తిరుమలరావు దానవీరశూరకర్ణ కవితకు ప్రశంసాపత్రం

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో ప్రశంసాపత్రం సాధించారు. రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు డా.దూత రామ కోటేశ్వరరావు నేతృత్వంలో నచ్చిన సినిమా అను అంశంపై కవిత పోటీలను నిర్వహించగా తిరుమలరావు పంపిన దానవీరశూరకర్ణ అనే కవిత ఎంపికై ప్రశంసాపత్రం సాధించింది. ఈమేరకు ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, సుర్దేపల్లి కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన కవితల పోటీలకు కవిత పంపిన తిరుమలరావును అభినందిస్తూ నిర్వాహకులు పురస్కార ప్రశంసాపత్రం పంపించారు. కేవలం నలభై రోజుల్లోనే అన్నగారు ఈ మూవీని నిర్మించడం ద్వారా ఆయన అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, పట్టుదల, అత్యున్నత క్రమశిక్షణ ప్రస్ఫుటమౌతున్నాయని తిరుమలరావు తన కవితలో వివరించారు. మూడు పాత్రలను అవలీలగా పోషించుటలో తన నట విశ్వరూపాన దాగియున్నాడు ఓ తత్వవేత్త అని ఎన్టీఆర్ గురించి, వారి సేవలను తన కవితలో స్పష్టపరిచారు. దేశంలో షోలే తరువాత అత్యధిక డైలాగ్స్ కేసెట్లు అమ్ముడైన మూవీ దానవీరశూరకర్ణ అని, ఇందులో ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివీ అనే అన్నగారి డైలాగులు ఇప్పటికీ ఖ్యాతిగాంచిన విషయం ఆయన తన కవితలో చాటి చెప్పారు. దానవీరశూరకర్ణ చిత్రం ఒక గొప్ప పౌరాణిక విజ్ఞాన గాథ, అద్భుత దృశ్యకావ్యం అంటూ తన కవితలో చాటి చెప్పారు. తిరుమలరావుకు ప్రశంసాపత్రం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు