భటులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జ్యతిష్కుడిని తీసుకుపోయి కటకటాలవెనకకు నెట్టారు.
అప్పటికీ రాజు మనసు కుదుటపడలేదు.
మరొక జ్యోతిష్కుడిని పిలిపించాడు.
అతను రావడంతోనే రాజు తనకొచ్చిన కల గురించి చెప్పి ఏమవుతుందో చెప్పమని అడిగాడు. ఆ జ్యోతిష్కుడు కూడా తన దగ్గరున్న ప్రతిని చదివాడు. అనంతరం, రాజా, దిగులు పడకండి. మీకొచ్చిన కల మంచిదే. ఇందులో అనుమానం వద్దు. ఎలాంటి భయాలు పెట్టుకోకండి. మీ ఆయుష్షు దీర్ఘమైనది. ఎంతటి శత్రువైనా మిమ్మల్ని పడగొట్టలేడు అన్నాడు. మీరు మీ కుటుంబసభ్యులకన్నా బంధువులకన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. మీ ఆయుష్షు ఆ మర్రిచెట్టులా గట్టిది. ఇదే మీరు కన్న కల తాలూకు అర్థం అన్నాడు జ్యోతిష్కుడు.
జ్యోతిష్కుడి మాటలు విన్న రాజు మనసులో ఉన్న కోపం ఎగిరిపోయింది. చల్లబడింది. శాంతించాడు. అంతులేని ఆనందం పొందాడు.
ఆ జ్యోతిష్కుడికి బోలెడన్ని కానుకలు ఇచ్చి పంపాడు.
రెండో జ్యోతిష్కుడు కూడా మొదటి జ్యోతిష్కుడు చదివిన విషయాన్నే చదివాడు.
అతనిలాగానే చెప్పాడు. కానీ ఏం చెప్పాడు....
అది కదా ముఖ్యమైనది.
ఆస్థాన జ్యోతిష్కుడు చెప్పిందేమిటీ...రాజుగారి కుటుంబసభ్యులు, బంధువులు అతని కన్నా ముందే మరణిస్తారని చెప్పాడు.
రెండో జ్యోతిష్కుడు కూడా అదే చెప్పాడు. కానీ దాన్ని ఎలా చెప్పాడంటే, మీ బంధువులకన్నా మీరు దీర్ఘకాలం బతుకుతారన్నాడు.
ఇద్దరూ చెప్పిన విషయం ఒక్కటే. కానీ
చెప్పిన తీరు వేరు. అంతే.
మనం మాట్లాడాలనుకన్న మాటల్ని ముందుగా ఆలోచించి మాట్లాడితే ఎన్నో సమస్యలను తప్పించవచ్చు. మనం మాట్లాడే మాటలు ఇతరులను సంతోషపరచాలి. అప్పుడు సమస్యలు తలెత్తవు. అంతేతప్ప మనం చెప్పే మాటలతో ఎదుటివారికి కోపం తెప్పించేలా ఉండకూడదు. నొప్పించకూడదు.
 ఎవరైనా కావచ్చు ఎంతటి వారైనా కావచ్చు, తానేం మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడని, తానేం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడని చెప్పారు స్వామి వివేకానందులవారు. తమ మాటలతోనూ, చేతలతోనూ ఇతరులకు బాధ కలిగించకుండా ఉన్నవారే ఉత్తములు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఎకరికి హితవు చెప్పడం సులభం కాదు. కానీ తాను ఆచరణలో పెట్టడం గురించి ఆలోచించడు. ఇది సరికాదు. ఏదేమైనా మాటాడం అనేది ఓ గొప్ప కళ. అందుకే పెద్దలు అంటుంటారు, మాటలు ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో తెలియాలి. అలాగే ఎప్పుడు మాటలు ఆపాలో కూడా తెలియాలి. లేకుంటే ఎంత చెప్పినా లాభం లేదు. బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.   

కామెంట్‌లు