గాంధీ సిద్ధాంతాలతో ఏర్పడిన ఆశ్రమాలు- 2: - అనువాదం..అచ్యుతునిరాజ్యశ్రీ
 

డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
ఆనందనికేతన్ హరిజన ఆశ్రమం1923 లో రాజమండ్రీలో ప్రారంభమై ఆపై చాగల్లుకి మార్చబడింది. తల్లాప్రగడ నర్సింహశర్మ ఆయన భార్య విశ్వసుందరమ్మ  ,సోదరుడు ప్రకాశరాయుడు నిర్వహించారు.సబర్మతీ అడుగు జాడల్లో  హరిజనోద్ధరణకై కంకణం కట్టుకున్నారు. చిగురుపాటి భీమయ్య అనే హరిజన కుర్రాడితో ఆరంభం,ఆపై డజనుమంది పిల్లలు చేరారు.కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు బిల్డింగ్ నిర్మిస్తే చాలామంది దాతలు ముందుకొచ్చారు.నేతపని,ఖాదీ ఉత్పత్తులు,నూనెలతయారీ, చెప్పులు కుట్టడం,కూరలు పళ్లు పూలతోటల పెంపకం లో శిక్షణ ఇచ్చారు.మహిళలు బాలికలు గూడా సాయపడ్డారు. 70ఏళ్లు పైబడిన తల్లాప్రగడ రాజమ్మ, యశోదమ్మ కూడా అంటరానితనంకి మంగళహారతి పాడారు.విశ్వసుందరమ్మ కవయిత్రి కావటంతోపిల్లలపేర్లు కూడా ఇలా మార్చారు...గంగన్నని విష్ణుగా,చింతన్నని చిత్తరంజన్ గా, చిన్నయ్య ను మోహనదాస్ గా దేశ భక్తుల పేర్లు పెట్టడం,వారు బాగా రాణించి మంచి ఉన్నత స్థితిలో స్థిరపడటం జరిగింది.1929లో గాంధీజీ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు.
1933లో స్వామి సీతారాం,తుమ్మల బసవయ్య, ఆయన భార్య దుర్గాంబ  గుంటూరు జిల్లాలో కల్యాణ కావూరు లో వినయాశ్రమాన్ని ప్రారంభించారు.తుమ్మల దంపతులు తమ ఆస్తులను దానంచేసి ఈఆశ్రమంలో ఉన్నారు.కుప్పుస్వామిచౌదరి 15ఎకరాలు దానంచేశారు.25.12.1933లో గాంధీజీ ప్రారంభించారు.హిందీ ప్రచారం,బేసిక్ ఎడ్యుకేషన్,వ్యవసాయం,పాడి,కుటీరపరిశ్రమలతో కళకళలాడిన వినయాశ్రమం ఆర్థికంగా ఎంతోమంది  హరిజనులకు,మహిళలకు అభయహస్తం అందించింది.గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం గోదావరి ఒడ్డున  సీతానగరంలో9.11.1924లో ఆరంభమైనది.డాక్టర్ బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యంగారు తన ప్రాక్టీసు మానేసి సేవారంగంలో దూకారు. సేఠ్ జీవన్ లాల్ అనే అల్యూమినియం వ్యాపారి ఈఆశ్రమానికి తన ఆదాయంలో కొంత విరాళం ఇస్తానని ముందుకు రావటంతోగుడిసెలు,  భవంతులతో పాటు పల్లేటి సత్యనారాయణ గారి సోదరి విరాళంతో బావిని త్రవ్వించారు.ఖాదీ ఉత్పత్తి, నూలు వడకటం,నేత పనికి భరణీప్రగడ శేషగిరిరావుగారు ఇచ్చిన ప్రోత్సాహంతో,రంగులతో వస్త్రాలు,సిల్క్ అంచులతో తయారై అందరినీ ఆకట్టుకున్నాయి.ఉత్పత్తి పెరిగి లాభాల బాట పట్టింది.నాగులపల్లి రామక్కపేటలో ఖాదీ పరిశ్రమ ఊపందుకుంది.గాంధీ తన యంగ్ ఇండియాలో ఇలా రాశారు"లైబ్రరీ  తెలుగు జర్నల్స్ ప్రచురణ,హిందీ ప్రచారంతో బాటు 190మంది నేత గాళ్ల హస్త కళలు ఉపాధికి బాటలేర్పరిచాయి.నెలకి వారి నికర ఆదాయం 15రూపాయలు.హరిజనులకు సగం ధరకే ఖాదీ వస్త్రాలు  అమ్మేవారు. లక్ష్మీనరసమ్మ గారు,వృద్ధాప్యం పైబడినా స్ఫూర్తిదాత గా నిలిచారు.సుబ్రమణ్యం గారి తల్లి ఆమె."గొప్ప వారు తమ ప్యాంట్ సూట్లకోసం ఇక్కడి ఖాదీనే కొనేవారు .సుబ్రమణ్యంగారి భార్య  రాజ్యలక్ష్మి సత్యాగ్రహాల్లో పాల్గొంటూ ,అరెస్టయిన వారి కుటుంబాల్ని ఆదుకునేవారు. బ్రిటిష్ వారు ఆఆశ్రమాన్ని 1933లో నాశనం చేయటం,సుబ్రమణ్యం గారి మృతితో కుంటుపడినదానికి దుర్గాబాయిదేశ్ముఖ్, విద్యాదేవి ఓంప్రకాష్ మొదలైన వారివల్ల కాస్త దారిలో పడింది.బాల్వాడి,సర్వీస్ హోం,గ్రామ సేవికా శిక్షణ, అంగన్వాడీ కార్యకలాపాలతో, మహిళల అభ్యున్నతికి  కృషిచేసింది.గాంధీ స్వరాజ్ ఆశ్రమం పోలవరం వద్ద పుసులూరికోదండరామయ్య,ఎ.వెంకట రామయ్య గార్ల కృషివల్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన పిల్లల కోసం ఏర్పడింది.గాంధీజీ దీన్ని సందర్శించారు.ప్రజల్లో  దైవ భక్తి దేశభక్తి,క్రమశిక్షణ, ప్రార్ధనతో ఉదయకార్యక్రమాలు ప్రారంభించడం,భర్తలతో పాటు వారి భార్యలు,వృద్ధమాతలు ఆశ్రమ నిర్వహణలో పాలు పంచుకోటం, నిస్వార్థ సేవ తో చరిత్రలో నిలిచాయి.తెలుగుజాతికి క్రమశిక్షణ తెచ్చి స్వాతంత్య్రంతో పాటు సమాజసేవ లో పిల్లలు మహిళలను భాగస్వాములుగా చేశాయి.వారి త్యాగాలు దయా దాతృత్వం తో పునీతం తెలుగుప్రాంతాలు
కామెంట్‌లు