షడ్వికారములెక్కడ?:- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్ -9985117789

 సాహితీ కవికళా పీఠం
సాహితీ కథలు
==============
ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్ అయిన వల్లభయ్య గారు  నగరానికి దూరంగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నారు. ఆయన భార్య నర్మద గృహిణి. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులూ, ఒక కూతురు. వల్లభయ్య గారు ఉద్యోగంలో ఉన్నప్పుడే పిల్లలు స్థిరపడ్డారు. వారికి వివాహాలు కూడా అయ్యాయి. ఉద్యోగ బాధ్యతలరీత్యా పిల్లలు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు.
భార్య నర్మద కోరిక మేరకే ప్రశాంతంగా జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో, నగరానికి దూరంగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నారు వల్లభయ్య గారు. అయితే అపార్ట్మెంట్ నివాసితుల మానసిక స్థితులను గమనించిన వల్లభయ్య  గారికి ప్రశాంతత కరువయ్యింది.
ఎవర్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండమంటుంది భార్య నర్మద.  ఇతరుల విషయాల్లో ఏ రకంగానూ జోక్యం చేసుకునే మనస్తత్వం కాదు వల్లభయ్య గారి మనస్తత్వం. అయితే ఆయన సమక్షంలో దోషాలను  చూస్తూ వదిలేసే మనస్తత్వం కూడా కాదు. 
అపార్ట్మెంట్ బిల్డర్ కొనుగోలుదారుల నుండి తీసుకున్న సొమ్ముకు తగిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. అపార్ట్మెంట్ నివాసితులందరూ మీటింగులలో గగ్గోలు పెట్టారు. ఏ ఒక్కరూ బిల్డర్ తో గొడవ పెట్టుకోరు. లక్ష్మీపతి ఒక్కడే బిల్డర్ ను నిలదీసి అడిగినట్లు అతనికి మెయిల్ పంపినట్లు మీటింగులో చూపించాడు. అందరూ అతన్ని అభినందించారు. బిల్డర్ నుండి ఎటువంటి స్పందనా రాలేదు. లక్ష్మీపతి కూడా ఆన్ సైట్ అవకాశం రావడంతో జపాన్ వెళ్ళాడు. అపార్ట్మెంట్ విషయాలను వాట్సాప్ గ్రూప్ లో చర్చిస్తూ ఉంటాడు. అపార్ట్మెంట్ పై పట్టు ఉండాలన్నది అతని ఆలోచనగా వల్లభయ్యగారు గ్రహించారు.
ఆ పరిస్థితులలో వల్లభయ్య గారు రంగంలోకి దిగారు. అమ్మకపు ఒప్పంద పత్రంలోని నియమ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించారు. అపార్ట్మెంట్ నివాసితులందరినీ ఏకం చేశారు. బిల్డర్ను లెటర్స్ ద్వారా హెచ్చరించారు. అతనికి ఇవ్వవలసిన సమయం ఇచ్చాక లీగల్ నోటిస్ పంపించారు. బిల్డర్ కాళ్ల  బేరానికి వచ్చాడు. అమ్మకపు ఒప్పందంలో ఒప్పుకున్న సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాడు.
అపార్ట్మెంట్ నివాసితులంతా వల్లభయ్య గారిని ఆకాశానికి ఎత్తేసారు. అసోసియేషన్లో ఆయన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఆన్ సైట్ లో ఉన్న లక్ష్మీపతికి వాట్సప్ గ్రూప్ ద్వారా అన్ని విషయాలు తెలిసాయి. తన ఉనికిని కాపాడుకోలేకపోతున్నందుకు బాధపడ్డాడు. అపార్ట్మెంట్లోని తన స్నేహితులను బసవయ్య గారికి వ్యతిరేకంగా తయారు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. 
ఆన్ సైట్ నుండి తిరిగి వచ్చాడు లక్ష్మీపతి. అపార్ట్మెంట్ విషయాల్లో తల దూర్చటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. లక్ష్మీపతి తన స్నేహితులకు, ఇంట్లో పార్టీలు, బయట సినిమాలతో పాటు తరచూ మందు పార్టీలు ఇవ్వడం చేశాడు. కొంతమంది అతని పక్కకు చేరిపోయి, అతని కోరిక మేరకు అపార్ట్మెంట్ మీటింగ్లలో వల్లభయ్య గారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. 
