ఊషన్నపల్లిలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
 -అలరించిన పాఠశాల పిల్లల నృత్య విన్యాసాలు 
-ప్రతిభ చాటిన పిల్లలకు ప్రశంసా పత్రాలు పంపిణీ 
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం  ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (స్వయం అభ్యసన కేంద్రం)లో 'పాఠశాల వార్షిక దినోత్సవ వేడుకలు' ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు రకరకాల, రంగు రంగుల దుస్తులు ధరించి, అందంగా ముస్తాబయ్యారు. 'స్వాగతం' అనే పాటతో ప్రారంభించి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాట వరకు మొత్తం 18 వివిధ రకాల పాటలకు నృత్యం చేస్తూ పిల్లలు చూపరులను ఆనందంలో ముంచెత్తారు. నృత్యకారులు (కొరియో గ్రాఫర్లు) దాసరి శ్రీనివాస్(చిరంజీవి), తాండ్ర ప్రిన్సి, కరుణశ్రీ ల ఆధ్వర్యంలో దేశభక్తి, శాస్త్రీయ, పల్లె పాటలు, సినిమా, సందేశాత్మక గీతాలకు చిన్నారులు అలవోకగా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ పిల్లలు ప్రదర్శిస్తున్న నృత్య భంగిమలు వీక్షించిన తల్లిదండ్రులు సంతోషంతో  పొంగిపోయారు. నృత్యాలు చేస్తూనే పిల్లలు మధ్యలో వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన పద్యాలు, పాటలు పాడారు. పాఠాలు, పాఠ్యాంశాలపై స్కిట్లను చేసి, ప్రదర్శించారు. అనంతరం పాఠశాలకు ఎక్కువ రోజులు హాజరైన వారు, వార్షిక పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన పదిమంది బాల బాలికలను గుర్తించి వారికి ఎంఈఓ సిరిమల్ల మహేష్, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, టీచర్లు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు ఇలాంటి వివిధ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. మరో ముఖ్య అతిథి విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిపల్లి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తన శిష్యుడని, అంకిత భావంతో పని చేస్తూ పాఠశాల అభివృద్ధికి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఈర్ల సమ్మయ్య  విద్యా పరమైన సేవలను ఊషన్నపల్లి గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని మహేందర్ రెడ్డి కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ 
ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చిందని, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అన్ని విషయాల్లో పాఠశాల పిల్లల్ని అద్భుతంగా తయారు చేస్తున్నామని, పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ మహేష్, విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిపల్లి మహేందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల
సమ్మయ్య, ఎఎపిసి ఛైర్ పర్సన్ పెండ్లి స్వరూప, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, బండారి స్రవంతి, డ్యాన్స్ మాస్టర్లు దాసరి శ్రీనివాస్, తాండ్ర ప్రిన్సి, కరుణశ్రీ, ముసుకు మధుకర్, కొమ్ము నరేష్, వెంకటేష్, ప్రదీప్, రాజయ్య, సంపత్, రవి, పిల్లలు, వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు