సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయములు-852
"అర్కే చే న్మధు విందేత కిమర్ధం పర్వతం వ్రజేత్" న్యాయము
****
అర్కా అనగా కాంతి కిరణం,ఒక పవిత్రమైన వృక్షం.మధు అనగా తేనె,తీపి, మధురమైన. విందేత జగత్తు, లోకము. కిమర్థం అనగా ఎందుకు? ,దేని కోసం.పర్వతం అనగా కొండ,గిరి.వ్రజేత్ అనగా వెళ్లను,చేరను అనే అర్థాలు ఉన్నాయి.
అర్కము అనెడి ఒకానొక చెట్టు నందె తేనె దొరికినట్లయితే తేనెకై పర్వతముల కేల వెళ్ళవలయును?
అనగా " కేవలాచ్ఛేత్ జ్ఞానా త్పురుషార్థ సిద్ధిః స్యా ల్కిమర్థ మనేకాయా ససమన్వితాని కర్మాణి తే కుర్యుః? ఆర్కే చే న్మధు విందేత కిమర్ధం పర్వతం వ్రజేదితి న్యాయాత్" అనియు ఆర్కే చే న్మధు విందేత కిమర్ధం పర్వతం వ్రజేత్!/ఇష్టార్థస్య చ సంసిద్దౌ కో విద్వాన్ యత్న మాచరేత్!!" అనే శ్లోకాలను ఉదహరిస్తూ ఉంటారు.
అనగా కేవల జ్ఞానముననే పురుషార్థ సిద్ధి అయ్యే యెడల అనేకాయాస కరములవు ఇతర కర్మలు చేయనేల? అనే అర్థంతోనూ ,తన ఇంటి ఒక మూలలో తేనెపట్టు లోని పట్టుతేనె దొరుకుతూ ఉంటే ఆ తేనె కోసం కొండలలోనికి పోవడమెందుకు?తనకు కావలసినది ఎదురుగా దొరుకుతూ ఉంటే బుద్ధిమంతుడైన వాడు దాని కోసం పెద్ద ప్రయత్నము చేయవలెనా?... ఇట్లే తనలోనే బ్రహ్మమును తెలుసుకొనువాడు ఆ బ్రహ్మమును వెదకడము కోసము తీర్థయాత్రలు చేయనక్కర్లేదు, ఎక్కడెక్కడో  వెతకనక్కర లేదు అని దీని భావము.
ఈ విధంగా మన పెద్దలు ఈ న్యాయమును మన మనసే అన్నింటికీ మూలం.అందులోనే దొరుకుతాయి.వేరే బయట వెతకాల్సిన పని లేదు అని,ఇలా రెండు రకాలైన ఉదాహరణలతో చెబుతూ ఉంటారు.
 ఇదే విషయాన్ని వేమన తనదైన శైలిలో "మనసులోని ముక్తి మరియొక చోటను/ వెదకబోవు వాడు వెర్రివాడు/ గొర్రె చంకబెట్టి గొల్ల వెదికినట్లు/ విశ్వదాభిరామ వినురవేమ!!".. అనే పద్యంతో చెబుతాడు.
 అనగా గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు ఊరంతా వెతికినట్లు, మోక్షం కోసం వెర్రివాని వలె మనసుకు ఆవల వెతుకుతూ ఉన్నాడు. అందుకే వెదకాల్సింది బయట కాదు మనల్ని మనమే శోధించుకోవాలి. అప్పుడే మనలోని బ్రహ్మమును కనుగొనగలము అంటాడు వేమన.
 ఇంకో పద్యాన్ని కూడా వేమన ఉదహరించారు.అది కూడా చూద్దాం.
 "అన్ని జాడలుడిగి ఆనంద కాముడై/ నిన్ను నమ్మ జాలు నిష్ఠతోడ/ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీ యాన!/ విశ్వదాభిరామ వినురవేమ!!/
అనగా అన్ని మార్గాలను నశింపజేసుకుని కేవలము ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు.అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు నిజంగా చెబుతున్నాను.నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన.
ఆనందకాముడు అంటే ఇక్కడ పరబ్రహ్మను కోరుకునే వాడు. బ్రహ్మానందాన్ని ఆశించేవాడు.ఇక్కడ బ్రహ్మానందం అంటే సుషుప్తి వల్ల అనభవించబడే ఆనందం.దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. మనసును అంతర్ముఖం చేయడం వల్ల మనసులో విషయానందాలు ప్రతిఫలిస్తాయి అని అర్థము.
 కాబట్టి మనలోనే బ్రహ్మమును వెదకడము కోసము ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు అని ఆధ్యాత్మిక వాదులు చెబుతుంటారు. మనలోని ఆత్మ ఒక ఉన్నతమైన శక్తి అంటారు.అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ మరియు బ్రహ్మము ఒక్కటే.అనగా "అహం బ్రహ్మాస్మి"(:నేనే బ్రహ్మం) అనే భావన ద్వారా మనలోని బ్రహ్మమును తెలుసుకోవచ్చు  అంటారు.
 ఈవిధంగా మనలోనే ఉన్న బ్రహ్మమును కనుగొందాం.  మనశ్శాంతి కావాలన్నా, బ్రహ్మానందం  పొందాలన్నా బయట ఎక్కడో దొరకదు.అది మనలోనే దొరుకుతుంది. ఇదే మనం "ఈ  ఆర్కే చే న్మధు విందేత కిమర్ధం పర్వతం ప్రజేత్" న్యాయము నుంచి తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక నీతి.

కామెంట్‌లు