శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 137
 



వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
115. భద్రప్రియా (చతురక్షరీ)
116. భద్రమూర్తి (చతురక్షరీ)
నూట పదహారవ నామ మంత్రము:
ఓం భద్రమూర్త్యై నమః
భద్ర = మంగళమైన / మంగళప్రదమగు, మూర్తి = స్వరూపము గలది / మూర్తి కలది
పసుపు, కుంకుమ, గాజులు, పుష్పములు, శుభాన్ని సూచించే అన్ని ఆభరాణాలు తానే అయి, సహస్రారము మధ్యలో శంకరుని చేరి, అన్ని విధాలైన మంగళములకూ మంగళమును చేకూర్చే మంగళకరమైనదిగా, తానే శుభ మంగళ మూర్తిగా దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "భద్రమూర్తీ" అని పిలిచి కీర్తించారు. అన్ని మంగళములకూ, మంగళమును చేకూర్చే పరమేశ్వరికి నమస్కారము.
బ్రహ్మమే మంగళము" అని దైవీ వాక్కు. బ్రహ్మమును మంచిన మంగళకరమైన పదార్ధాము, ఈ చరాచర జగత్తులో లేదు, కనబడదు కూడా. అటువంటి అన్ని బ్రహ్మములకు, మంగళమును ప్రసాదిస్తుంది, కనుక పరమేశ్వరి "భద్రమూర్తి" అయ్యింది.
 జీవులు చరించే ఈ చరాచర జగత్తులో, జీవుడికి ఒకసారి మంగళము / శుభము కలిగినా కూడా, ఇది సత్యమైనది కాదు. నిత్యమూ ఉండదు. మళ్ళీ మంగళము కోసం అన్వేషిస్తూ జీవుడు ప్రయాణించవలసిందే. కానీ, ఒక్కసారి, బ్రహ్మములకే బ్రహ్మమైన పరమేశ్వరి మనలను అనుగ్రహించి, అక్కున చేర్చుకుంటే, అదే పరము, పరబ్రహ్మము, నిత్యమూ, శాశ్వతము. ఆ విధంగా, శ్రీవిద్యోపాసకులైన సాధకులకు, నిత్యమైన పరమును ఇచ్చే అమ్మ, "భద్రమూర్తి".
ఈ బ్రహ్మమే తానైన పరమేశ్వరి యొక్క అనుగ్రహం పొందిన సాధకులకు, అమంగళములు, అశుభములు జరగవు. దగ్గరకు కూడా రావు. జగన్మాత, ముత్యములు, పగడములు, శంఖము, శివలింగాలలో "భద్రమూర్తి" గా ఉంటుంది, అని వేద వాక్కు. వివాహిత అయిన స్త్రీమూర్తి నుదిటిపై పాపిటి మొదలులో కూడా, పరమేశ్వరి స్థిరంగా "భద్రమూర్తి" గా ఉంటుంది. ఈ కారణం చేతనే, వివాహమైన స్త్రీలు పాపిటలో కుంకుమ ధరిస్తారు. ఐదు మంగళకర వస్తువులు అయిన, పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మంగళసూత్రం వీటిలో పరమేశ్వరి "మంగళగౌరి దేవత" గా ఉంటుంది.
ఈ జగత్తులో మంగళాన్ని కలిగించే, సూచించే అన్ని వస్తువులులలో  "భద్రమూర్తి" గా ఉంటూ, మనతో నిత్యమూ సహచరిగా ప్రయాణం చేస్తూ, మనకు శుభాలను మాత్రమే ఇచ్చి, అంత్య కాలములో మనలను తనలో కలుపుకోడానికి, మనతో కలిసి అడుగులో అడుగు కలుపుతున్న పరదేవతను, పరమగురువు, సద్గురువు అనుగ్రహం తో గుర్తించి, గట్టిగా పట్టుకుని వుండే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం భద్రమూర్త్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు