మమతానురాగాల హోరు - పాతపొన్నుటూరు

 వంశధార నదీ తీరం, గలగల హోరు, 
పాతపొన్నుటూరే మా ఊరు, 
పంచదార కన్నా తీపి, మా ప్రజ తీరు, మంచినే పంచే బంగారు, 
రాజల్లే రాణింపు, రాజిల్లే తలంపు, శోభిల్లే సొంపు, చల్లని చూపు, శ్రీరస్తగు మా పిలుపు, శుభమస్తగు మేల్కొలుపు, నీతుల్నే పల్కు మా ప్రతి గెలుపు, అంటూ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం వేదికపై ఆలపించిన తనను,  మమతానురాగాలు హోరెత్తీ గ్రామ పెద్దలు 
ఘనంగా సన్మానించారని, అట్టి అనేక మధురస్మృతులు పాతపొన్నుటూరుతో తనకు పెనవేసుకున్నాయని ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు అన్నారు. కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న తాను, పని సర్దుబాటు డెప్యుటేషన్ బదిలీల్లో భాగంగా ఏడు నెలల క్రితం ఈ పాతపొన్నుటూరు వచ్చి, తిరిగి నేడు తన యథాస్థానమైన కడుము హైస్కూల్ లో చేరిపోయానని తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలరావు పాతపొన్నుటూరుతో తనకు గల అనుబంధాలను పంచుకున్నారు. 
భారత రాజ్యాంగ దినోత్సవం, బాలల దినోత్సవం, రిపబ్లిక్ డే,  సంక్రాంతి తదితర ప్రత్యేక పర్వదినాల సందర్భాలలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో వందకు పైగా బాలబాలికలకు షీల్డ్ లను, ప్రశంసాపత్రాలను, పుస్తకాలను బహూకరించి ప్రోత్సహించానని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 అంశంపై స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ప్రథమ స్థానం, సైన్స్ క్విజ్ లో ద్వితీయ స్థానం, గణిత పోటీలలో కన్సోలేషన్ స్థానాలను విద్యార్థులు సాధించుట ఎంతో ఆనందాన్నిచ్చిందని తిరుమలరావు అన్నారు. అలాగే సైన్స్ ప్రోజెక్ట్ మండల స్థాయిలో ప్రథమ, ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షలో ఒక బాలిక ఉత్తీర్ణత సాధించుట ద్వారా ఆ పాఠశాల మిక్కిలి గర్వకారణంగా నిలిచిందని తిరుమలరావు అన్నారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పాతిక బృంద నృత్యాలు, అరడజను నాటికలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయని, మధ్యమధ్యలో తన గీతాలాపనలు కూడా ఆదరణకు నోచుకున్నాయని తన సంతోషం వ్యక్తం చేసారు. తన పాఠ్యాంశాల బోధన మరియు సృజనాత్మక నైపుణ్యాలను బాలబాలికలంతా చక్కగా అందిపుచ్చుకొనుట ఎంతో సంతృప్తినిచ్చిందని తిరుమలరావు అన్నారు. భోగిమంటను వేసి, చుట్టూ తిరుగుతూ తామంతా నృత్యాలు చేస్తూ జరిపే వేడుకలు మరపురాని అనుభూతి అని కళ్ళల్లో నీటి సుడులు తిరుగుతుండగా భావోద్వేగంతో అన్నారు. కేవలం ఏడు నెలల కాలంలోనే గ్రామస్తులందించే తోడ్పాటు, ఒక పెద్దగా తనను అభిమానించే తీరు వెల కట్టలేని ఆప్యాయతమయం ఈ పాతపొన్నుటూరు అని తిరుమలరావు అభివర్ణించారు. తాను పనిచేసిన కాలంలోనే గ్రామంలో ఎప్పటి నుంచో ఆగి యున్న శ్రీరామ మందిరం, ప్రతిష్ఠకు నోచుకుందని, ఆ సందర్భంలో శ్రీరామ గీతాన్ని ఆలపించే అదృష్టం తనకు కలిగిందని ఆయన అన్నారు. తనను గౌరవిస్తూ, తన సేవలను కొనియాడుతూ పలు సార్లు సత్కరించిన, పాదాభివందనాలు చేసిన ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావులతో పాటు, పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్, సభ్యులకు, సచివాలయ ఉద్యోగులకు, ఆయా,మధ్యాహ్న భోజన పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం నిర్వాహకులకు, అంగన్వాడీ కేంద్రం ఉద్యోగులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు తిరుమలరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ తన ఆశీస్సులు వారందరికీ ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ పాఠశాలకు కొత్తపొన్నుటూరు, బంకి, బంకిగూడ గ్రామాల నుంచి కూడా విద్యార్థులు రావడంతో ఆ గ్రామాల ప్రజలు కూడా ఎంతో అభిమానం చూపారని అన్నారు. తన ఉద్యోగ జీవితంలో ఈ పాఠశాల పదకొండవ పాఠశాల అని, ఏడు నెలలే పనిచేసిననూ ఎక్కువ కాలం పనిచేసినట్టి తీపి గురుతులను అందించిన ఈ పాతపొన్నుటూరు తన గుండెల్లో  ఎన్నటికీ పదిలంగా ఉంటుందని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మానవహారాలందు, గ్రామంలో ర్యాలీలందు, నూతన ప్రవేశాలకు నమోదులకు ఇంటింటికి వెళ్లే పర్యటనలందు నినాదాలు, పాటలు, కవితలు వినిపించిన తనను తామంతా స్ఫూర్తి పొందినట్లు చాటిన ప్రజాస్పందన చాలా ఆనందం చేకూర్చిందని అన్నారు. తన వృత్తి నిర్వహణలో భాగంగానే గుణాత్మక విద్యను అందించడం, పాటలు కవితలు చిత్రలేఖనం వంటి బహుముఖ ప్రజ్ఞతో తాను పురోగతి దిశగా నడిపిన నేపథ్యంలో, వారందరికీ ఒక సన్నిహితమై, చేరువై, తద్వారా మధుర స్మృతిగా పాతపొన్నుటూరు పాఠశాల నిలిచిందనుట అతిశయోక్తి కాదని తిరుమలరావు ఆనందభాష్పాలతో అన్నారు.
కామెంట్‌లు