గతంలో సేవ చేసిన లక్ష్మీపతిని అసోసియేషన్ లోకి తీసుకోవాలని అతని మద్దతుదారులు గొంతు పెంచారు. వల్లభాయ్ గారు తన ప్రెసిడెంట్ పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే  ఆ నిర్ణయానికి చాలామంది ఒప్పుకోలేదు. దానితో లక్ష్మీపతితో ఎక్కువగా కలిసి తాగే లోకరాజు తన సెక్రటరీ పదవికి రాజీనామా చేసి లక్ష్మీపతిని సెక్రటరీ చేయాలని కోరాడు. 
వల్లభయ్య గారు అపార్ట్మెంట్ మీటింగ్ కండక్ట్ చేసి లక్ష్మీపతిని సెక్రటరీ చేయడానికి నివాసితుల అభిప్రాయాలను అడిగారు. లక్ష్మీపతి మద్దతుదారులు సెక్రటరీ గా లక్ష్మీపతి ఉండాలన్నారు. ఎక్కువమంది ఎటూ చెప్పకుండా తమ బుద్ధి కౌశల్యం ప్రదర్శించారు. లక్ష్మీపతి సెక్రటరీ అయ్యాడు.
లక్ష్మీపతి మద్దతుదారులతో చేసే అవకతవకలను వల్లభయ్య గారు వ్యతిరేకించేవారు. లక్ష్మీపతి తన లౌక్యంతో వల్లభయ్య గారిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
అపార్ట్మెంట్లో రెండు రకాల ఫ్లాట్స్ ఉన్నాయి. సగం త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్. మిగిలినవి డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్. అసోసియేషన్ ఫ్లాట్ లోపల ఎటువంటి సేవలనూ అందించదు. నీటి సరఫరాకు మీటర్ల ప్రకారం ఛార్జ్ చేస్తారు. లిఫ్టు, వాచ్మెన్ సర్వీసులు, పరిసరాల వినియోగం అందరికీ సమానము. వాటి నిర్వహణ ఖర్చు సమంగా భరిస్తారు.
లక్ష్మీపతి బుర్రలోకి వచ్చిన కుతంత్రాన్ని ఆచరణలో పెట్టాలనుకున్నాడు. వల్లభయ్య గారిని కలిశాడు. డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ వాళ్ళ  నెలవారీ నిర్వహణ ఖర్చులు త్రిబుల్ బెడ్ రూమ్ వారి కన్నా తక్కువ ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని చెబుతాడు. ఉమ్మడి సేవలు అందరూ సమంగా అనుభవిస్తున్నారు.  కాబట్టి ఖర్చులు భరించడంలో తేడా ఉండకూడదని లక్ష్మీపతి అంటాడు. పరిస్థితులను అందరికీ వివరించుదామని చెబుతారు వల్లభయ్య గారు. డబుల్ బెడ్ రూమ్ నివాసితులను విడివిడిగా కలిసి వల్లభయ్య గారు వ్యతిరేకిస్తున్నట్టు వక్రీకరిస్తాడు లక్ష్మిపతి. అయితే తను మాత్రం తప్పనిసరిగా న్యాయం చేకూర్చుతానని అంటాడు. నివాసితుల నడుమ చీలిక తీసుకురావడంలో లక్ష్మీపతి సఫలమయ్యాడు.
వల్లభయ్య గారు అపార్ట్మెంట్లో లక్ష్మీపతి చేస్తున్న ఆగడాలకు మనస్తాపము పొందారు. ఒకరోజు సాయంత్రం పిల్లలు ఆడుకునే పార్కులో కూర్చున్నారు. పిల్లలను చూస్తూ ఆయన బాధలను మర్చిపోయారు.
వల్లభయ్య గారు అన్ని మర్చిపోయి పిల్లలనూ వారి ఆటలను గమనించారు.
ఇసుకలో చేతులు పెట్టి పాదాలతో ఆడటం, గోపురాలు కట్టడం, తోటి పిల్లలు పడగొడుతుంటే తిరిగి కట్టుకోవడం -
ఊయెలలు ఊగుతూ, గాలిలోకి ఎగరడం -
జారుడు పళ్ళ మీద జారడం - 
పరిగెడుతూ వచ్చి పచ్చిక మీద పడుకోవడం -
అంతే కాదు
నకిలీ ఆటల్లో పాత్ర పోషించడం
ఊహాత్మక సంభాషణలు చేయడం
పిల్లలు ఆటల్లో ఉక్రోషాన్ని ప్రదర్శించేవారు. వెంటనే మర్చిపోయి తిరిగి కలిసి పోయేవారు.
వల్లభయ్య గారు ఇంతకుముందు ఇలాంటి దృశ్యాలు అనేకసార్లు చూశారు. అప్పుడు కలగని అనుభూతిని ఇప్పుడు  పొందారు. 
