కన్నయ్య భరోసా: - - యామిజాల జగదీశ్
 యమునా నది నుండి బొమ్మను తిరిగిచ్చిన కృష్ణుడి లీల....
ఒకనాడు బృందావనంలో, ఒక బాలుడు యమునా నది ఒడ్డున తనకిష్టమైన చెక్క బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఇంతలో  అనుకోకుండా ఆ బొమ్మ కాస్తా అతని చేతి నుండి జారి ప్రశాంతమైన యమునా నదిలో పడిపోయింది. ఆ బొమ్మ నదీ ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది. ఇది చూసి ఆ బాలుడు ఎంతో విచారంతో అక్కడే నిలబడి ఏడుస్తున్నాడు.
ఆ సమయానికి బాలకృష్ణుడు తన మిత్రులతో కలిసి అక్కడికి వచ్చాడు. బాలుడి విచారవదనాన్ని చూసి, కృష్ణుడి హృదయం కరిగిపోయింది. ఆ బాలుడిని దగ్గరకు తీసుకుని ప్రేమతో ఎందుకేడుస్తున్నావు? ఏమైంది? అని అడిగాడు. తనకెంతో ప్రియమైన బొమ్మ నీటిలో పడిపోయిందని బాలుడు చెప్పగానే శ్రీకృష్ణుడు వెంటనే యమునా నది ఒడ్డుకు వెళ్ళాడు.
కృష్ణుడు మధురమైన చిరునవ్వుతో నీటిలోకి తన చేతిని చాచాడు. కొన్ని క్షణాల్లోనే, ఆయన ఆ బొమ్మను కనుగొని ఎంతో ఆప్యాయంగా బాలుడికి ఇచ్చాడు.
తన ప్రియమైన బొమ్మను తిరిగి పొందిన ఆ బాలుడి ముఖం ఆనందంతో వికసించింది. ఈ సుందరమైన దృశ్యాన్ని చూసిన గోపయ్య సహచరులందరూ ఆనందంతో గంతులేసారు.
యమునా నది ఒడ్డున నిలబడి ఉన్న గోవులు, వికసించిన పద్మాలు, మధురంగా ​​గానం చేస్తున్న పక్షులు కూడా ఈ కరుణామయ లీలకు సాక్షులుగా కనిపించాయి.
ఈ లీల మనకు చెప్పే సందేశం ఏంటంటే,
శ్రీకృష్ణుడు తన భక్తుల దుఃఖాలను, సమస్యలను మాత్రమే కాకుండా, చిన్న చిన్న చింతలను కూడా తీర్చి ఓదారుస్తాడు. ఏ కష్టమొచ్చినా తానున్నానని భరోసా ఇస్తాడు. నమ్మకం కల్పిస్తాడు. కృష్ణుడి ప్రేమ, కరుణ అందరి పట్ల సమానంగా ఉంటాయి. మనం నిజమైన విశ్వాసంతో ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మన జీవితంలోని చిన్న చిన్న దుఃఖాలను సైతం తొలగించి మనకు సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఇందులో రవ్వంత సందేహమూ అక్కర్లేదు.

కామెంట్‌లు