సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-858
"ఆయాతఃప్రవాహఃకేన వార్యతే?" న్యాయము
*****
ఆయాతః అనగా పొడవైనది విస్తృతమైనది పెద్దది.ప్రవాహః అనగా(సంఘటనల) పరంపర ,వెల్లువ,మడుగ.కేన అనగా  ఎవరిచే?ఏ విధంగా ?వార్య అనగా మంచి, ఉత్తమ, గొప్ప. తే అనగా నీకు లేదా నువ్వు అనే అర్థాలు ఉన్నాయి.
వరద వచ్చింది ఎవరాపగలరు? దుఃఖ పరంపరలు వచ్చేటప్పుడు ఎవరూ వాటిని అడ్డుపెట్ట లేరు" అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
అరచేతిని అడ్డు పెట్టి ఉదయించే సూర్యుడిని, అతి వేగంగా పరుగులు తీస్తూ ఉవ్వెత్తున వచ్చే వరదను ఆపడం ఎవరి తరం కాదు.  నీటికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. పల్లం ఉంటే చాలు పరుగులు పెడుతుంది. వాగులు వంకలు ఒడ్డులు ఒరుసుకుని ఏమాత్రం బలహీనంగా ఉన్నా చెరువల గట్లను తెంపేసి ఊరూ వాడా ముంచేస్తుంది. పిడుగు ఎలా హఠాత్తుగా పడుతుందో తెలియదు. అలాగే వరద కూడా.అందుకే ఈ వరదను "జల పిడుగు" అన్నారు.
అసలు వరదలు ఎందుకు వస్తాయో? మనందరికీ తెలిసిందే కానీ మరొక సారి మననం చేసుకుందాం. అంచనాలకు మించిన వర్షాలు కురవడం.హిమానీ నదాలు అధికంగా కరగడం వల్ల పైనున్న నదులు పొంగి కిందికి ప్రవహించడం లాంటి కారణాలే కాకుండా అరుదుగా వచ్చే సునామీలు,భూకంపాల వల్ల కూడా వరదలు వస్తాయి. ఇవి హఠాత్తుగా వచ్చినప్పుడు ఆలోచించుకునే సమయం కూడా ఉండదు.అలాంటప్పుడే  ఈ వరదల వల్ల కలిగే ధన ప్రాణ,జంతు నష్టం చాలా అధికంగా ఉంటుంది.
గోదావరి లాంటి నదులకు దాదాపు ప్రతి సంవత్సరం వరదలు వస్తుంటాయి కాబట్టి ఆ ప్రాంతంలోని ప్రజలు ముందు జాగ్రత్త పడుతుంటారు.
వరదల వల్ల ఎలాంటి నష్టం కలుగకుండా చేయాలంటే  ముందుగానే పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలి . ఇదంతా వరదల బాధలు- నివారణోపాయాలు.
 మరి వరదలాగా దుఃఖ పరంపరలు వచ్చేటప్పుడు ఎవరైనా ఆపగలరా? అంటే ఆపలేమనే చెప్పాలి.
ఎందుకంటే  హఠాత్తుగా వచ్చే ఆ దుఃఖ సంఘటనలు అలాంటివి. ఏప్రిల్ లో కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకానికి 26 మంది మరణించారు. వారు అక్కడికి వెళ్ళింది సుందరమైన కాశ్మీర్ అందాలను చూడాలని. కానీ అక్కడ వాళ్ళకి కలలో కూడా ఊహించని విధంగా ఉగ్రవాదుల రూపంలో మృత్యువు ఎదురైంది. తమ కళ్ల ముందే కట్టుకున్న భర్త, కుటుంబ సభ్యులు మరణించారు. ఆ దుఃఖ పరంపరను ఎవరైనా ఆపగలమా? కోట్లు ఇచ్చినా మరణించిన వారిని బతికించుకోలేమనే వాస్తవం వారి దుఃఖాన్ని ఆపలేదు.
ఆ విధంగా అనుకోకుండా, హఠాత్తుగా వచ్చే  వారిలోనూ, అలాగే అనుకోకుండా, హఠాత్తుగా జరిగే ప్రమాదాలు, సంఘటనల వల్ల వచ్చే దుఃఖ పరంపరలనూ ఎవరూ అడ్డు పెట్టలేరు.ఆపలేరు. అని  ఈ "ఆయాతః ప్రవాహః కేన వార్యతే?"  అనే న్యాయము ద్వారా మనం తెలుసుకున్నాం.
నివారణోపాయంగా వరదల విషయంలో ముందస్తు జాగ్రత్తలనూ, దుఃఖ పరంపరల విషయంలో ఆధ్యాత్మిక వాదుల కర్మ సిద్ధాంతం, భగవద్గీతా సారాన్ని మననం చేయించి దుఃఖ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేద్దాం.

కామెంట్‌లు