శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - - 122
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
101. మణిపూరాన్తరుదితా (అష్టాక్షరీ)
102. విష్ణుగ్రంధివిభేదినీ (అష్టాక్షరీ)
నూట రెండవ నామ మంత్రము - 
  ఓం విష్ణుగ్రంధివిభేదిన్యై నమః
మూలాధార చక్రములో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి, పైకి ప్రయాణం చేస్తూ "సహస్రార చక్రము" క్రింద, పైన ఉన్న "బ్రహ్మగ్రంధు"లను భేదించి/విడదీసి, తన సాధకుని అజ్ఞానాన్ని పోగొట్టి, ఆ సాధకుని దృష్టిని / ఆలోచనలనూ నిత్యము, సత్యము అయిన వస్తువు వైపు తిప్పుతూ, "అనాహత చక్రము"లోనికి ప్రవేశించి "విశుద్ధి చక్రము"ను చేరడానికి ముందు వున్న "విష్ణుగ్రంధి"ని ఛేదిస్తున్నట్టుగా/ముడి విప్పుతున్నట్టుగా కనిపించిన శ్రీమహారాజ్నిని చూసి, వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "విష్ణుగ్రంధివిభేదినీ" అని పిలిచి కీర్తించారు. "విష్ణుగ్రంధివిభేదినీ" గా దర్శనం ఇస్తున్న జగన్మాతకు నమస్కారము.
బ్రహ్మగ్రంధులను విప్పడం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నాము. ఇప్పుడు, ఈ నామంలో వచ్చే "విష్ణుగ్రంధి", మణిపూర, అనాహత చక్రముల పైన ఉంది.
పంచకోశములలో, భౌతిక తత్వాన్ని ప్రతిబింబించే అన్నమయకోశంలో, స్థూలశరీరానికి ప్రతీకగా ఉంది"బ్రహ్మగ్రంధి ". ఈ బ్రహ్మగ్రంధి భేదన ద్వారా సాధకులు అజ్నానాన్ని వదలి, ఈ స్థూలంగా కనిపించే భౌతిక రూపం కాకుండా, నిత్యమైన "పరబ్రహ్మ తత్వం" ఒకటి తనలోనే శాశ్వతంగా ఉంది, అనే స్ఫురణను పొందుతాడు అని తేలుసుకున్నాము. ఈ పరబ్రహ్మ తత్వంను తెలుసుకునే తన ప్రయత్నాలు కొనసాగిస్తూ, "భౌతిక శరీరం" కన్నా "స్థూల శరీరం"  గొప్పది అని తెలుసుకుంటాడు, సాధకుడు.
బ్రహ్మగ్రంధి భేదన ద్వారా, స్థూల శరీరాన్ని కొరి వచ్చిన వనిత, పర్యవసానంగా వచ్చిన సంతానాము, వీరంతా తనవారని, వారికి ఇంకా ఎక్కువగా ఏదేదో చెయాలని వచ్చే ఆలోచనలు, ఇవి అన్నీ కూడా "పరమేశ్వరి మాయ"గా గుర్తిస్తాడు సాధకుడు. ఈ మాయపొర చాటు తొలగిన సాధకుడు "నా వలననే ఈ జగత్తు మొత్తము నడుస్తోంది" అనే అహంకారాన్ని, అజ్నానాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అత్యంత అందమైన, సత్యమైన ఆనందాన్ని ఇచ్చే "పరబ్రహ్మం" వైపు, పైపైకి తన ప్రయాణం సాగించాలి, అనే జ్ఞానాన్ని పొందుతాడు.
"విష్ణుగ్రంధి భేదన" తో సాధకులలో ఉన్న అజ్ఞానము, అహంకారము, నేను, నాది, నా వల్లనే అనే భావనలు అన్నీ పూర్తిగా తొలగిపోయి, ఇంకా తాను పొందవలసిన జ్ఞానాన్ని వెతుక్కుంటూ అమ్మ వైపు తన ప్రయాణం నిశ్చల చిత్తంతో, దశదళ పద్మములో ఉన్న సన్నటి దారాన్ని పట్టుకుని, చేయాలి అనే భావన సాధకునిలో స్థిరపడుతుంది.
ఈ విధంగా "విష్ణుగ్రంధి భేదన" ద్వారా తన సాధనా మార్గాన్ని సుగమం చేసుకుంటూ, తనను చేరాలి అని తపించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం విష్ణుగ్రంధివిభేదిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు