సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-854
"అపృష్టోపి హితం వదేత్ "న్యాయము
****
అపృష్టో అనగా అడగకుండా,పిలవ కుండా.ఓపి అనగా ఓపిక లేదా శ్రమ.హితం అనగా మేలు,లాభం,సౌకర్యం,తగిన వస్తువు,శుభమైనది,ఉపయోగ కరమైనది, ప్రయోజనకరమైనది. వదత్ అనగా మాట్లాడే వాడు,మాట్లాడుతున్నాడు అని అర్థము.
"అడగక పోయినా హితమును చెప్పవలెను"  అన్నట్లు.
 ముఖ్యంగా పిల్లలకు" ఏది మంచో?ఏది చెడో? తెలియదు.అందుకే వాళ్ళు అడగకుండానే తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు  హితోక్తులు అనగా మేలు కలిగించే మంచి మాటలు చెబుతూ ఉంటారు. చెప్పాలి కూడా.
అలా చెప్పకపోతే చెడిపోయే, చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. "తోటకూర నాడే చెప్పకపోతినిరా కొడుకా"అనే  సామెత కథను చూద్దామా.అనగనగా ఒక ఊరిలో తన చిన్న కొడుకుతో కాలం గడుపుతూ ఉంది. వాడు ఒక సారి తమ పక్కింటి వాళ్ళ పెరట్లోని తోటకూర కోసుకొచ్చి తల్లికి ఇస్తాడు. కూర వండిపెడుతుంది.కానీ అది ఎలా తెచ్చావు? ఎవరినైనా అడిగి తెచ్చావా? లేదా అని అడగలేదు.పైగా నీవు తెచ్చేటప్పుడు ఎవరైనా చూశారా? అని అడుగుతుంది.ఎవరు చూడలేదు అన్నపుడు సంతోష పడుతుంది. 
ఆ విధంగా ఆ పిల్లవాడికి ఎవరూ చూడకుండా ఇతరుల వస్తువులను, ధనాన్ని తీసుకుని రావడం తప్పు కాదనే భావన మనసులో నాటుకుపోతుంది.
అది మొదలు చిన్న చిన్న దొంగతనాలతో మొదలు పెట్టి పెద్ద పెద్ద దొంగతనాలు కూడా ఎవరికీ పట్టుపడకుండా చేయసాగాడు. ఏనాడు తల్లి అతడికి 'అలా చేయడం తప్పు 'అని చెప్పలేదు.
కాలం గడుస్తోంది.ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక గజ దొంగగా మారాడు.ఒకరోజు ఏకంగా రాజు గారి కోటలోనే దొంగతనం చేశాడు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా! దొంగ సొమ్ముతో సహా భటుల చేతిలో చిక్కాడు.
 రాజు గారు అతడికి మరణ శిక్ష విధించారు.ఆ సమయంలో తన చివరి కోరికగా తల్లిని పిలిపించమని అడుగుతాడు. తల్లి వస్తుంది.ఆమెను చూపిస్తూ "ఈ శిక్ష నాకు కాదు మా అమ్మకు పడాలి. ఎందుకంటే "చిన్నప్పుడు తోటకూర దొంగతనంగా తీసుకుని వస్తే అది తప్పు అలా ఇతరుల సొమ్ము కానీ వస్తువులు గానీ ఏవైనా అడగకుండా తీసుకుని రాకూడదు అని చెప్పలేదు.పైగా ఎవరూ చూడలేదు కదా!అని సంతోషపడింది. ఆ రోజునే తప్పు అలా చేయకూడదు అని చెబితే నేనిలా దొంగగా మారేవాడిని కాదు"అంటాడు. ఆ మాటలు విన్న అతడి తల్లి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ "తోటకూర నాడే చెప్పకపోతినిరా కొడుకా!" "నిజమే ! తప్పు వాడిది కాదు నాదే. ఆ రోజు మంచి చెడుల మధ్య ఉన్న తేడాకు సంబంధించి హితవు చెబితే  ఇలా నా కొడుకు గజ దొంగ అయ్యే వాడు కాదు" అంటుంది.
పిల్లలకు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు అడగకుండానే హితవు చెప్పాల్సిన బాధ్యత పెద్దవాళ్ళపై ఉంది.
కేవలం పిల్లలకే కాకుండా దగ్గరి వాళ్ళకు, బాగా పరిచయం ఉన్న వాళ్ళకూ,స్నేహితులకు, అడగకుండానే  వారి హితం కోరి మంచి మాటలు చెప్పాలి. దీనికి సంబంధించిన ఉదాహరణ మనం రామాయణంలో చూస్తాం.
రావణాసురుడు సీతాదేవిని అనుసరించేందుకు వెళ్తూ మారీచుని సహాయాన్ని కోరుతాడు. మారీచుడికి రాముని గురించి తెలుసు.అలాగే తమ ఏలిక అయిన రావణాసురుడు దుర్మార్గుడనీ  తెలుసు.అయినా రావణుడు మారుతాడనే  ఆశతో ఎంతగానో హితబోధ చేస్తాడు. ఆ సందర్భంలో ఇలా అంటాడు."ఓ రాజా! నీ చెవులకు ఇంపయ్యే మాటలు చెప్పేవారు చాలా మందే ఉంటారు.అయితే నీ చెవులకు ఇంపుకాని అయిష్టమైనా నీ మేలు కోరి ఆచరిరించదగిన మంచి మాటలు చెప్పేవారు చాలా తక్కువ. కాబట్టి నా మాట విని ఆ ప్రయత్నం విరమించుకో"అని చెబుతాడు. ఆ మాటలు వినకుండా మారీచుడినే హతమారుస్తానని బెదిరించి  బంగారు జింకగా అతడిని ఉపయోగించుకోవడం మనందరికీ తెలిసిందే.
"అపృష్టోపి హితం వదేత్" న్యాయం ఎక్కువగా పాఠశాలలో గురువులకు వర్తిస్తుంది. ఎందుకంటే  తమ పాఠాలు వింటూ ఎక్కువ సమయం తమతో గడిపే విద్యార్థులు మంచి పౌరులుగా తీర్చి దిద్దబడాలనే తపన ఉపాధ్యాయుల్లో ఉంటుంది. అందుకే కేవలం పాఠాలతో సరిపుచ్చకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే  ఎన్నో హితవు మాటలు చెబుతుంటారు.
 "అపృష్టోపి హితం వదేత్" న్యాయం చెప్పినట్లు మనమూ మన వాళ్ళకు అడగక పోయినా మంచి మాటలు చెబుదాం.

కామెంట్‌లు