సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-857
"ఆయత  స్వభావాని దుఃఖాని"న్యాయము
*****
ఆయత అనగా పొడవైనది , విస్తృతమైనది,పెద్దది. స్వభావం అనగా ఒక వ్యక్తి యొక్క సహజ ప్రవృత్తి అనగా భావోద్వేగాలు, ప్రవర్తన,స్పందన, అంతర్గత లక్షణాల మిళితం.దుఃఖం అనగా దుఃఖము,బాధ,కష్టం,శోకం విచారం, నిరాశ అనే అర్థాలు ఉన్నాయి.
దుఃఖములు నిలిచి వుండే స్వభావము గలవి అని అర్థము.
 ఎందుకో చూద్దాం. దుంఖాలలో రకాలు ఉన్నాయి. వాటికి కారణాలు శారీరకంగా మరియు మానసికంగా ఉంటాయి. మళ్ళీ వీటిలో స్థాయీ భేదాలు కూడా ఉంటాయి.
ఉదాహరణకు కోరిక, ఏడుపు,కోపం,తిరస్కరణ,విచారం, నిరాశ,నిద్రలేమి,అలసట, అపరాధం, ఆసక్తి కోల్పోవడం, అవిశ్వాసం, అస్తవ్యస్తత, ఏకాగ్రత లోపించడం, క్షణికమైన భ్రాంతులు, అతిగా స్పందించడం,విచారం,ఆరాటం, భయం, సిగ్గు, ఒంటరితనం, నిస్సహాయతను, నిరాశ, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం లాంటివన్నీ దుఃఖానికి హేతువులు.
ఏదైనా ఒక నష్టం జీవితంలో కలిగితే జీవితంలో మళ్ళీ కోలుకోలేనప్పుడు దీర్ఘకాలికంగా మారుతుంది.దీనిని దీర్ఘకాలిక దుఃఖము అనవచ్చు .
బాధాకరమైన దుఃఖము:- ఇది అనుకోకుండా జరిగే సంఘటనల వలన వస్తుంది. ముఖ్యంగా ప్రియమైన వారు దూరమై పోవడం లేదా మరణించడం.ప్రేమ విఫలం కావడం... ఇవి ఊహించని సంఘటనలు కాబట్టి అత్యంత వేదనను కలిగిస్తాయి. రోజూవారీ దినచర్యను కూడా దెబ్బతినేలా చేస్తుందీ దుఃఖము.
సామూహిక వేడుకలే కాదు సామూహిక దుఃఖాలు కూడా ఉంటాయి. గత నెల పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులందరిదీ సామూహిక దుఃఖముగా చెప్పుకోవచ్చు.అంతే కాదు ప్రకృతి వైపరీత్యాలు అయిన వరదలు, భూకంపాలు,సునామీ, వివిధ వాహన ప్రమాదాలు.. ఇవన్నీ సామూహిక దుఃఖానికి సంబంధించినవి.
కొన్ని కుటుంబ సభ్యల వల్ల కలిగే దుఃఖాలు - నిరాదరణ,వృద్దుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, వారిని వృద్ధాశ్రమానికి తరలించడం వలన వారిలో కలిగే దుఃఖము ఒక పట్టాన పోయేది కాదు.
ఎవరైనా తమను అనవసరంగా అవమానించినా వెంటనే దుఃఖము  వస్తుంది. అది కొద్ది సమయం కానీ, కొద్ది కాలం కాని ఉంటుంది.
 ఎంత గొప్ప ఆనందం అయినా అది కొంత సమయం మాత్రమే ఉంటుంది. మళ్ళీ అలాంటి ఆనందం పొందాలనే కోరిక కూడా పొందుతామో లేదో అనే ద్వైదీభావం వెంటాడి కొంత భయానికి, బాధకు గురి చేస్తుంది.ఇలా అది కూడా దుఃఖముగా పరిణమిస్తుంది.
ఇక కొందరి దుఃఖము విచిత్రంగా ఉంటుంది. పక్కవాడి ఉన్నతిని చూచి ఓర్వలేక,తామెంత మంచి స్థితిలో ఉన్నప్పటికీ బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారిని చూచి పెద్దలు " కుళ్ళి కుళ్ళి కుడికన్ను - ఏడ్చి ఏడ్చి ఎడమ కన్ను పోయిందట వెనుకటికి"  అంటూ చురక వేస్తుంటారు..
 బుద్ధ భగవానుడు కోరికలే దుఃఖానికి కారణం అన్నాడు. మరి పై దుఃఖాలు అన్నీ తీరని,తీర్చుకోలేని,పూడ్చుకోలేని కోరికల కారణాల వల్ల కలిగిన దుఃఖాలేనని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.
అందుకే దుఃఖమును నిలిచి వుండే స్వభావము గలది అంటారు.ఈ "అయత స్వభావాని దుఃఖాని" న్యాయము" ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే  కోరికలు దుఃఖానికి కారణం కాబట్టి వాటిని తగ్గించుకోవాలి.ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత జీవితంలో అనుభవించే దుఃఖాలు గత జన్మ కర్మలు అని సరి పుచ్చుకోవడం. ఈ రెండింటి వల్ల  కొంతలో కొంతైనా దుఃఖం నుండి ఉపశమనం కలుగుతుంది.

కామెంట్‌లు