ఆ పిల్లల్లో ఆయనకు కనపడిన అమాయకత్వం ఆకర్షించింది. వాళ్లలో ఎటువంటి ద్వేష భావాలూ లేవు. కోపం లేదు. ఈర్ష లేదు. అసూయ లేదు. పగలూ ప్రతీకారాలు అసలే తెలియవు. కుట్రలు కుతంత్రాల అర్థమే తెలియదు.
కంటికి కనిపించే దేవుళ్ళలా ఉన్నారు. "పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
ఆ పురుటికందు మనసులో దైవముండును" అన్న కవిగారి మాటలు అక్షరాల సత్యమనిపించాయి. అదే కవి గారు "పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే" అన్నారు.
చాలా సంతోషపడ్డారు వల్లభయ్య గారు. తనను తాను మరిచిపోయి చాలా సమయం తన్మయత్వంలో గడిపారు.
వల్లభయ్య గారి మనసులో వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. అపార్ట్మెంట్ వ్యవహారాల్లో తల దూర్చటం మానేశారు. ప్రతిరోజూ సాయంత్రం పార్కుకు వెళ్తున్నారు. పిల్లలతో స్నేహం చేస్తున్నారు. వాళ్ల అపార్ట్మెంట్లో ఫంక్షన్ల కోసం ఒక పెద్ద హాలు ఉంది. వల్లభయ్య గారు పిల్లలకు శని ఆదివారాల్లో ఆ హాల్లో కథలు చెబుతున్నారు.
ఇదంతా గమనించిన లక్ష్మీపతి బృందం చాలా ఆనందించారు. 'మన దెబ్బకు ముసిలోడు తట్టుకోలేక తోక ముడి చేశాడు' అని కామెంట్లు చేశారు. ఆయన జోలికి వెళ్లడం మానేశారు. 
వల్లభయ్య గారు పిల్లల తో ఒక నాటకాన్ని ప్రాక్టీస్ చేయించారు. ఆ నాటకానికి వల్లభయ్యగారే స్వయంగా అరిషడ్వర్గాల వల్ల మనుషులు ఎంతగా దిగజారిపోతారో పిల్లల పాత్రలకు తేలికైన సంభాషణలను సహజంగా వ్రాసారు. తల్లిదండ్రుల ప్రవర్తనను పిల్లలు ఏ రకంగా గమనిస్తారో  ఆ నాటకంలో వ్రాసారు. తల్లిదండ్రుల చెడు ప్రవర్తనను గమనించిన పిల్లలు పార్కుల్లో తమ  ఆటల్లోనూ నకిలీ పాత్రల్లోనూ ఎలా బయట పెడతారో స్పష్టంగా ఆ నాటకంలో వల్లభయ్య గారు చక్కగా వ్రాశారు.
ఒక సందర్భంలో ఆనాటికను అపార్ట్మెంట్ లో ఏర్పాటుచేసిన ఒక ఫంక్షన్కు స్కూల్ హెడ్మాస్టర్ గారిని అతిథిగా పిలిచి వల్లభయ్య గారు పిల్లలచే ఆ నాటకాన్ని ప్రదర్శింప చేశారు. 
అపార్ట్మెంట్లో తల్లిదండ్రులందరూ పిల్లల ప్రదర్శనను చూడటానికి ఉత్సాహపడి రావడంతో పాటు చుట్టుపక్కల వారికి తెలిసిన వారిని కూడా తీసుకుని వచ్చారు.
నాటకం పూర్తయింది. చివరిలో హెడ్మాస్టర్ గారు ప్రసంగించారు. 
"చాలా చక్కటి నాటకం ఇది. ఇందులో నటించిన పిల్లలు నన్ను బాగా ఆకర్షించారు. ఈ వయసులో వాళ్లు తెలుసుకోవలసిన విధంగా నాటకాన్ని వ్రాసిన వల్లభయ్య గారు అభినందనీయులు. పిల్లల తల్లితండ్రులు పిల్లలను ఎలా పెంచాలో చక్కగా వ్రాయడంతో పాటు తల్లిదండ్రులు చేయకూడని పనులను కూడా చక్కగా చూపించారు" అని ప్రసంగాన్ని మరికొంత సేపు కొనసాగించి ముగించారు. 
పిల్లలందరికీ చక్కటి బహుమానాలను ఇచ్చారు. 
తాను చెప్పదలుచుకున్నది చెప్పినందుకు వల్లభయ్య గారు సంతోషపడి అపార్ట్మెంట్ నివాసితులలో మార్పు వస్తాదని ఆశిస్తున్నారు. 
కథ సమాప్తం


కామెంట్‌లు